Tuesday, May 21, 2024

కొత్త జిల్లాల రద్దుకు కుట్ర

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ -టాక్స్ పేరుతో వసూళ్ళకు పాల్పడుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ కేవలం ఆరోప ణ చేయడం కాదని, దమ్ముంటే ఇడి, ఐటిలను రంగంలోకి దించి విచారణ జరిపించాలని మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు డిమాండ్ చేశారు. బస్సుయాత్రలో భా గంగా మంగళవారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జి ల్లా కేంద్రంలోని సూపర్ బజార్ సెంటర్లో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్ ట్యాక్స్ పే రుతో ఎవరు వసూళ్ళు చేస్తున్నారో విచారణ జరిపించి దోషులను పట్టుకోవాలని, కానీ ఈ ప్రధానికి అది చేత కాదని వ్యాఖ్యానించారు. వీరిద్దరూ (మో డీ, రేవంత్) కలిసి నాటకాలు అడుతున్నారని, కాంగ్రెస్, బిజెపి ఒక్కటేనని ఈ ఇద్దరిలో ఎవరికి ఓ ట్లు వేసినా గోదావరిలో వేసినట్లేనని అన్నారు. ఈ రెండు పార్టీల కథ ఇక ముగిసినట్లేనని వ్యాఖ్యానించారు. మోడీ హయాంలో మత విద్వేషాలను, ఉద్రేకాలను పెంచి ఓట్లను దండుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో ఒక్క మత ఘర్షణ కూడా జరగలేదని అన్నారు. ప్రధాని పదే పదే ముస్లిం, హిందువుల గురించి మాట్లాడుతూ రెచ్చెగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. బిఆర్‌ఎస్ హయాంలో రంజాన్ పండగ వస్తే తోపాలను అందించానని, కాంగ్రెస్ హయాంలో అందాయా అని ఆయన సభికులను ఉర్దూ భాషలో ప్రశ్నించి కొంతసేపు ప్రసంగించారు. తమది పూర్తిగా సెక్యులర్ పార్టీ అని అన్నారు.

కొత్త జిల్లాల రద్దుకు రేవంత్ రెడ్డి కుట్ర
పరిపాలన సౌలభ్యం కోసం తాను ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను రద్దు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అనాడు చర్ల, వాజేడు, దుమ్ముగూడెం వంటి ఏజెన్సీలోని మండల ప్రజలు ఖమ్మం జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే ఇబ్బందులు పడేవారని, తాను కొత్తగూడెం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఈ జిల్లాను రద్దు చేయడానికి రేవంత్ రెడ్డి పూనుకుంటున్నారని ఆరోపించారు. పరిపాలన ప్రజలకు మరింత చేరువ కావాలని కొత్తగూడెంలో బ్రహ్మండమైన కలెక్టర్ కార్యాలయాన్ని నిర్మిస్తే ఇప్పుడు ఇవన్నీ తీసివేయడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కొత్తగూడెం జిల్లాగా ఉండాలంటే ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థులు నామా నాగేశ్వర్ రావు, మాలోతు కవితను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ దారుణంగా మోసం చేసిందని అన్నారు. రైతుబంధు సాయం పెంపు, కళ్యాణలక్ష్మికి తోడు తులం బంగారం అందరికీ వచ్చిందా అని ఆయన సభకు వచ్చిన ప్రజలను ప్రశ్నించారు.

మిషన్ భగీరథ పథకం ద్వారా మారుమూల గిరిజన ప్రాంతమైన దొంగతొప్పు గ్రామానికి తాగునీటిని అందించానని, గిరిజనులందరికీ త్రీఫేజ్ విద్యుత్‌ను అందించానని గుర్తు చేశారు. రాష్ట్రంలోనే ఏ జిల్లాకు ఇవ్వని విధంగా కొత్తగూడెం జిల్లాలో లక్షా 55 వేల గిరిజనులకు పోడు పట్టాలను అందించడమే కాకుండా వారందరికీ రైతుబంధు పథకం, రైతుబీమా పథకాలను అమలు చేయించానని వివరించారు. గిరిజన, దళిత, మైనార్టీలకు ప్రత్యేకంగా గురుకులాలను ఏర్పాటు చేయించానని, బిసి, ఎస్‌సిలకు మొత్తం 1100 గురుకులాలను ఏర్పాటు చేయగా ఆయా గురుకులాల నుంచి ఐఐటి, ఐఎంఎంలలో ఎంతోమంది విద్యార్థులు సీట్లను సంపాదించారని అన్నారు. దళితలకు, గిరిజనులకు 20 లక్షల ఓవర్‌సీస్ స్కాలర్ షిప్‌లను, ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చామని, ఇప్పుడున్న ప్రభుత్వం ఏంచేస్తోందని ప్రశ్నించారు.75 ఏళ్ళ స్వాతంత్య్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా గిరిజనులకోసం బంజారా భవనాన్ని నిర్మించి ఇచ్చామన్నారు. చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ కట్ కలిసిందని విమర్శించారు. బిఆర్‌ఎస్ హయాంలో సింగరేణి కార్మికులకు ఎంతో లాభం జరిగిందని, చరిత్రలో ఎవరూ ఇవ్వని విధంగా బోనస్‌ను చెల్లించి లాభాల్లోకి తీసుకొస్తే ..

ఇప్పుడున్న ముఖ్యమంత్రి చోటాభాయ్, ప్రధాని నరేంద్రమోడీ బడే భాయ్ ఇదరూ కలిసి సింగరేణిని నష్టాల్లో ముంచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదానీకి చెందిన అస్టేలియా బొగ్గును దిగుమతి చేసుకోవాలని మోడీ కోరగా ఒక టన్ను కూడా కొనకుండా తెలంగాణ సింగరేణిని కాపాడానని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన ఆటో డ్రైవర్ల జీవనోపాధి కొల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారి బతుకులు బాగు పడాలంటే బిఆర్‌ఎస్ గెలవాలని అన్నారు. భువనగిరి గురుకులంలో ఒక విద్యార్థ్ధి కలుషితాహారం తిని చనిపోతే పట్టించుకోలేదని, పేద విద్యార్థులంటే అలుసా అని ప్రశ్నించారు. పదేళ్ళ బిజెపి ప్రభుత్వంలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని, బేటీ బడావో, బేటీ బచావో ఎక్కడైనా కన్పించిందా అని ప్రశ్నించారు. తెలంగాణకు ఒకే ఆధారం అయిన గోదావరిని ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడు, కర్నాటకు తీసుకెళ్ళేందుకు కుట్ర చేస్తున్నారని, ఇది జరిగితే మన బతుకులు ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. సీతారాం ప్రాజెక్టు ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు తాము ప్రయత్నించామని, ఇప్పుడు ఇచ్చంపల్లి వద్ద అనకట్ట కట్టి గోదావరి నీటిని మీ కళ్ళముందే ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు మెదపడం లేదన్నారు. ఈ విషయం ఆషామాషీ కాదని, తెలంగాణకు జీవన్మరణ సమస్య అని,

దీనిపై మేధావులు విద్యావంతులు యువత ఆలోచించాలని కోరారు. కేంద్రంలో మళ్ళీ మోడి వస్తే వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టడం ఖాయమని, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీటర్లను బిగించాలని కోరగా తన తల తెగిపడినా పెట్టనని తెగేసి చెప్పానని అన్నారు. ఇప్పడు చోటేభాయ్, బడే భాయ్ మోటర్లకు మీటర్లను బిగించేందుకు కుట్ర చేస్తున్నారని తస్మాత్త్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. తెలంగాణ హక్కులు, కేంద్రం నుంచి నీళ్ళు, నిధులు రావాలంటే, తెలంగాణ ఆత్మ గౌరవం నిలబడాలంటే కేంద్రంతో పేగులు తెగేదాకా పోరాడేది కేవలం బిఆర్‌ఎస్ ఎంపిలేనని అన్నారు. ఈ బస్సుయాత్రలో ఖమ్మం, మహబుబ్ బాద్ ఎంపి అభ్యర్థ్ధులు నామా నాగేశ్వర్ రావు, మాలోతు కవిత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, జనగాం ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్ రెడి, ఎంఎల్‌సి దేశపతి శ్రీనివాస్, తాతా మధు, మాజీ ఎంఎల్‌సిలు రేగా కాంతారావు, సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వర్ రావు, జెడ్‌పి చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, వనమా రాఘవ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News