Saturday, July 27, 2024

పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది తెలంగాణలో పరిపాలన: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది తెలంగాణలో పరిపాలన అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. ప్రముఖ కళాకారుడు అలె లక్ష్మణ్ తయారు చేసిన రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ చరిత్రకి, సాంస్కృతిక వారసత్వానికి, గంగా-జమునా తహజీబుకి ప్రతీకలైన కాకతీయ తోరణం, చార్మినార్ ఉంటె అది రాచరిక పోకడనట అని పేర్కొన్నారు. కానీ రాష్ట్ర గీతంలో మాత్రం అదే చార్మినార్ గురించి గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ అని పాడుకోవాలి..కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప అని అదే రాచరిక పరిపాలన గురించి ప్రస్తుతించాలి అని వ్యాఖ్యానించారు. అసలు ముఖ్యమంత్రికి గాని, ఆయన మంత్రిమండలిలో ఒక్కరికైనా రాష్ట్రగీతంలో ఏమున్నదో తెలుసా..? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

కాకతీయ కళాతోరణం అంటే ఎందుకంత కోపం..?

రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్షతో రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చెరిపేస్తే సహించబోమని, పౌరుషానికి ప్రతీకైన ఓరుగల్లు సాక్షిగా ప్రభుత్వ సంకుచిత నిర్ణయాలపై సమరశంఖం పూరిస్తామని కెటిఆర్ హెచ్చరించారు. తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఇదేం రెండు నాల్కల వైఖరి..? ఇదెక్కడి మూర్ఖపు ఆలోచన అంటూ కెటిఆర్ ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపం..?.. చార్మినార్ చిహ్నం అంటే మీకెందుకంత చిరాకు అని అడిగారు. అవి రాచరికపు గుర్తులు కావని, వెయ్యేళ్ల సాంస్కృతిక వైఖవానికి చిహ్నాలు అని పేర్కొన్నారు. వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలు అని వ్యాఖ్యానించారు. జయజయహే తెలంగాణ గీతంలో ఏముందో తెలుసా..? అని ప్రశ్నించారు. కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప అనీ, గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ అని తెలిపారు. అధికారిక గీతంలో కీర్తించి.. అధికారిక చిహ్నంలో మాత్రం అవమానిస్తారా అంటూ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News