Tuesday, April 30, 2024

సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో గెలిచేది గులాబీ పార్టీనే : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎంపి, కేంద్రమంత్రి గత ఐదు సంవత్సరాలలో చేసింది ఏమీ లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన కిషన్ రెడ్డి హైదరాబాద్ నగరానికి గానీ తెలంగాణకు గానీ ప్రత్యేకంగా తీసుకువచ్చిన అదనపు ప్రాజెక్టుగానీ, ఒక్క రూపాయి అదనపు నిధులు కానీ ఏం లేవని విమర్శించారు. ఇదే అంబర్‌పేట్ నియోజకవర్గంలో ప్రజల చేతిలో తిరస్కారానికి గురైన తర్వాత, అదృష్టవశాత్తు గత ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపిగా గెలిచారన్నారు. గెలిచిన తర్వాత అటు అంబర్‌పేట్ నియోజకవర్గానికి గాని, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కానీ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. కిషన్ రెడ్డికి దమ్ముంటే గత ఐదు సంవత్సరాలలో తీసుకువచ్చిన నిధులు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచి ఈ ఎన్నికల్లో ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. గత ఎన్నికల్లో అనుకోకుండా గెలిచిన కిషన్ రెడ్డి, ఈసారి మాత్రం కచ్చితంగా ప్రజల చేతులు మరోసారి తిరస్కారానికి గురవుతారని, సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఆయన ఓటమి ఖాయమన్నారు.

10 సంవత్సరాలలో హైదరాబాద్ నగరానికి తమ పార్టీ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గుర్తుంచుకొని, తమ పార్టీ అభ్యర్థి పద్మారావుగౌడ్‌కి మద్దతు ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గెలిచిన తర్వాత అధికారం కోసం ఢిల్లీకి పర్యటనలు చేసే నాయకులను కాకుండా, నిత్యం 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే పద్మారావు గౌడ్ లాంటి ప్రజా నాయకులు నియోజకవర్గానికి అవసరమన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి గులాబీ పార్టీకి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బిఆర్‌ఎస్‌కి కంచుకోటగా మారిన రాజధానిలో ఈసారి కూడా గులాబీ జెండా ఎగురుతుందని వెల్లడించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో బిఆర్‌ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు. ఆదివారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ బిఆర్‌ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్‌కి మద్దతుగా అంబర్ పెట్ నియోజకవర్గంలో పాదయాత్రను నిర్వహించారు. అంబర్‌పేట్‌లోని పటేల్ నగర్ ప్రాంతంలోని ప్రేమ్ నగర్ చౌరస్తా నుండి ఆజాద్ నగర్ , పటేల్ వాడలలో ఇంటింటికి తిరిగి పద్మారావు గౌడ్‌ను ఎం.పిగా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

కెటిఆర్‌కు ఘన స్వాగతం పలుకుతూ జై తెలంగాణ అంటూ నినాదాలతో మార్మోగించిన పటేల్ నగర్ ప్రాంత వాసులు కెటిఆర్‌తో ముచ్చటించారు. తన పాదయాత్రలో భాగంగా పలు వురు ఇళ్లకు వెళ్లడంతోపాటు, మార్గమధ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని కెటిఆర్ పలకరించుకుంటూ తన పాదయాత్రను ముందుకు నడిపించారు. మిర్చి బండి , కిరాణా షాప్ వంటి వాటిలో ఉన్న వారితో కెటిఆర్ కాసేపు ముచ్చటించారు. కెటిఆర్‌తో మాట్లాడిన వందల మంది ప్రజలు కూడా మళ్లీ తెలంగాణ పార్టీకి ఓటు వేసి బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ నే గెలిపించుకుంటామని ఓటర్లు కెటిఆర్‌కు తెలిపారు. ఉద్యమకారుడు , అందరి మధ్యలో ఉంటూ, అందరికి సూపరిచితుడు అయిన పజ్జన్న ను గుర్తుపెట్టుకోవాలని ఓటర్లను కెటిఆర్ అభ్యర్థించారు. ఈ కార్యక్రమం లో ఎం.ఎల్.ఎలు, తలసాని శ్రీనివాస్ యాదవ్, కాలేరు వెంకటేష్ , ముఠా గోపాల్ , స్థానిక కార్పొరేటర్లు , యువజన నాయకులు రామేశ్వర్ గౌడ్ , ముఠా జై సింహ , డివిజన్ ప్రెసిడెంట్ భవాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News