Thursday, May 2, 2024

రాబందుల రాజ్యమొస్తే రైతుబంధు రద్దవడం గ్యారెంటీ: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అర్ధ శతాబ్దపు పాలనపై మంత్రి కెటిఆర్‌ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కపట కథలు, కంత్రీ గోత్రాలు బాగా తెలిసిన తెలివైన తెలంగాణ గడ్డ ఇదని, ఇక్కడ కల్లబొల్లి గ్యారెంటీలు చెల్లవన్నారు.  రాబందుల రాజ్యమొస్తే రైతుబంధు రద్దవడం గ్యారెంటీ అని, కాలకేయుల కాలం వస్తే కరెంట్‌ కోతలు, కటిక చీకట్లు గ్యారెంటీ అన్నారు. మూడు రంగుల ఊసరవెల్లిని నమ్మితే మూడు గంటల కరెంటే గతవుతుందని, ఉచిత విద్యుత్ ఊడగొట్టడం గ్యారెంటీ మంత్రి కెటిఆర్ అన్నారు. దగాకోరుల పాలనొస్తే ధరణి రక్షణ ఎగిరిపోతుందని, బకాసురులు గద్దెనెక్కితే రైతుబీమా..ధీమా గల్లంతవ్వడం గ్యారెంటీ అని చెప్పారు.  సమర్థతలేని సన్నాసులకు ఓటేస్తే సకల రంగాల్లో సంక్షోభం గ్యారెంటీ అన్నారు. ఢిల్లీ కీలుబొమ్మలు కుర్చీఎక్కితే ఆత్మగౌరవాన్ని అంగట్లో తాకట్టు పెట్టడం గ్యారెంటీ అని కెటిఆర్ పేర్కొన్నారు. దొంగల చేతికి తాళాలు ఇస్తే సంపదనంతా స్వాహా చేయడం గ్యారెంటని, భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకుంటే బూడిద మిగలడం గ్యారెంటీ,

స్కాముల పార్టీకి స్వాగతం చెబ్తే స్కీములన్ని ఎత్తేయడం గ్యారెంటీ అని ఆయన అన్నారు. కర్షకుడి కష్టం తెలియనోళ్లకు సీటిస్తే అన్నదాత ఆగమైపోవడం గ్యారెంటని, పరిపాలన చేతగాని..చేవలేని వాళ్లకు పగ్గాలిస్తే పల్లెపల్లెనా మళ్లీ పల్లేర్లు మొలవడం గ్యారెంటీ అని, పనికిమాలిన వాళ్లు పవర్‌లోకి వస్తే పరిశ్రమలు పారిపోవడం గ్యారెంటీ అని మంత్రి తెలిపారు. బుద్ధికుశలత లేనోళ్లకు చోటిస్తే భూముల ధరలు పడిపోవడం గ్యారెంటీ అని, విషయం..విజ్ఞానం లేనోళ్లను విశ్వసిస్తే వికాసం మాయమై వినాశనం గ్యారెంటీ అని,థర్డ్ గ్రేడ్ నాలాయక్స్ ను నమ్ముకుంటే ప్రథమ స్థానంలో వున్న స్టేట్ అధమస్థాయికిపోవడం గ్యారెంటీ అన్నారు. ఆర్థికశాస్త్రం తెలియని అరాచకులకు అవకాశం ఇస్తే ఎకానమీ ఏట్లో గలవడం గ్యారెంటీ అని, జోకర్లకు..బ్రోకర్లకు పీఠం ఇస్తే పరువు ప్రతిష్ఠలు గంగలో కలవడం గ్యారెంటీ అని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. దాచి..దాచి దెయ్యాలకు పెట్టేంత ఎడ్డిది కాదు..నా తెలంగాణ..! ఈనగాచి నక్కల పాల్జేసేంత అమాయక నేల కాదు నా తెలంగాణ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News