Saturday, July 27, 2024

కొన్ని వర్గాలను దూరం చేసుకోవడం వల్లే ఓడిపోయాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి: గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని వర్గాల ప్రజలను దూ రం చేసుకున్నామని, అందువల్లనే ఓడిపోవడానికి కారణం కావచ్చని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎంఎల్‌ఎ, బిఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కె టిఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన పార్టీ ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లా ల పట్టభద్రుల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎంఎల్‌ఎ గుంతకంట్ల జగదీష్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్య గుడి కట్టారని చెబుతూ బిజెపి అభ్యర్థి ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చే శారు.

తమ హయాంలో బ్రహ్మాండమైన యాదాద్రి దేవస్థానాన్ని కట్టామని… గుడి పేరుతో తాము ఇంతవరకు ఓట్లు అడగలేదని చెప్పారు. తాము ఎంతో కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు కట్టామని.. వాటికి దేవుళ్ల పేరు పెట్టామని, అయినా తాము ఏ రోజైనా దేవుడి పేరుతో ఏ ఎన్నికల్లోనూ ఓట్లు అడగట్లేదని స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటమికి రెండు కారణాలు ఉన్నాయని.. ఒకటి తాము చేసిన అభివృద్ధి పనితో పాటు రైతుల కోసం కట్టిన ప్రాజెక్టులు, ప్రజల కోసం కట్టిన గుళ్ళు, గోపురాల పేర్లు చెప్పుకోలేదని అన్నారు. ఇక రెండోది కొన్ని వర్గాల ప్రజలను తాము దూరం చేసుకోవడంతోనే ఓడిపోయామని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించిందని.. ఈ ఎన్నికల్లోనూ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటు వేసే ముందు పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాలను చూడాలని సూచించారు. ఈ ఎన్నికల్లో ఒక వైపు బిట్స్ పిలానీలో చదువుకున్న అభ్యర్థి , మరో పార్టీ వైపు బ్లాక్ మెయిలర్, లాబీయింగ్, పైశాచిక ఆనందం పొందే అభ్యర్థి ఉన్నారని వ్యాఖ్యానించారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అభ్యర్థులను చూసి ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాకముందు ఒక్క మెడికల్ కళాశాల కూడా లేదన్నారు. కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు మెడికల్ కళాశాలను ప్రకటించారని తెలిపారు. తమ ప్రభుత్వంలో రైతులు నాట్లు వేస్తున్నప్పుడు రైతుబంధు వచ్చిందని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఓట్లు వేస్తున్నప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్నారని ఆరోపించారు. ఎంఎల్‌ఎసి ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగు రాకేష్ రెడ్డికి మొద్దటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రముంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎంఎల్‌ఎ పైళ్ల శేఖర్ రెడ్డి, బూడిద బిక్షమ్మయ్య గౌడ్, చింతల వెంకటేశ్వరరెడ్డి, బీరు మల్లయ్య, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు జనగాం పాండు, ఏవి కిరణ్ కుమార్, రచ్చ శ్రీనివాస్ రెడ్డి, ర్యాకల శ్రీనివాస్, కేశవపట్నం రమేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News