Friday, May 3, 2024

రైతులకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్‌లోనే ఏక్‌నాథ్ షిండేలు ఉన్నారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్య చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో సోమవారం నిర్వహించిన నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి పార్టీ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్లమెంటు ఎన్నికల తర్వాత బిజెపిలో చేరే మొట్టమొదటి వ్యక్తి సిఎం రేవంత్ రెడ్డేనని వ్యాఖ్యానించారు. ‘ఓటమిపై బాధ పడొద్దు… రెట్టింపు ఉత్సాహంతో పోరాటం చేద్దాం’ అంటూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. తమ ప్రభుత్వం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశం చేశారు. తమ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి నియామక పత్రాలను ఇచ్చి జబ్బలు చరుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు ఇచ్చి కూడా మనం చెప్పుకోలేక పోయామని అన్నారు. ‘పొంకణాల రేవంత్ రెడ్డి… 420 హామీలు నెరవేర్చే దాకా నిన్ను వదిలేది లేదు’ అని హెచ్చరించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత వచ్చిందని అన్నారు.

కెసిఆర్ అధికారంలో ఉన్నన్నాళ్ళు అన్నదాతలకు స్వర్ణ యుగం అయ్యిందని అన్నారు. నల్లగొండ జిల్లాలో చివరి భూములకు కూడా నీళ్ళిచ్చిన ఘనత గులాబీ అధినేతదేనని అన్నారు. కాంగ్రెస్ చెప్పిన అబద్ధాలకు ప్రజలు బోల్తా పడ్డారని అన్నారు. ఎంపి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు సరైన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నల్లగొండ పార్లమెంటు స్థానాన్ని బిఆర్‌ఎస్ అత్యంత మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సిఎం రేవంత్ రెడ్డికి నల్లగొండ, ఖమ్మం కాంగ్రెస్ నేతలతోనే ప్రమాదం పొంచి ఉందని జోస్యం చెప్పారు. తనపై ఉన్న కేసులను తప్పించుకునేందుకు ఖచ్చితంగా రేవంత్ బిజెపిలో చేరుతారని పునరుద్ఘాటించారు.
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వానికి కనీస సోయి లేదని అంటూనే అన్నదాతలు చస్తున్నా కూడా పటించుకునే నాధుడే లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెట్టడం కాంగ్రెస్‌కు అలవాటేనని అంటూనే కేసులతో తమలను భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ దొంగలు ఫోన్ ట్యాపింగ్ అంటూ నానా యాగీ చేస్తున్నారని, అందులో ఎంతమాత్రం నిజం లేదని కొట్టిపారేశారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, నల్లగొండ పార్లమెంటు బిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్ధి కంచర్ల కృష్ణారెడ్డి, ఎంఎల్‌సి మంకెన కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News