Saturday, April 27, 2024

జర్నలిస్టు శంకర్‌కు కెటిఆర్ పరామర్శ

- Advertisement -
- Advertisement -

కొడంగల్‌లో జరుగుతున్న రైతుల భూకబ్జాలపైన నిజాలు వెల్లడించినందుకే శంకర్‌పైన దాడి
జర్నలిస్ట్ శంకర్‌పైన జరిగిన హత్యాయత్నం వెనకనున్నది సీఎం రేవంత్ రెడ్డినే 
భవిష్యత్తులో శంకర్‌కి హాని జరిగితే పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి వహించాలి
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
తుర్కయంజాల్‌లోని జర్నలిస్ట్ శంకర్ ఇంటికి వెళ్లి పరామర్శించిన కెటిఆర్, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడిన జర్నలిస్టు శంకర్‌ను బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు పరామర్శించారు. ఆదివారం సాయంత్రం కెటిఆర్ తుర్కయంజల్‌లోని శంకర్ ఇంటికి వెళ్లి, ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. కెటిఆర్ వెంట పలువురు బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శంకర్ ని పరామర్శించి భరోసాని ఇచ్చారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, శంకర్‌పై జరిగిన దాడికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యతవహించాలని అన్నారు.

భవిష్యత్తులో జర్నలిస్టు శంకర్‌కు ఎట్లాంటి హాని జరిగినా దానికి పూర్తి బాధ్యులు రేవంత్ రెడ్డి అవుతారని కెటిఆర్‌ హెచ్చరించారు. కొడంగల్‌లో రైతులకు సంబంధించిన భూముల కబ్జాల విషయాన్ని బయటకు తీసుకువచ్చినందుకే జర్నలిస్టు శంకర్‌పైన కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని పేర్కొన్నారు. నిజాలను నిర్భయంగా బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న శంకర్‌పైన, రాజ్యాన్ని అడ్డుపెట్టుకొని, పోలీసులను అడ్డుపెట్టుకొని అంతమొందించాలన్న ఈ ప్రభుత్వ ప్రయత్నం అదృష్టవశాత్తు విఫలమైందని అన్నారు. భవిష్యత్తులో శంకర్ పైన దాడులకు తెగబడితే ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు. శంకర్‌పైన పకడ్బందీగా గత కొద్ది రోజులుగా రెక్కి నిర్వహించి మరీ పదుల సంఖ్యలో వచ్చిన కాంగ్రెస్ గుండాలు ఆయనను అంతమొందించే ప్రయత్నం చేశారని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే స్థానికులు, సిసి కెమెరాల సాక్ష్యంగా ఉండడంతో వారి కుట్ర ఫలించలేదని పేర్కొన్నారు.

పోలీసుల పక్షపాత వైఖరిపైన కార్యాచరణ చేపడతాం
శంకర్ లేవనెత్తుతున్న ప్రశ్నలను తట్టుకోలేకనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయనపైన దాడికి తెగబడిందని కెటిఆర్ ఆరోపించారు. శంకర్‌ను అంతమొందించేందుకు భౌతికంగా దాడి చేసినా, స్థానిక పోలీసులు హాత్యాయత్నం కేసు నమోదు చేయకుండా అలసత్వం పక్షపాతం చూపించారని మండిపడ్డారు. పోలీసుల పక్షపాత వైఖరిపైన ప్రధాన ప్రతిపక్షంగా అవసరమైన కార్యాచరణ చేపడతామని వెల్లడించారు. ఈ విషయంలో రాష్ట్ర డిజిపిని నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కెటిఆర్ కోరారు. పది సంవత్సరాలపాటు ప్రభుత్వంలో ఉన్న తాము స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి కుటుంబంపైన అడ్డగోలుగా మాట్లాడినా, ప్రభుత్వంపైన అనేక అసత్య ప్రచారాలు చేసినా,  ఏనాడు కూడా భౌతిక దాడులకు పాల్పడలేదని కెటిఆర్ గుర్తు చేశారు. జర్నలిస్టు శంకర్‌ను అంతమొందించే ప్రయత్నం చేసినా, గతంలో మాట్లాడిన జర్నలిస్టు సంఘాలు ఈ రోజు మౌనంగా ఉన్నాయని అన్నారు. అయితే ఈ రోజు జర్నలిస్టు శంకర్‌కి జరిగిన పరిస్థితి, రేపు అందరూ జర్నలిస్టులకు జరిగే ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తించి ప్రభుత్వ అణచివేత చర్యలపైన స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

KTR and Shanker

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News