Monday, April 29, 2024

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి దమ్ముంటే సూర్యాపేటలో పోటీ చేయాలి…

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: తొమ్మిదేళ్లలో సూర్యాపేటలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏనాడూ కరెంట్ సక్కగా ఇవ్వలేదని విమర్శించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐటీ హ‌బ్‌ను రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించారు. అనంతరం ఐటీ హ‌బ్‌లో మహాత్మ గాంధీ పుట్టినరోజు పురస్కరించుకుని ఆయన చిత్ర‌ప‌టానికి కెటిఆర్ పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అనంతరం కెటిఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి దమ్ముంటే సూర్యాపేటలో పోటీ చేయాలని సవాల్ విసిరారు.

కరెంట్, మంచినీళ్లు ఇవ్వని కాంగ్రెస్ ఇప్పుడు మాటలు చెబుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకే వారంటీ లేదని, ఇప్పుడు ఎలా గ్యారంటీలు ఇస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.200 పెన్షన్ ఇవ్వనోళ్లు ఇప్పుడు నాలుగు వేల పెన్షన్ ఇస్తా అంటే ఎలా నమ్మాలి అని ఎద్దేవా చేశారు. టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ అని ధ్వజమెత్తారు. ఎంఎల్‌ఎ టిక్కెట్లు అమ్ముకుంటున్నోడు రేపు రాష్టాన్ని అమ్మరా? అని నిలదీశారు. మాది గాంధీ వారసత్వం… బిజెపిది గాడ్సే వారసత్వం అని విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో కెటిఆర్ తోపాటు మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, ఎంపి బ‌డుగుల లింగ‌య్య యాద‌వ్, పలవురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జ‌డ్పీ చైర్మ‌న్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News