తత్కాల్ టిక్కెట్లు బుక్కింగ్ చేసుకోవాలంటే ఇక ఆధార్ తప్పనిసరి. ఇది జులై 1 నుండి అమలులోకి రానుంది. తత్కాల్ టికెట్ల బుకింగ్కు ఆధార్ అథెంటికేషన్ ఖచ్చితం చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి సర్క్యులర్ కూడా జారీ అయ్యింది. తత్కాల్ టిక్కెట్ల విషయంలో జరుగుతున్న మోసాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రైల్వే యాప్ లేదా వెబ్ సైట్ నుంచి ఆధార్ ద్వారా ధృవీకరించబడిన వ్యక్తులు మాత్రమే తత్కాల్ టిక్కెట్లను పొందగలరని రైల్వే శాఖ స్పష్టం చేసింది. అధికారిక ఐఆర్సిటిసి వెబ్సైట్, లేదా యాప్ ని ఖాతా వివరాల ద్వారా లాగిన్ అవ్వాలి, ’మై అకౌంట్’కి వెళ్లి అథెంటికేట్ యూజర్ ఎంచుకోవాలి, అక్కడ పాన్ కార్డ్ నంబర్, ఆధార్ నంబర్ లేదా వర్చువల్ ఐడిని నమోదు చేయాలి, వివరాలను ధృవీకరించటం’పై క్లిక్ చేయాలి, మీ ఆధార్-లింక్ చేయబడిన మొబైల్ నంబర్కు వచ్చిన వన్-టైమ్ పాస్వర్డ్ని నమోదు చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి.
అయితే ఆధార్ నంబర్ ఐఆర్సిటిసి ఖాతాకు లింక్ చేయాలి. అందుకోసం అధికారిక ఐఆర్సిటిసి పోర్టల్లోకి వెళ్ళి మీ ఖాతా వివరాలను ఉపయోగించి లాగిన్ కావాలి, ‘ప్రొఫైల్ ట్యాబ్‘ కింద ‘లింక్ ఆధార్‘ క్లిక్ చేయాలి, మీ ఆధార్ కార్డ్లో ఉన్న విధంగా పేరు, ఆధార్ నంబర్ను నమోదు చేయాలి. చెక్ బాక్స్ పై క్లిక్ చేసిన తర్వాత ’ సెండ్ ఓటిపి’పై క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్కు వచ్చిన ఓటిపిని నమోదు చేసి, వెరిఫై ఓటిపి ’ క్లిక్ చేయాలి. కెవైసి వివరాలు ఆధార్ నుంచి తీసుకోబడతాయి. దీని తర్వాత ధృవీకరణను పూర్తి చేయడానికి ’అప్డేట్’పై క్లిక్ చేయాలి. ఈ ప్రక్రియను పూర్తి చేయటానికి ముందుగా ఆధార్ కార్డ్ కు మెుబైల్ నంబర్ లింక్ అయ్యి ఉందో లేదో చూసుకోవటం మంచిది. ఎందుకంటే ఆ నంబరుకే వెరిఫికేషన్ ఓటీపీలు పంపబడతాయి. వేగవంతమైన తత్కాల్ టిక్కెట్ బుక్కింగ్ కోసం ఆధార్ లింక్ చేసి ముందుగానే ఖాతాను సిద్ధంగా ఉంచుకోవటం సయమం వృధా కాకుండా కాపాడుతుంది.