Sunday, April 28, 2024

లోక్‌సభలో బిల్లులపై చర్చలు రెండు గంటలే..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇప్పటి 17వ లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లులలో ప్రతి ఒక్కదానిపై రెండుగంటలకు తక్కువ నిడివి చర్చ జరిగింది. కాగా వీటిలో కేవలం 16 శాతం బిల్లులే సంబంధిత పార్లమెంటరీ స్థాయీ సంఘాల పరిశీలనకు వెళ్లాయి. ఈ విషయం థింక్‌ట్యాంక్ సంస్థ పిఆర్‌ఎస్ లెజిస్లేటివ్ రిసర్చ్ అధ్యయనంలో తేలింది. 17వ లోక్‌సభలో ఇప్పటివరకూ 172 బిల్లులు ఆమోదం పొందాయి. వీటిలో 86 లోక్‌సభలో , 103 బిల్లులపై రాజ్యసభలో రెండుగంటల తక్కువ సమయం చర్చకు నోచుకున్నాయి. మొత్తం 172 బిల్లులలో 16 బిల్లులపై లోక్‌సభలో , 11 బిల్లులపై రాజ్యసభలో 30 మందికిపైగా చర్చల్లో పాల్గొన్నారు. కాగా ఇటీవలే ముగిసిన శీతాకాల సమావేశాలలో ఏ బిల్లు కూడా సభా కమిటీల పరిశీలనకు వెళ్లలేదు. 15వ లోక్‌సభ కాలం నుంచి చూస్తే బిల్లులను కమిటీలకు పంపించే ప్రక్రియలో నిష్పత్తి ప్రాతిపదికగా చూస్తే పడిపోతూ వచ్చింది. 17వ లోక్‌సభకు ఇప్పటివరకూ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగలేదు. లోక్‌సభ ఎన్నికల తరువాత సాధ్యమైనంత త్వరగా ఈ ఉప సభాధ్యక్ష స్థానం భర్తీ చేయాల్సిన బాధ్యత ఉంది.

సస్పెన్షన్లలో సరికొత్త రికార్డు
ఇంతవరకూ ఎప్పుడూ లేని విధంగా ఈ సారి లోక్‌సభ నుంచి అత్యధిక సంఖ్యలో సభ్యుల సస్పెన్షన్ జరిగింది. కాగా డిసెంబర్ 14 నుంచి 21 వరకూ కేవలం వారం రోజుల్లోనే లోక్‌సభ నుంచి వంద మంది ఎంపిలపై వేటేశారు. రాజ్యసభ నుంచి 46 మందిని సస్పెండ్ చేశారు. . ఇది ప్రతి సభలోనూ సభ్యుల సంఖ్య ప్రాతిపదికన చూస్తే 19 శాతంగా ఉంది. ఇంతవరకూ ఏ లోక్‌సభ కాలపరిధిలోనూ జరగని విధంగా ఈసారి అతి తక్కువ వ్యవధిలోనే అత్యధిక సంఖ్యలో ఎంపిల బహిష్కరణ పర్వం సాగింది. ఇక సస్పెండ్ అయిన సభ్యులందరి ప్రశ్నలను సమాధానాలు ఇవ్వాల్సిన ప్రక్రియ జాబితా నుంచి తొలిగించారు. ఈ సెషన్‌లోనే టిఎంసి సభ్యురాలు మహూవా మొయిత్రాపై నిబంధనల ఉల్లంఘనల ప్రాతిపదికన సభ్యత్వ అనర్హత వేటు పడింది. ఇంతకు ముందు ఇటువంటి బహిష్కరణలు మూడు సార్లు జరిగాయి. 2005లో 11 మంది సభ్యులపై వేటేశారు. అంతకు ముందు 1978, 1976లలో కూడా సభ్యత్వ వేటు చర్యకు దిగారు. డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగిన అభియోగాల నిరూపితం కావడంతోనే 2005లో సభ్యులపై వేటుపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News