Sunday, May 5, 2024

మహంకాళి గుడిని గొప్పగా తీర్చిదిద్దండి

- Advertisement -
- Advertisement -

Mahankali Temple

 

హైదరాబాద్ పాతబస్తీ లాల్‌దర్వాజలోని గుడికి వందేళ్ల చర్రిత ఉంది, గుడి ప్రాంగణం కేవలం 100 గజాల్లో ఉంది, భక్తులు ఇబ్బంది పడుతున్నారు, రూ.10కోట్లతో విస్తరింపజేయండి, అఫ్జల్‌గంజ్ మసీదుకు రూ.3 కోట్లివ్వండి, ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన అక్బరుద్దీన్ ఒవైసీ

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజలో ఉన్న సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఎంఐ ఎం శాసనసభా పక్ష నాయకుడు, చాంద్రాయణగుట్ట ఎంఎల్‌ఎ అక్బరుద్దీన్ ఓవైసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కోరారు. ప్రగతి భవన్‌లో ఆదివారం ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు ఆయన విజ్ఞాపన పత్రం అందచేశారు. ప్రతి ఏటా ఈ దేవాలయంలో నిర్వహించే బోనాలు దేశ వ్యాప్తంగా లాల్ దర్వాజ బోనాలుగా ప్రసిద్ధి చెందాయని ఆయన గుర్తు చేశారు. ఇంతటి ప్రసిద్ధి ఉన్నప్పటికీ చాలినంత స్థలం లేకపోవడం వల్ల, దేవాలయ ప్రాంగణం అభివృద్ధికి నోచుకోకపోవడం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారని సిఎం దృష్టికి తెచ్చారు. లాల్ దర్వాజ మహంకాళి దేవాలయానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉందని సిఎం దృష్టికి ఈ సందర్భంగా తీసుకెళ్ళారు. బోనాల పండుగ సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఈ గుడిలో పూజలు చేసి, బోనాలు సమర్పిస్తారన్నారు.

కానీ ఈ గుడి ప్రాంగణం కేవలం వంద గజాల స్థలంలోనే ఉందని తెలిపారు. ఇంత తక్కువ స్థలం ఉండడం వల్ల లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎంతో అసౌకర్యం కలుగుతున్నదని సిఎంకు వివరించారు. ఈ నేపథ్యంలో దేవాలయాన్ని సాధ్యమైనంత త్వరగా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. కనీసం రూ.10 కోట్ల వ్యయంతో దేవాలయాన్ని విస్తరించేందుకుగానూ త్వరగా అభివృద్ధి దేవాలయ విస్తరణ పనులను చేపట్టాలని అక్బరుద్దీన్ కోరారు. ఈ విస్తరణ వల్ల దేవాలయం ఆనుకుని ఉన్న వారు ఆస్తులు కోల్పోయే అవకాశం ఉందన్నారు. వారికి ప్రత్యామ్నాయంగా జిహెచ్‌ఎంసి ఆధీనంలో ఉన్న ఫరీద్ మార్కెట్ ఆవరణలో 800 గజాల స్థలం ఇవ్వాలని సూచించారు. దేవాలయన్ని విస్తరించి, అభివృద్ధి చేయడాన్ని అత్యంత ముఖ్యమైన పనిగా తీసుకోవాలని సిఎంకు ఆయన సూచించారు. ఇది భక్తులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని అక్బరుద్దీన్ సిఎంను కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ కావాలని దీవించాలని కోరుతూ ఈ దేవాలయంలో మీరు (సిఎం) కూడా బంగారు బోనం సమర్పించిన విషయాన్ని ఈ సందర్భంగా అక్బర్‌ద్దీన్ గుర్తు చేశారు.

అదే విధంగా పాతబస్తీలోని అఫ్జల్ గంజ్ మస్జీద్ మరమ్మతుల కోసం రూ.3 కోట్ల మంజూరు చేయాలని అక్బరుద్దీన్ సిఎంను ర్ ను కోరారు. ఎంతో మంది ముస్లింలు నిత్యం ఈ మసీదులో ప్రార్థనలు చేస్తారని, మరమ్మతులకు నోచుకోకపోవడం వల్ల మసీదులో ప్రార్థనలకు ఇబ్బంది కలుగుతున్నదని ఆయన సిఎం దృష్టికి తెచ్చారు. అక్బరుద్దీన్ విజ్ఞప్తికి ముఖ్యమంత్రి కెసిఆర్ సానుకూలంగా స్పందించారు. మహంకాళి దేవాలయ అభివృద్ధికి, అఫ్జల్ గంజ్ మసీదు మరమ్మతులకు వెంటనే నిధులు విడుదల చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఈ రెండు ప్రార్థనా మందిరాల అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సిఎం ఆదేశించారు.

Mahankali Temple should be developed
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News