Wednesday, April 17, 2024

తెలంగాణ పథకాలకు ఫిదా

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ పార్టీలోకి ఇతర రాష్ట్రాల నాయకుల క్యూ
ప్రతిరోజు కెసిఆర్ సమక్షంలో పార్టీలో చేరిక
శనివారం మహారాష్ట్రకు చెందిన మచ్చీంద్ర గుణ్వంతరావు చేరికతో మహారాష్ట్రలో
ఆ పార్టీ మరింత బలోపేతం
మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీలోకి ఇతర రాష్ట్రాల నాయకులు భారీగా చేరుతున్నారు. ప్రతిరోజు సిఎం కెసిఆర్ సమక్షంలో పార్టీలో చేరడానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులు క్యూ కడుతున్నారు. ఈ మేరకు మహారాష్ట్రకు చెందిన పలు పార్టీలకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నేతలు, మేధావులు సిఎం కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. శనివారం మహారాష్ట్ర కు చెందిన మచ్చీంద్ర గుణ్వంతరావు చేరిక ప్రాధాన్యత సంతరించుకుంది. లాతూర్ జిల్లా ఉద్గిర్ నియోజకవర్గానికి చెందిన గుణ్వంతరావు ప్రజల్లో మంచి పట్టున్న ప్రముఖ రాజకీయ నాయకుడు. 2009లో ఉద్గిర్ నియోజకవర్గం నుంచి ఎన్సీపి అభ్యర్థిగా పోటీచేయగా ప్రత్యర్థిపై అత్యల్ప తేడాతో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. కాగా, 2019 లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి లాథూర్ పార్లమెంటరీ స్థానం నుంచి బరిలోకి దిగగా దాదాపు 4 లక్షల మంది ఓటర్ల మద్ధతు ఆయనకు లభించింది.

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్శితులై…
విద్యార్థి నాయకుడిగా కమ్యూనిస్టు పార్టీ అనుబంధ ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘంలో పనిచేసిన గుణ్వంతరావు, సామాజిక రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తూ, పలు కీలక పదవుల ద్వారా ప్రజాసేవ చేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటూ, అంచలంచెలుగా ఎదుగుతూ తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తన ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో, బిఆర్‌ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రజా సంక్షేమ రైతు సంక్షేమ పాలనను, లౌకికవాద ప్రజాస్వామిక రాజకీయ పంథాకు ఆకర్షితులై, హైదరాబాద్ లో సిఎం కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

కాగా వీరితో పాటు ఎన్సీపీ పార్టీకి చెందిన రాయగడ్ జిల్లా నివాసి రాహుల్ ఎస్ సాల్వి, మహద్ తాలూకాకు చెందిన సిద్ధార్థ్ హటే, రాయగడ్ థానే కొంకణ్ ప్రాంతానికి చెందిన ప్రకాశ్ కె తొంబారె, రాయగడ్ కు చెందిన సామాజిక కార్యకర్త మునాఫ్ అమిర్ అధికారి, సౌత్ ముంబై కి చెందిన దేవేంద్ర సోలంకి, నార్త్ ముంబైకి చెందిన మాజీ కార్పొరేటర్ పిఎస్ నాగ్రాజన్ తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వీరికి బిఆర్‌ఎస్ అధినేత సిఎం కెసిఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ నేతలు చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, మహారాష్ట్ర బిఆర్‌ఎస్ సీనియర్ నేతలు మాణిక్ కదమ్, శంకరన్న డోంగే తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News