సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్. షూటింగ్ లేకపోతే చాలు కుటుంబంతో గడిపేందుకు ప్రాధాన్యతనిస్తారు. ఎక్కువ రోజులు బ్రేక్ దొరికితే మాత్రం తన కుటుంబ సభ్యులతో విదేశాలకు విహార యాత్ర ప్లాన్ చేసుకుంటారు. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రమోషన్స్ పూర్తి కావడంతో ఈసారి కూడా మహేష్ తన కుటుంబ సభ్యులతో హాలిడే ట్రిప్కు బయలుదేరారు. మహేష్ సతీమణి నమ్రత ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపారు. ఇక సూపర్స్టార్ ఫ్యామిలీ అమెరికాకు వెళ్లిందని.. ఈ ట్రిప్ రెండు నెలల పాటు కొనసాగుతుందని సమాచారం. ఈ ట్రిప్లో మహేష్, నమ్రత, గౌతమ్, సితారలతో పాటుగా వారి ఫ్యామిలీ ఫ్రెండ్ మెహర్ రమేష్ కూడా బయలుదేరి వెళ్లారు. ఇక మహేష్ తన నెక్స్ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ సాగుతోందని.. మహేష్ అమెరికా ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ సినిమాను ప్రారంభిస్తారని సమాచారం.
ఇదిలా ఉండగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం యుఎస్లో కూడా భారీ వసూళ్లను సాధిస్తోంది. ఈ చిత్రం అక్కడ రెండు మిలియన్ డాలర్ల క్లబ్లో చేరింది. దీంతో యుఎస్ బాక్సాపీస్ వద్ద రెండు మిలియన్ డాలర్ల వసూళ్లను మూడు సార్లు సాధించిన హీరోగా మహేష్ రికార్డ్ల్లోకి ఎక్కారు. గతంలో ఆయన నటించిన శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాలు రెండు మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించాయి. అయితే, టాలీవుడ్ నుండి ప్రభాస్ మాత్రమే ఈ ఫీట్ సాధించిన హీరోగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఆయన చేసిన బాహుబలి, బాహుబలి 2, సుజిత్ తెరకెక్కించిన సాహో చిత్రాలు రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు అధిగమించిన చిత్రాలుగా నిలిచాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి రెండు సార్లు, ఎన్టీఆర్ రెండు సార్లు ఈ ఫీట్ సాధించారు. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో మొదటిసారి ఈ రికార్డు సాధించారు.
Mahesh Babu goes to America for Holiday trip