Friday, April 26, 2024

మేడారంలో సకల సదుపాయాలు

- Advertisement -
- Advertisement -

Medaram sammakka sarakka jatara 2022

ఫిబ్రవరి 8 నుంచి భారీ వాహనాల మళ్లింపు
ప్రత్యేక యాప్స్, వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా వసతుల కల్పన
భారీగా క్యూలైన్లు, చలువ పందిళ్లు
సిసి కెమెరాల నిఘా, షీటీమ్స్, మఫ్టీ పోలీసుల భద్రత
రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్

హైదరాబాద్: దక్షిణ కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల సదుపాయాలు కల్పిస్తున్నామని రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ పేర్కొన్నారు. ఆదివారం ఈ మేరకు ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు మేడారం జాతర జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే మూడుసార్లు సమీక్ష చేశామని, ఇటీవలే ముగ్గురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి వసతుల కల్పన, కరోనా జాగ్రత్తలు, జాతరను విజయవంతం చేయడంపై సుదీర్ఘంగా చర్చించామన్నారు.

ఈ మేరకు పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. భక్తులు జాతరకు తరలివస్తున్న నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జాతర మార్గాల్లో భారీ వాహనాలు రాకుండా ఆదేశాలు జారీ చేశామన్నారు. హనుమకొండ జిల్లా, ఆత్మకూరు మండలం, గుడేప్పాడ్ నుంచి భూపాలపట్నం మార్గంలో ములుగు జిల్లా చివరి వరకు ఈ భారీ వాహనాలు (ఇసుక లారీలు) ప్రయాణించవని, కేవలం భక్తులు, స్థానికుల వ్యక్తిగత, ప్యాసింజర్ వాహనాలు మాత్రమే తిరుగుతాయన్నారు. ఈ మార్గంలో వచ్చే వాహనాలు చర్ల,- కొత్తగూడెం,- ఖమ్మం,- సూర్యాపేట -హైదరాబాద్‌కు.. అదే విధంగా మణుగూరు, కొత్తగూడెం,- ఖమ్మం, – సూర్యాపేట,- హైదరాబాద్ మార్గాలకు మళ్లించినట్లు పేర్కొన్నారు.

పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపర్చేందుకు ప్రతి గంటకు ఒకసారి పర్యవేక్షించే విధంగా సిబ్బందిని అధిక సంఖ్యలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పారిశుద్ధ్యంలో ఎలాంటి ఫిర్యాదు రాకుండా నిర్వహణ జరపాలని కచ్చితమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, మేడారం జాతర మార్గాలు, మేడారంలో భక్తుల వసతులు, సదుపాయాలపై ఎప్పటికప్పుడు భక్తులకు సమాచారం అందించేందుకు వీలుగా సోషల్ మీడియా, యాప్స్, సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా వినియోగిస్తున్నామన్నారు.

అధికారుల మధ్య సమన్వయం చేసి బాధ్యతలు పటిష్టంగా నిర్వహించేందుకు వీలుగా మేడారాన్ని ఎనిమిది జోన్లుగా, పలు సెక్టార్లుగా విభజించి, మండల స్థాయి నుంచి జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి అధికారులను బాధ్యులుగా నియమించామన్నారు. వచ్చే భక్తుల భద్రత, దొంగతనాల నివారణ చర్యల కోసం భారీ సంఖ్యలో సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని, నిరంతర నిఘా ఉంటుందని, షీ టీమ్స్, మఫ్టీ పోలీసులు విధుల్లో ఉన్నారని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతర అప్రమత్తంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. గద్దెల వద్ద భక్తులకు ఇబ్బందులు జరగకుండా క్యూలైన్ విధానం పటిష్టంగా రూపొందించామని, భక్తులకు క్యూలైన్ లో అసౌకర్యం కలగకుండా చలువ పందిళ్లు, తాగునీరు, వైద్య సదుపాయాలు ఎక్కడికక్కడ ఏర్పాటు చేశామన్నారు.

కరోనా నేపథ్యంలో కూడా వైద్య సిబ్బంది గతం కంటే రెండింతలు పెంచామని, పరీక్షలు చేసేందుకు కేంద్రాలను పెట్టామని, పాజిటివ్ తేలితే వెంటనే వారికి చికిత్స చేసేందుకు ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు. మాస్కులు, సానిటైజర్ల అందుబాటులో ఉండేల్లా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. జాతరలో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు భక్తులు సహకరించాలని, మాస్కులు ధరించి, నిబంధనల మేరకు దర్శనాలు చేసుకోవాలని, ఆశీర్వాదం తీసుకోవాలని, ఎలాంటి ఇబ్బందులున్నా వెంటనే అక్కడున్న అత్యవసర నంబర్లకు, సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సాయం పొందాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News