Sunday, April 28, 2024

కొత్త సర్కారుపై నిరుద్యోగుల కోటి ఆశలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్:  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తో నిరుద్యోగుల్లో నోటిఫికేషన్లపై ఆశలు రేకెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్‌గాంధీ, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనేక సందర్భాలలో విద్యార్థులు, యువతతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలపై ప్రకటనలు చేయడంతో పాటు జాబ్ క్యాలెండర్‌ను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరించారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వంపై ఉద్యోగార్థులు కోటి ఆ శలు పెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొలి ఏడాది కాలంలోనే రెం డు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఆ మేరకు జా బ్ క్యాలెండర్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఖాళీ గా ఉండే గ్రూప్1 ఉద్యోగ నియామకాలను వ చ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన, గ్రూప్2 ని యామకాలు మొదటి విడత ఏప్రిల్ 1 నాటికి, రెండో దశ డిసెంబర్ 15 నాటికి భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అలాగే గ్రూప్3 నియామకాలు తొలి దశ జూన్ 1 నాటికి, రెండో దశ డిసెంబర్ 1 నాటికి, గ్రూప్4 ఉద్యోగాలు తొలి విడత జూన్ 1, రెండో దశ డిసెంబర్ 1 నా టికి భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. కాం గ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ఉద్యోగాలన్నింటినీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్పెషల్ డిపార్టుమెంట్ నియామకాల కమిషన్ ద్వారా భర్తీ చేస్తామ ని తెలిపింది. దరఖాస్తుదారులు ఒక్క రూపాయి ఫీజు చెల్లించనవసరం లేదని స్పష్టం చేసింది.

రెండు సార్లు రద్దయిన గ్రూప్-1 ప్రిలిమ్స్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలి మ్స్ పరీక్ష రెండు సార్లు రద్దయింది. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారి 2011లో గ్రూప్1 ప్రకట న వచ్చింది. దాదాపు 11 ఏళ్ల అనంతరం.. 2022 ఏప్రిల్ 26న ఏకంగా 503 పోస్టులతో తెలంగాణలో తొలి గ్రూప్1 ప్రకటనను టిఎస్‌పిఎస్‌సి విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా 3,80,202 మంది దరఖాస్తు చేశారు. అదే ఏడాది అక్టోబరు 16న ప్రిలిమ్స్ నిర్వహించగా 2,85,916 మంది హాజరయ్యారు. ఈ ఏడాది జనవరిలో 1:50 నిష్పత్తిలో 25 వేల మందిని మెయిన్స్‌కు ఎంపిక చేసింది. జూన్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ కూడా వెలువరించింది. అనూహ్యంగా ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్ ఆ పరీక్షను రద్దు చేసింది. తిరిగి ఈ ఏడాది జూన్ 11న ప్రిలిమ్స్ నిర్వహించగా 2,33,506 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ ని విడుదల చేయడంతో పాటు అభ్యర్థుల ఒఎంఆర్ షీట్లనూ టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. అయితే పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని, హాల్ టికెట్ నంబర్ లేకుండా ఒఎంఆర్ షీట్లు ఇచ్చారని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పరీక్షను రద్దు చేయాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అక్టోబరు 16న నిర్వహించిన పద్ధతిలోనే జూన్ 11న పరీక్ష జరపకపోవడం అనుమానాలకు తావిస్తోందని పిటిషనర్లు వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి, తిరిగి నిర్వహించాలని తీర్పు వెల్లడించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఉన్నత న్యాయస్థానం టిఎస్‌పిఎస్‌సిని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైంది. హైకోర్టు గ్రూప్-1 పరీక్ష రెండో సారి రద్దు కావడంతో కొత్త ప్రభుత్వం మళ్లీ పరీక్ష నిర్వహిస్తుందా..? లేక ఈ నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తుందా..? అని అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

త్వరలో గ్రూప్-2పై స్పష్టత
రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో వాయిదా పడిన గ్రూప్ 2 పరీక్షలు జరుగుతాయా..? లేదా..? అని అభ్యర్థులు ఉత్కంఠతో ఎరుదుచూస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ నవంబర్ 3,4 తేదీలలో జరగాల్సి ఉండగా, ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో టిఎస్‌పిఎస్‌సి పరీక్షలను వాయిదా వేసింది. 2024 జనవరి 6,7 తేదీలలో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆ సమయంలో కమిషన్ వెల్లడించింది. అయితే జనవరి 6,7 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరుగుతుందా..? లేదా..? అనే అంశంపై త్వరలో స్పష్టత రానుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి పరీక్షలు నిర్వహిస్తారా..? లేదా టిఎస్‌పిఎస్‌సి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..? అనేది అభ్యర్థుల్లో చర్చనీయాంశంగా మారింది. కొత్త ప్రభుత్వం ముందున్న ప్రధాన అంశాల్లో ఉద్యోగ నియామకాల అంశం కీలకమైనది. అందులో భాగంగా టిఎస్‌పిఎస్‌సిలో మార్పులు జరిగే అవకాశమూ లేకపోలేదు. ఉద్యోగ నియామకాలపై కొత్త ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గ్రూప్ -2 పరీక్ష ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడగా, మరోసారి వాయిదా పడే అవకాశాలు లేకపోలేదు. రాష్ట్రంలో 783 గ్రూప్ -2 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News