Friday, April 26, 2024

తెలంగాణలో మంటలు రగిల్చేందుకు ఉప ఎన్నిక

- Advertisement -
- Advertisement -

Minister Jagadish Reddy Election Campaign In Munugode

నల్గొండ: పచ్చని పంటపొలాలతో సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మంటలు రాజేసేందుకే భారతీయ జనతా పార్టీ(బిజెపి)మునుగోడుకు ఉప ఎన్నికలు తెచ్చిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఇక్కడ జరుగుతున్న ఉప ఎన్నికల వెనుక ముమ్మాటికీ ప్రధాని మోడీ కుట్ర ఉందని ఆయన మండిపడ్డారు. మరో సంవత్సరంలో రాష్ట్ర శాసనసభ కు సాదారణ ఎన్నికలు జరగాల్సిన తరుణంలో ఎందుకు రాజీనామా డ్రామాలు అంటూ ఆయన మండిపడ్డారు. మునుగోడుకు జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నియోజకవర్గ పరిధిలోని వెలిమికన్నే, చీకటిమామిడి తదితర గ్రామంలో టి ఆర్ యస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలసి ఆయన ప్రచారం నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ…. బిజెపి స్వార్థం కోసం ఒక వ్యక్తి కుటుంబ ప్రయోజానాల కోసమే ఈ ఉప ఎన్నికను ప్రజలపై బలవంతంగా రుద్దిందని ఆయన ధ్వజమెత్తారు. 2018 లో ఎన్నికయిన నాటి నుండి అధికారంలో లేక పోవడంతో అభివృద్ధి చెయ్య లేక పోయానంటూ బీరాలు పలుకుతున్న రాజగోపాల్ రెడ్డి 18,000 కోట్ల కాంట్రాక్టు కోసమే పార్టీ మారి రాజీనామా చేసి బిజెపి కుతంత్రాలలో బాగంగా ఈ ఎన్నికలు తెచ్చారన్నారు.

నాలుగు ఏళ్లలో చెయ్యని అభివృద్ధి ఈ సంవత్సరంలో ఎలా చెయ్య గలుగుతారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మునుగోడు తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆరు దశాబ్దాలుగా పాతుకుపోయిన ఫ్లోరోసిస్ మహమ్మారి ని కేవలం ఆరు ఏండ్లలో తరిమికొట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాలతో ప్రజలకు సురక్షితమైన త్రాగు నీరు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన మిషన్ భగీరథ పథకానికి 50,000 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. అందుకు గాను 12000 కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి అందించాలంటూ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులు బుట్ట దాఖలు చేసిన మోడీ సర్కార్ తెలంగాణా కు పైసా విదిల్చిన పాపాన పోలేదని ఆయన విమర్శించారు.అదే బిజెపి తెలంగాణలో నెరుపుతున్న కుట్ర రాజకీయాలలో భాగస్వామిగా మారి రాజకీయ జన్మానినిచ్చిన కాంగ్రెస్ ను కాదని బిజెపిలో చేరినందుకు మాత్రం కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టుల రూపంలో ఇచ్చిన నజరానా 18,000 కోట్లన్నారు.

తెలంగాణా లో ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి అమలు అవుతున్న సంక్షేమ పథకాలను అడ్డుకునే కుట్రలో భాగంగానే మోదీ, అమిత్ షా ద్వయం ఇటువంటి కుట్రలకు తెరలేపిందని ఆయన విరుచుకుపడ్డారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మెడ మీద కత్తి పెట్టి వత్తిడి తేవడం అందులో భాగమే నన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కంఠం లో ప్రాణముండగా తెలంగాణలో అటువంటి పరిస్థితి ఉత్పన్నం కానివ్వబోమని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే గుజరాత్ లో మోటర్లకు మీటర్లు బిగించారన్నారు. అక్కడ రైతాంగం ఎకరాకు 1500 రూపాయల చొప్పున నాలుగు ఎకరాలు ఉన్న రైతు నెల ఒక్కింటికీ 5,500 రూపాయలు చెల్లిస్తున్నారన్నారు.ఇదే పద్ధతి దేశవ్యాప్తంగా అమలు పరచాలి అన్నదే బిజెపి సర్కార్ లక్ష్యంగా ఉందన్నారు. అందుకే విద్యుత్ సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రభుత్వాల వత్తిడి మీద తెస్తున్నారన్నారు. అదే గుజరాత్ లో ఇస్తున్న ఆసరా ఫించన్లు కేవలం 600 మాత్రమేనన్నారు. అంతెందుకు అదే రాష్ట్రంలో దివ్వాంగులకు ఇస్తున్న ఫించన్ 500 రూపాయలే నని ఆయన చెప్పారు. అదే పరిస్థితి ఇక్కడ అమలు జరగాలి అన్నది బిజెపి యోచన అని ఆయన తెలిపారు. ఇక్కడ అమలు అవుతున్న సంక్షేమ పథకాలు,వ్యవసాయానికి అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్,పెట్టుబడి సాయంగా రైతాంగానికి అందిస్తున్న రైతుబందు పధకం,పేదింటి ఆడపిల్ల పెళ్లికి తోడ్పాటు నందించేందుకు ప్రవేశ పెట్టిన కళ్యాణలక్ష్మీ పధకాలు కేంద్రంలో కొలువుదీరిన బిజెపి ప్రభుత్వాన్ని వనికిస్తున్నాయాన్నారు.

ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ తో సహా దేశ వ్యాప్తంగా ఇవే డిమాండ్లతో ప్రజలు తిరగ బడుతారన్న భయంతో బెంబేలెత్తుతున్న కమల నాధులు తెలంగాణలో చిచ్చు రగిల్చేందుకే మునుగోడుకు ఉప ఎన్నికలు బలవంతంగా తెచ్చి పెట్టారన్నారు. మునుగోడు లో పొరపాటున బిజెపి కి ఓటు వేస్తే జరగబోయే ప్రమాదం కుడా ఈ రూపంలో పొంచి ఉందంటూ ఆయన హెచ్చరించారు. అటువంటి విపత్కర పరిస్థితుల నుండి బయట పడేందుకు ఇక్కడి ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి, ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగేలా ప్రజల నిర్ణయం ఉండాలన్నారు. చైతన్యం కలిగిన మునుగోడు గడ్డ మీద ఇటువంటి విద్వేషాలకు చోటు ఉండదన్నది మరోసారి నిజం చేయాలని ఆయన కోరారు.ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ను గెలిపించడం ద్వారానే అది సాధ్య పడుతుందాన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు, ఉమ్మడి నల్లగొండ జిల్లా టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,పరకాల శాసన సభ్యులు దర్మారెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, వామపక్షాలకు చెందిన తుమ్మల వీరారెడ్డి, నెల్లికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News