Saturday, July 27, 2024

అర్హులకే పోడు హక్కులు

- Advertisement -
- Advertisement -
Minister KTR meeting organised on Podu lands
సిబ్బంది అక్రమాలకు పాల్పడితే జైలే
రాజకీయాలకతీతంగా సమస్య పరిష్కారం
అర్హులకు న్యాయం చేయడం తప్ప వేరే అజెండా లేదు
పేదలకు న్యాయం, అడవిని, పుడమిని కాపాడుకోవడమే
లక్షం అటవీ భూముల ఆక్రమణ ఇక నుండి జరగడానికి
వీల్లేదు జిల్లా స్థాయిలో అడవులపై ఫారెస్ట్ ప్రొటెక్షన్
కమిటీ పర్యవేక్షణ సోమవారం నుంచి సిరిసిల్ల జిల్లా 67
గ్రామాల్లో పోడు సదస్సులు అఖిలపక్ష సమ్మతితో చర్యలు
తీసుకుంటాం గిరిజనేతరుల విషయంలో అడ్డంకిగా ఉన్న
కేంద్ర చట్టం, సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం
పర్యావరణ సమతుల్యతకు అందరూ సహకరించాలి
సిరిసిల్ల కలెక్టరేట్‌లో అఖిలపక్ష నేతలు, ప్రజాప్రతినిధులు,
అధికారులతో సమీక్షలో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ / హైదరాబాద్/ సిరిసిల్ల : పోడు భూముల హక్కు పత్రాల పేరిట అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని రాష్ట్ర ఐటి, పురపాలక, పట్టణాభివృద్ది శాఖల మంత్రి కె. తారకరామారావు అన్నారు. శనివారం సిరిసిల్లలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో పోడు భూముల సమస్య పరిష్కారం, అడవుల పునరుజ్జీవనం తదితర అంశాలపై అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, 8 మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులతో అఖిల పక్ష సమావేశాన్ని మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కార దిశగా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతుందన్నారు.

పోడు భూముల పేరిట డబ్బు వసూలు చేస్తే జైలుకు పంపుతామని హెచ్చరించారు. అక్రమాలు జరిగితే కలెక్టర్, ఎస్‌పిలకు ఫిర్యాదు చేయాలని లబ్ధిదారులకు సూచించారు. కలెక్టరేట్ ప్రత్యేకంగా ఫిర్యాదుల బాక్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అటవీ అక్రమణలు జరుగకూడదనే హక్కుపత్రాలను అందిస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలన చేయాలని, అవసరమైతే వీడియో చిత్రీకరణ చేయాలన్నారు. అధికారులు తప్పులు చేస్తే ఉద్యోగాలు ఊడతాయ్.. జాగ్రత్త అంటూ మంత్రి హెచ్చరించారు. జిల్లా దాదాపు 4 లక్షల 72 వేల 329 ఎకరాల భౌగోళిక విస్తీర్ణం కలిగి వున్నట్లు, ఇందులో ప్రాధమిక అంచనాల ప్రకారం 96 వేల 394 ఎకరాల అటవీ ప్రాంతం 20 శాతం మేర కలిగి ఉందన్నారు. జిల్లాలో సుమారు 8 వేల ఎకరాల్లో గిరిజన, ఇతరులు అటవీ భూప్రాంతంలో పొడు వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి చెందుతున్నట్లు ఆయన తెలిపారు. పేదలకు న్యాయం చేస్తూ, అడవి, పుడమిని కాపాడుకోవడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు.

నవంబర్ 8 నుంచి గ్రామ స్థాయిలో సదస్సులు నిర్వహించి, పోడు భూములు ఆక్రమణలో ఉన్నవారి నుండి అర్జీలు స్వీకరించి, అర్హత గల వాటిని పరిశీలించి, క్షేత్ర స్థాయిలో వాస్తవికత పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి చెప్పారు. పోడు భూముల సమస్య పరిష్కారం పిమ్మట భవిష్యత్తులో తిరిగి అటవీ భూమి ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో అటవీ హక్కుల కమిటీలు, జిల్లా స్థాయిలో అటవీ సంరక్షణ కమిటీలు ఏర్పాటుచేయాలన్నారు. అన్ని పక్షాల భాగస్వామ్యంతో పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. 33 శాతం అటవీ ప్రాంతంతో వాతావరణ సమతుల్యత ఉంటుందని, అటవీ సంపద సంరక్షణ మన అందరి ప్రాధమిక కర్తవ్యమన్నారు. అడవులు క్షీణిస్తూ ఉండడంతో వాతావరణ సమతుల్యత దెబ్బతిని అతివృష్టి, అనావృష్టి, కాలం లేకుండా వర్షాలతో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. పార్టీలకతీతంగా అన్ని పక్షాల సమ్మతితో ముందుకు వెళ్లాలన్నారు. అటవీ, రెవిన్యూ భూ సమస్యలు ఉన్నచోట రెండు శాఖల జాయింట్ సర్వే చేపట్టి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు.

గతంలో కేంద్ర ప్రభుత్వం ఆర్వోఎఫ్ ఆర్ చట్టం తెచ్చి గిరిజనులకు హక్కులు కల్పించిందని, గిరిజనేతరుల విషయంలో కేంద్ర చట్టం అడ్డంకిగా ఉందని, ఈ సమస్య పరిష్కారానికి అఖిలపక్షంతో కేంద్రం దృష్టికి తీసుకెళతామని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ధరణి ప్రవేశపెట్టి, విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే 10 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆయన తెలిపారు. త్వరలో డిజిటల్ సర్వే చేపట్టనున్నట్లు, డిజిటల్ సర్వే తో ఆక్షాoశాలు, రేఖాoశాలతో భూముల విషయంలో ఖచ్చితత్వం వస్తుందని ఆయన అన్నారు. పోడు సమస్యలు ఉన్న 67 గ్రామాల్లో సదస్సుల నిర్వహణ అనంతరం సేకరించిన డాటాతో తిరిగి అఖిలపక్ష సమావేశం నిర్వహించి పారదర్శకంగా చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. పేదల జీవనోపాధి, భవిష్యత్తు తరాలకు అడవి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలన్నారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు మాట్లాడుతూ దశాబ్దాలుగా పోడు భూముల సమస్య పరిష్కారం కాకుండా ఉందన్నారు. జిల్లాలో ఇంకా 10 శాతం అటవీ సంపద పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

అడవులను కాపాడుకోవడంలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. పోడు భూముల శాశ్వత పరిష్కారంతో పాటు అడవిని, పేద రైతుల హక్కులను కాపాడుకోవాలన్నారు. ప్రతి దరఖాస్తు పరిశీలన చేసి, పారదర్శకంగా పరిష్కారం చూపాలన్నారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ, పోడు భూముల సమస్య పరిష్కారం చూపుతూ, అర్హులకు పట్టాలిచ్చి, మిగిలిన అడవిని కాపాడుకొనే చర్యలు చేపట్టాలన్నారు. అటవీ ప్రాంతం ఏమాత్రం ఆక్రమణ కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. గిరిజన, గిరిజనేతరుల అర్జీలు స్వీకరిస్తామన్నారు. గ్రామస్థాయిలో సర్పంచ్ అధ్యక్షతన, పంచాయతీ కార్యదర్శి, విఆర్‌ఏ, అటవీ బీట్ అధికారి, మండల సర్వేయర్ లతో కూడిన బృందం సోమవారం నుంచి అర్జీలు ఏ ఫారంలో, ఎలా సమర్పించాలి అనే విషయంలో అర్జీదారులకు అవగాహన చేస్తారన్నారు.

గ్రామసభ ద్వారా అర్జీలు స్వీకరించనున్నట్లు తెలిపారు. 8 మండలాల పరిధిలోని 67 గ్రామాల్లో అటవీ హక్కు కమిటీలు ఏర్పాటు చేసినట్లు, ప్రతి అర్జీని పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా తమ పరిధిలో గల అటవీ భూముల్లో ఇకముందు ఎలాంటి అన్యాక్రాంతం, ఆక్రమణలు జరగనియ్యమని, ఇప్పటి వరకు అటవీ భూముల్లో ఉన్న అర్హులైన వారికి హక్కులు కల్పించిన పిమ్మట ఎటువంటి ఆక్రమణలు అనుమతించబోమని ప్రతిజ్ఞ చేశారు. సమావేశంలో నాఫ్స్కాబ్ చైర్మెన్ కొండూరు రవీందర్ రావు, జెడ్పీ చైర్ పర్సన్ ఎన్.అరుణ, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్, జిల్లా అటవీ అధికారిణి బాలామణి, ఇంచార్జ్ రెవెన్యూ అధికారి టి. శ్రీనివాస రావు, సీఈవో గౌతం రెడ్డి, డిపిఓ రవీందర్, డిటిడిఓ గంగారాం, జడ్‌పిటిసిలు, ఎంపిపిలు, సర్పంచులు, ఎంపిటిసిలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News