సోషల్ మీడియాలో లైక్లు, కామెంట్ల కోసం యువత ఎటువంటి దారుణాలకైనా ఒడిగడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్కు చెందిన ఇద్దరు మైనర్లు ఐఫోన్లో రీల్స్ చిత్రీకరిస్తే ఎక్కువ లైక్లు వస్తాయనే ఆలోచనతో ఐఫోన్ కోసం ఓ యువకుడి గొంతు కోసి, హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బెంగళూరుకు చెందిన షాదాబ్ (19) అనే యువకుడు తన మేనమామ వివాహానికి హాజరయ్యేందుకు ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని నాగౌర్ గ్రామానికి వచ్చాడు. జూన్ 21 నుంచి అతడు కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. గాలింపు చేపట్టిన పోలీసులు గ్రామం వెలుపల శిథిలావస్థలో ఉన్నబావిలో అతడి మృతదేహం ఉన్నట్టు గుర్తించారు. మృతుడి మెడపై కత్తిపోట్లు, తలపై తీవ్ర గాయాలు ఉండడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
అతడి ఫోన్ లొకేషన్ ఆధారంగా గ్రామం లోని 14,16 ఏళ్ల ఇద్దరు మైనర్ బాలురను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. దర్యాప్తులో ఐఫోన్లో రీల్స్ చేయడం వల్ల వీడియోలు హై క్వాలిటీతో వస్తాయనే ఆలోచనతో ఐఫోన్ కోసం అతడిని హత్య చేసినట్టు బాలురు అంగీకరించారు. సంఘటన జరిగిన రోజున వారు రీల్స్ చేద్దామని చెప్పి షాదాబ్ను ఊరి చివర ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గొంతుకోసి , బండరాయితో తలపై మోది హత్య చేసినట్టు పేర్కొన్నారు. హత్య అనంతరం ఆయుధాలను దాచడానికి సహకరించిన మరో బాలుడిని కూడా అరెస్టు చేసి వారిని గోండా ప్రాంతం లోని డివిజనల్ జువైనైల్ హోమ్కు తరలించినట్టు పోలీసులు చెప్రాఉ.