Saturday, April 20, 2024

ముందు సంస్కారం నేర్చుకో.. రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే శంకర్‌నాయక్ హితవు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/మహబూబాబాద్: రేవంత్‌రెడ్డి ముందు సంస్కారం నేర్చుకుని ప్రజలవద్ద మీ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ హితవు పలికారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు సరికావని, ఆ వ్యాఖ్యలు బాధాకరమని పేర్కోన్నారు. తన బతుకేందో ఆలోచించాలని, క్యారెక్టర్ ఏం లేదు ఎథిక్స్ లేకుండా ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని రేవంత్‌పై మండిపడ్డారు. కేసీఆర్‌ను విమర్శించే స్థాయి రేవంత్‌ది కాదని, ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని సూచించారు. నేను వద్దంటే మావాళ్లు ఆగారు కానీ, లేదంటే వేరే పరిస్థితి ఉండేదన్నారు. మానుకోట రాళ్ల రుచి ఏమిటో ఇప్పటికే రాష్ట్రమంతా తెలుసన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.

మీ ప్రభుత్వ హయాంలో చేయలేని పనులు ఎన్నో మేం చేసిచూపుతున్నామని, నీ పాదయాత్రలో మా అభివృద్ది కనిపించలేదా అని నిలదీశారు. మీకు చేతకాకపోతే మా ప్రభుత్వం తండాలను గ్రామపంచాయితీలుగా చేసింది.. కొత్త భవనాలు కూడా కట్టిస్తుందన్న విషయం తెలుసుకో అని రేవంత్‌ను ఉద్దేశించి ఎమ్మెల్యే అన్నారు. సోయితో మాట్లాడాలని, నిన్ను చూసి కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్న విషయం తెలుసుకోవాలన్నారు. నీ తాటాకు చప్పుళ్లకు భయపడే వాడిని కాదు. కేసీఆర్ నాటిన మొక్క ఈ శంకర్‌నాయక్ అని ఆయన స్పష్టం చేశారు. స్వపార్టీలోని నాయకులనే సమన్వయం చేసుకోలేని అసమర్ధనాయకుడివి నీవంటూ రేవంత్‌పై ఆయన మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో మానుకోటలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదని ఎమ్మెల్యే జోస్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News