Thursday, April 25, 2024

చదువుల తల్లికి ఎమ్మెల్సీ కవిత భరోసా

- Advertisement -
- Advertisement -
యూట్యూబ్‌లో క్లాసులు విని ఎంబిబిఎస్‌కు అర్హత సాధించిన హారిక
ఫీజు కట్టలేక దాతల కోసం ఎదురుచూపు
ఐదేళ్ల ఎంబిబిఎస్‌కు అయ్యే ఖర్చును భరిస్తానన్న ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్ రూరల్: చదువుల తల్లి హారికకు టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. యూట్యూబ్ ద్వారా క్లాసులు విని ఎంబిబిఎస్ సీటు సాధించిన నిజామాబాద్ జిల్లాలోని నాందేవ్‌వాడకు చెందిన హారికకు కవిత అండగా నిలిచారు. ఎంబిబిఎస్ సీటు సాధించినప్పటికీ ఆర్థిక స్థోమత లేని కారణంగా కాలేజీలో చేరని పరిస్థితి ఉన్న విషయాన్ని మీడియా కథనాల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తక్షణమే స్పందించారు.

తన నిజామాబాద్ పర్యటనలో హారికను కలిసి కవిత ఎంబిబిఎస్ కోర్సును పూర్తి చేయడానికి అయ్యే ఖర్చును భరిస్తానని భరోసానిచ్చారు. మొదటి ఏడాదికి సంబంధించిన కాలేజీ ఫీజుని చెక్కు రూపంలో అందించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… చదువుకోవాలన్న ఆకాంక్ష తపన ఉంటే ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుకోలేదని స్పష్టం చేశారు. చదువుకు పేదరికం అడ్డుకాదని హారిక నిరూపించారని తెలిపారు. తనకున్న వనరులన్నీ సద్వినియోగం చేసుకొని ఎంబిబిఎస్ సీటు తెచ్చుకోవడం సంతోషకరమని అన్నారు.

విద్యార్థులంతా హారికను స్పూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. హారిక ఎంబిబిఎస్ చదువులో రాణించి, వైద్యురాలిగా సమాజానికి సేవలు అందించాలని ఆకాంక్షించారు. కవిత తన చదువుకు ఆర్థికంగా అండగా నిలిచినందుకుగాను హారికతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. చెక్కు అందుకుంటున్న సమయంలో భావోద్యాగ్వానికి లోనయ్యారు. తాను బాగా చదువుకొని కవిత సూచించినట్లుగా సమాజానికి తోడ్పాటునందిస్తానని హారిక తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News