Sunday, April 28, 2024

మనీ స్కీమ్…మరణ శాసనం

- Advertisement -
- Advertisement -

ముగ్గురు చిన్నారులకు ఉరేసి… తండ్రి ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో దారుణం

మన తెలంగాణ/హైదరాబాద్/శంకర్‌పల్లి : రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో… అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కన్నబిడ్డలను చంపిన తండ్రి ఆపై తాను ఉరేసుకుని తనువు చాలించాడు. తెలిసిన వివరాల ప్రకారం టంగుటూరు గ్రామానికి చెందిన రవి(35) ఇటీవల మనీ స్కీమ్ పేరుతో ఓ స్కీమ్‌లో జనాలను చేర్పించాడు. టంగుటూరుతో పాటు చుట్టు పక్కల గ్రామాలు తిరుగుతూ పరిచయస్తులతో డబ్బులు కట్టించాడు. కేవలం 58 రోజుల్లో డబ్బులు రెట్టింపు అవుతాయని పెద్ద మొత్తంలో పెడితే మూడు, నాలుగు రెట్లు తిరిగి పొందవచ్చని తెలిపాడు. రవి మాటలు నమ్మి చాలా మంది ఈ స్కీమ్‌లో చేరారు. రూ.వెయ్యి కడితే రూ.3 వేలు, రూ.లక్ష కడితే 58 రోజుల తర్వాత రూ.5 లక్షలు ఇస్తానని చెప్పడంతో పెద్ద మొత్తంలో డబ్బులు కట్టారు. అయితే గడువు పూర్తయినా డబ్బులు తిరిగి రాకపోవడంతో జనం రవి ఇంటికి రావడం మొదలుపెట్టారు.

నువ్వు చెబితేనే స్కీమ్‌లో చేరాం, నీకే డబ్బులు కట్టాం, నువ్వే మాకు తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. ఈ గొడవతో తీవ్రస్థాయిలో కలత చెందిన రవి ఆదివారం రాత్రి తన ముగ్గురు కుమారులు సాయి కిరణ్(13), మోహిత్ కుమార్ (10), ఉదయ్ కిరణ్(7)లను ఉరేసి చంపేశాడు. ఆ తర్వాత తానూ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోమవారం ఉదయం మృతదేహాలను గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా, విషయం తెలుసుకున్న రవి భార్య శ్రీలత, కుటుం బీకులు సంఘటనాస్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారాన్నందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, మృతదే హాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదే హాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మోకీలా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, మనీ స్కీమ్ ఎవరు ప్రారంభించారు, స్కీం గురించి రవికి చెప్పిందెవరు, గ్రామస్థులు కట్టిన డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయనే వివరాలు తెలియ రాలేదు. పోలీసుల విచారణ తర్వాత పూర్తి వివరాలు బయటకొచ్చే అవకాశం ఉంది. పోలీసుల విచారణ తర్వాత పూర్తి వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News