Monday, April 29, 2024

కొలువుదీరిన కొత్త సర్కారు

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర రెండో సిఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం

అశేష ప్రజానీకం మధ్య హైదరాబాద్ ఎల్‌బి స్టేడియంలో ప్రమాణ స్వీకారం

డిప్యూటీ సిఎం భట్టితో పాటు 10మంది మంత్రులుగా ప్రమాణం

దైవసాక్షిగా 10మంది, పవిత్ర హృదయం సాక్షిగా మరో ఇద్దరు
కేబినెట్‌లో ఆరు ఉమ్మడి జిల్లాలకు చోటు

నలుగురు అగ్రవర్ణాల వారు.. ఇద్దరు ఎస్‌సిలు.. మరో ఇద్దరు బిసిలు
ఎస్‌టి, బ్రాహ్మణ, కమ్మ, వెలమ సామాజిక వర్గాలకు చెందిన ఒక్కొక్కరికి మంత్రివర్గంలో చోటు
సిఎం హోదాలో తొలిసారి సచివాలయానికి రేవంత్ రెడ్డి

ఘన స్వాగతం పలికిన ఉద్యోగులు.. భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు

సిఎం ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన రేవంత్.. వేద పండితుల ఆశీర్వచనాలు

ఆశేష ప్రజానీకం మధ్య ప్రమాణ స్వీకారం
సిఎం రేవంత్, డిప్యూటీ సిఎం భట్టి సహా మరో 10 మంది ప్రమాణం

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎల్‌బి స్టేడియంలో ఆశేష ప్రజానీకం మధ్య ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సిఎంగా మల్లు భట్టి విక్రమార్కతో సహా 10 మంది మంత్రులు దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం దైవసాక్షికి బదులుగా పవిత్ర హృదయంతో అని ప్రమాణం చేయగా, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దనసరి అనసూయ (సీతక్క) సైతం దైవసాక్షికి బదులుగా పవిత్ర హృదయంతో అని ప్రమాణం చేయగా, మిగిలిన వారంతా తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు. దామోదర రాజనర్సింహ ఇంగ్లీషులో ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించడానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎల్‌బి స్టేడియం చేరుకోవడంతో ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డిజిపి రవిగుప్త, పలువురు సీనియర్ అధికారులు గవర్నర్‌ను సాదారంగా వేదిక మీదకు తీసుకొచ్చారు.

అప్పటికే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున ఖర్గే సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు చేరుకున్నారు. వేదిక మీదకు గవర్నర్ చేరుకున్న వెంటనే అప్పటికే ఆశీనులైన వారికి అభివాదం చేశారు. ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1.04 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజ న్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. మొదట రేవంత్ ప్రమాణం చేయగా అనంతరం భట్టి చేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంతో ప్రారంభమైంది. రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మ్ంర తులతో ప్రమాణ స్వీకారం చేయించడానికి వేదిక మీదకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ చేరుకున్న వెంటనే జాతీయ గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత రేవంత్‌రెడ్డి చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
దైవ సాక్షిగా.. అనుముల రేవంత్‌రెడ్డి అను నేను…
తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఎల్‌బి స్టేడియంలో మొదటగా ప్రమాణ స్వీకారం చేశారు. దైవ సాక్షిగా.. అనుముల రేవంత్‌రెడ్డి అను నేను అంటూ తెలుగులో రేవంత్ ప్రమాణ స్వీకారం చేశారు. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల, నిజమైన విశ్వాసం, వినయం చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ ముఖ్యమంత్రిగా తన కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ, పక్షపాతంగానీ రాగద్వేషాలుగానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలకు న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అంటూ తెలంగాణ ముఖ్యమంతిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం విధి నిర్వహణలో గోప్యతను పాటిస్తానని కూడా ప్రమాణం చేశారు. నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ఏ వ్యక్తికీ తెలియపర్చనని దైవసాక్షిగా ప్రమా ణం చేస్తున్నానని ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.
డిప్యూటీ సిఎంగా మల్లు భట్టి విక్రమార్క
డిప్యూటీ సిఎంగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు, సీతక్కలు ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమానికి ఏఐసిసి అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్, హిమాచల్‌ప్రదేశ్ సిఎం సుఖ్వీందర్ సింగ్ తదితరులంతా హాజరయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News