Monday, April 29, 2024

మణిపూర్‌కు మరికాసేపట్లో ప్రతిపక్ష ఇండియా ఎంపీల ప్రతినిధి బృందం

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: హింసాకాండతో సంక్షుభితంగా మారిన మణిపూర్‌లో తాజా పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన ఎ21 మంది ఎంపీల ప్రతినిధి బృందం రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం మణిపూర్‌ను సందర్శించనున్నది. లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరితో కూడిన ఈ ప్రతినిధి బృందం తమ రాష్ట్ర పర్యటనను ఆధారం చేసుకుని మణిపూర్ సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు అవసరమైన సిఫార్సులను ప్రభుత్వానికి, పార్లమెంట్‌కు అందచేయనున్నది.

కాగా..మణిపూర్ పర్యటన నేపథ్యంలో లోక్‌సభలో కాంగ్రెస్ ఉప నాయకుడైన గౌరవ్ గొగోయ్ మణిపూర్‌లో జరిగిన హింసాకాండపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మణిపూర్‌లోని కొండ ప్రాంతాలు, లోయ ప్రాంతాలను తమ 16 పార్టీలకు చెందిన ఎంపీల బృందం సందర్శించి అక్కడి ప్రజలను కలుసుకుంటుందని తెలిపారు. పరిస్థితిని అంచనా వేసేందుకు రెండు ప్రాంతాలలోని సహాయక శిబిరాలను తాము సందర్శిస్తామని ఆయన చెప్పారు. ఆదివారం ఉదయం మణిపూర్ గవర్నర్ అనుసూయ యూకీని కూడా కలుసుకోనున్నట్లు ఆయన తెలిపారు. మళ్లీ తాజాగా హింస చెలరేగిన చురచంద్‌పూర్‌ను సందర్శించడానికి రాష్ట్ర ప్రభుత్వం తమకు హెలికాప్టర్లను సమకూర్చాలని ప్రతిపక్ష ఎంపీల ప్రతినిధి బృందం కోరినట్లు ఆయన చెప్పారు.

అధిర్ రంజన్ చౌదరితోపాటు గౌరవ్ గొగోయ్, టిఎంసి ఎంపి సుష్మితా దేవ్, జెఎంఎం ఎంపీ మహువా మాజీ, డిఎంకె ఎంపి కనిమోళి, ఆర్‌ఎల్‌డి నుంచి జయంత్ చౌదరి, ఆర్‌జెడి నుంచి మనోజ్ కుమార్ ఝా, ఆర్‌ఎస్‌పి నుంచి ప్రేమచంద్రన్, జెడియు అధినేత రాజీవ్ రంజన్(లలన్) సింగ్, జెడియు నుంచి అనీల్ ప్రసాద్ హెగ్డే, సిపిఎం నుంచి ఎ రహీం, సిపిఐ నుంచి సంతోష్ కుమార్ ప్రభృతులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News