Tuesday, May 7, 2024

ఓఆర్‌ఆర్ టోల్ టెండర్లపై విచారణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండి పడేలా తక్కువ రేటుకు టెండ ర్లు కట్టబెట్టిన తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస ధర నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని హెచ్‌ఎండిఎ అధికారులను ప్రశ్నించారు. అందులో ఎవరెవరి ప్రమేయముంది, ఏయే సంస్థలున్నాయి, బా ధ్యులెవరో అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాల ని ఆదేశించారు. ఈ టెండర్లలో జరిగిన అవకతవకలు, అనుసరించిన విధానాలు, దస్త్రా లు కదిలిన తీరుపై పూర్తి వివరాలను సమర్పించాలని హెచ్‌ఎండిఎ జాయింట్ కమిషనర్ అమ్రపాలికి బాధ్యతలు అప్పగించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైళ్లు తప్పిపోయినట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారులు, బాధ్యులైన ఉద్యోగులపై వ్యక్తిగతంగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. హెచ్‌ఎండిఎ నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత మంత్రివర్గంలో చర్చించి ఈ టెండర్ల వ్యవహారాన్ని సిబిఐ కానీ అదే స్థాయి మరో దర్యాప్తు సంస్థకు అప్పగిస్తామని చెప్పారు. బుధవారం సచివాలయంలో హెచ్‌ఎండిఎ అధికారులతో సిఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమగ్ర విచారణ చేయిస్తే నిజాలు బయటకు వస్తాయి ః
టెండర్లకు ముందు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రతి నెలా గరిష్ఠంగా టోల్ వసూళ్లతో ఏడాదికి రూ.600 కోట్ల ఆదాయం వచ్చేదని అధికారులు వివరించారు. అలాంటప్పుడు 30 ఏళ్ల్లకు రూ.18 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని కేవలం రూ.7380 కోట్లకు ఐఆర్‌బి కంపెనీకి ఎలా అప్పగించారని ఆరా తీశారు. హెచ్‌ఎండిఎ అనుసరించిన టెండర్ విధానంతోనే ప్రభుత్వం రూ.15 వేల కోట్లకుపైగా నష్టపోయిందని సమావేశంలో ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. హెచ్‌ఎండీఏ రెండు కంపెనీలతో డీపీఆర్ తయారు చేయించటం, ప్రభుత్వ ఆదాయానికి నష్టం తెచ్చే డిపిఆర్‌ను ఎంచుకుందని చర్చకు వచ్చింది. అందుకే ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ చేయిస్తేనే, నిజాలు బయటకు వస్తాయని అభిప్రాయపడ్డారు. టెండర్ దక్కించుకున్న కంపెనీ ప్రభుత్వంతో చేసుకున్న కాంట్రాక్టు అగ్రిమెంట్‌ను చూపించి 49 శాతం వాటాను విదేశీ కంపెనీలకు అప్పగించిందని, విదేశీ కంపెనీతో ఆ సంస్థ చేసుకున్న లావాదేవీలపై కూడా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఓఆర్‌ఆర్‌ను యూనిట్‌గా తీసుకుని అభివృద్ధి ప్రణాళిక తయారు చేయాలి ః
ఔటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. క్రమంగా రీజినల్ రింగ్ రోడ్డు వరకు హెచ్‌ఎండిఎ పరిధిని విస్తరించాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానం ఉండేలా రేడియల్ రోడ్లు నిర్మించాలని చెప్పారు. ఇప్పటికే అభివృద్ధ్ది చెందిన నగరంతో పాటు కొత్తగా విస్తరిస్తున్న చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలన్నారు. మాస్టర్ ప్లాన్-2050కి అనుగుణంగా ప్రత్యేక కన్సల్టెన్సీతో నగర అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ ను రూపొందించాలని ఆదేశించారు.హెచ్‌ఎండిఎ పరిధిలో ఉన్న చెర్వులు, కుంటలను పరిరక్షించాలని, మరోవైపు ల్యాండ్ ఫూలింగ్ వేగవంతం చేయాలని చెప్పారు.

అవసరమైతే ల్యాండ్ ఫూలింగ్, అక్కడి స్థలాల అభివృద్ది విషయంలో జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలని, సమన్వయంతో పని చేయాలని సూచించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో దాదాపు 8374 ఎకరాల ల్యాండ్ పార్శిళ్లు ఉన్నాయి. వీటిలో 2031 పార్శిళ్లు వివిధ స్థాయిల్లో కోర్టు కేసుల్లో ఉన్నాయి. హెచ్‌ఎండీఏ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని, డిజిటల్, జీపీఎస్ విధానాలతో ఎక్కడ ఎంత స్థలముందో మ్యాపింగ్ చేయాలని సీఎం సూచించారు. తమ పరిధిలో ఉన్న స్థలాలతో హెచ్‌ఎండీఏ ఆదాయం పెంచుకునే చర్యలు చేపట్టాలని చెప్పారు. అడ్వర్టయిజ్మెంట్ల ద్వారా వచ్చే ప్రకటనల ఆదాయంపై కూడా దృష్టి పెట్టాలన్నారు. ల్యాండ్ ఫూలింగ్, ల్యాండ్ పార్శిల్స్, చెర్వులు, కుంటలు ఆక్రమణకు గురవకుండా చూసేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించాలని సమావేశంలో చర్చ జరిగింది. డిఐజి స్థాయిలో ఒక ఐపిఎస్ అధికారిని నియమించాలని, ఇద్దరు ఎస్పీ ర్యాంకు అధికారులకు బాధ్యతలు అప్పగించాలన్నారు.

కమ్యూనిటీ స్థలాలపై సర్వే చేయాలి ః
హైదరాబాద్ తో పాటు వరంగల్, కరీంనగర్ తదితర పట్టణాలన్నింటా లే అవుట్లలో కమ్యూనిటీ అవసరాలకు ఇచ్చిన స్థలాలు తమ అధీనంలో ఉన్నాయా.. లేదా ఆక్రమణకు గురయ్యాయా.. వెంటనే సర్వే చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలల ఏర్పాటుకు ముందుకొచ్చే కార్పేరేట్ కంపెనీలు, పేరొందిన పాఠశాలల యాజమాన్యాలకు వీటిని అప్పగించాలని సూచించారు. ఆ ప్రాంతంలోని పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు కనీసం 25 శాతం కోటాగా ఉచితంగా అడ్మిషన్లు ఉండేలా చూడాలని, దీంతో అన్ని ప్రాంతాల్లో ఆదర్శ పాఠశాలలు అందుబాటులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు.

హాస్సేన్‌సాగర్ ప్రాంతాలను ఆహ్లాదకరమైన జోన్‌గా తీర్చిదిద్దాలి :
హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ సమీపంలోని పరిసర ప్రాంతాలను ఆహ్లాదకరంగా ఉండే అందమైన జోన్‌గా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. ఇటు అంబేద్కర్ విగ్రహం, ఎన్టీఆర్ పార్కు, తెలంగాణ అమరుల జ్యోతి, అటు నెక్లెస్ రోడ్డు నుంచి ఇందిరా పార్కు, సంజీవయ్య పార్కు వరకు మొత్తాన్ని ప్రపంచ స్థాయి సందర్శనీయ ప్రాంగణంగా తయారు చేయాలని సూచించారు. హుస్సేన్ సాగర్ చుట్టూ నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమణలను తొలిగించి, పర్యాటకులు, నగర ప్రజలు తీరికవేళలో ఆనందంగా గడిపేలా ఈ ప్రాంతం ఉండాలని అధికారులకు వివరించారు. దుబాయ్ తరహాలో స్కై వాక్ వే, ఫుడ్ స్టాళ్లు, చిల్డ్రన్ అమ్యూజ్మెంట్ జోన్, గ్రీనరీ ల్యాండ్ స్కేప్‌లను అభివృద్ధి చేయాలని సూచించారు.

అవసరమైతే ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలను మరో రూట్‌లో మళ్లించి, దీన్ని పర్యాటక జోన్‌గా మార్చాలన్నారు. వెంటనే అంతర్జాతీయ స్థాయి కన్సల్టెన్సీలతో ఈ ప్రాజెక్టు నమూనాలు తయారు చేయాలని సూచించారు. ఈసమీక్ష సమావేశంలో
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సిఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు హెచ్‌ఎండిఎ జాయింట్ కమిషనర్ అమ్రపాలితో పాటు ఇతర పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News