Friday, April 19, 2024

రూ.500కోట్ల పెట్టుబడితో వస్తున్న పిరమాల్ ఫార్మా

- Advertisement -
- Advertisement -

Piramal Pharma

 

దావోస్‌లో మంత్రి కెటిఆర్‌తో ఆ సంస్థ ప్రతినిధుల ఒప్పందం
ప్రత్యక్షంగా 600 మందికి ఉపాధి అవకాశాలు
ప్రస్తుత పిరమాల్ ఫార్మా ఫెసిలిటీని విస్తరించనున్న గ్రూప్

హైదరాబాద్: తెలంగాణలో మరో విదేశీ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. పిరమాల్ గ్రూప్ సంస్థ రానున్న మూడేళ్ళలో రూ. 500 కోట్ల పెట్టుబడులను రాష్ట్రంలో పెట్టనుంది. ఈ మేరకు దావోస్‌లో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌తో బుధవారం పిరమాల్ గ్రూప్ సంస్థ ప్రతినిధులు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఈ పెట్టుబడులతో అదనంగా తెలంగాణలో మరో 600 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.

పిరమాల్ గ్రూప్ ప్రస్తుతం ఉన్న పిరమల్ ఫార్మా పేరుతో తెలంగాణలో విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే రానున్న రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. దీంతో ప్రస్తుతం తెలంగాణలో తనకున్న 14 వందల మంది ఉద్యోగులకు అదనంగా మరో 600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించేందుకు ఆ సంస్థకు అవకాశం దక్కనుంది. ప్రస్తుతం పిరమాల్ కంపెనీ తెలంగాణలో తనకున్న పిరమాల్ ఫార్మా ఫెసిలిటీని విస్తరించేందుకు సుమారు 500 కోట్ల రూపాయలను రానున్న మూడు సంవత్సరాల్లో పెట్టుబడిగా పెట్టనున్నట్లు వెల్లడించింది. పిరమాల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమాల్ తో మంత్రి కెటిఆర్ సమావేశానంతరం ఆ సంస్థ తన నిర్ణయాన్ని ప్రకటించింది.

గ్రూప్ తెలంగాణ రాష్ట్రానికి ఇంత భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం పట్ల మంత్రి కెటిఆర్ సంస్థకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం నుంచి సంస్థకు కావలసిన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామి ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో తనకున్న ఫార్మా యూనిట్ విస్తరణలో భాగంగా నూతన తయారీ బ్లాకులు ఏర్పాటు, వేర్‌హౌస్ విస్తరణ కోసం ఈ మొత్తాన్ని సంస్థ వెచ్చించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం తన ప్లాంట్ విస్తరణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్లాంట్లను కూడా హైదరాబాద్‌కు తరలించే అవకాశాలను పరిశీలిస్తామని కూడా పిరమాల్ గ్రూప్ తెలిపింది. తెలంగాణలో పరిశ్రమలకు ప్రభుత్వం పూర్తిగా అనుకూలం గా ఉండడం, ప్రత్యేకంగా అమలు చేస్తున్న పారిశ్రామిక పాలసీలతో పాటు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది.

దీంతోపాటు హైదరాబాద్ నగరంలో ఉన్న ఇతర కంపెనీలను కూడా కొనుగోలు చేసి తన తయారీ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా హెల్త్ కేర్, సురక్షిత తాగునీరు, డిజిటల్ విలేజ్ వంటి కార్యకలాపాలు చేపట్టనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో కంపెనీకి అన్ని అనుమతులు కలిగిన మూడు తయారీ బ్లాకులు ఉన్నాయని, జీరో డిస్చార్జ్ విధానంలో, పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించని ఈ విధంగా తమ పిరమాల్ గ్రూప్ పనిచేస్తుందని తెలిపారు.

హెల్త్ కేర్ రంగంలో ఇప్పటికే 1400 మంది ఉద్యోగులు ఉన్నారని, ప్రస్తుత 500 కోట్ల రూపాయల అదనపు పెట్టుబడి ద్వారా మరో 500 మందికి పైగా ఉద్యోగాలు కల్పించే అవకాశం లభిస్తుందని తెలిపింది. ఈ పెట్టుబడి ద్వారా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన మందుల తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నూతన ప్లాంట్ రాబోతున్న స్థలాన్ని సందర్శించేందుకు వచ్చేనెలలో తెలంగాణలో పిరమాల్ గ్రూప్ సీనియర్ ప్రతినిధి బృందం పర్యటిస్తుందని తెలిపారు.

Piramal Pharma with an investment of Rs 500 crore
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News