Monday, April 29, 2024

ఈ నెల 17న పిఎం విశ్వకర్మ పథకానికి ప్రధాని ప్రాంభోత్సవం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సంప్రదాయ చేతి వృత్తి కళాకారులను ఆదుకోవడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన కొత్త పథకం ‘ పిఎం విశ్వమిత్ర’ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈ నెల 17న(ఆదివారం) ప్రారంభిస్తారు. సంప్రదాయ చేతివృత్తుల్లో నిమగ్నమైన ఉన్న కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడంతో పాటుగా స్థానిక ఉత్పత్తులద్వారా ప్రాచీన సంప్రదాయ, సంస్కృతులు విలసిల్లేలా చూడడానికి ప్రధాని నిరంతరం దృష్టిపెడుతున్నారని ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది.ప్రధాని మోడీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు సమకూరుస్తుంది. ఇందుకోసం రూ.13,000 కోట్లను కేటాయిస్తారు. పథకం కింద లబ్ధిదారులను బయోమెట్రిక్ ఆధారిత విశ్వకర్మ పోర్టల్‌ను ఉపయోగించి కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా ఉచితంగా నమోదు చేస్తారు. సెప్టెంబర్ 17 ప్రధాని మోడీ జన్మదినం కూడా. ఆ రోజున ఆయన 73వ పడిలో అడుగుపెడతారు.

ఈ పథకం ద్వారా ఎంపికయిన లబ్ధిదారులకు పిఎం విశ్వకర్మ సర్టిఫికెట్, ఐడి కార్డు ద్వారా గుర్తింపు అందజేస్తారు. అంతేకాకుండా వారి నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి అవసరమైన శిక్షణను అందించడంతో పాటుగా రూ.15 వేల విలువైన టూల్‌కిట్ ప్రోత్సాహకం, తొలి విడతలో లక్ష రూపాయలు, రెండో విడతలో రూ.2లక్షల మేర ఎలాంటి హామీ అవసరం లేకుండా రుణాన్ని 5 శాతం వడ్డీపై అందజేస్తారని, డిజిటల్ లావాదేవీల కోసం ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ మద్దతు అందజేస్తారని ఆ ప్రకటన తెలిపింది. కార్పెంటర్లు, బోటు తయారీదార్లు, కుమ్మర్లు, కమ్మర్లు, బంగారు పనివారు, శిల్పకళాకారులు, రాళ్లు కొట్టేవారు, బుట్టలు, చీపుర్ల తయారీదార్లు, కొబ్బరి పీచు అల్లకందార్లు, బొమ్మల తయారీదార్లు, క్షురకులు, దండల తయారీదార్లు, దర్జీలు, చేపల వలల తయారీదార్లు లాంటి 18 సంప్రదాయ వృత్తులను ఈ పథకం కింద గుర్తించారు. వీళ్లలో చాలా మంది వెనుకబడిన తరగతులకు చెందిన వారే. కీలక ఓటు బ్యాంకు అయిన ఈ వర్గాలకు చేరువ కావడం లక్షంగా బిజెపి ఈ పథకాన్ని తీసుకు వస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News