Saturday, April 20, 2024

కాంగ్రెస్ ఆందోళనలు భగ్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో సర్పంచ్‌ల సమస్యలపై పోరాటానికి సిద్ధమైన కాంగ్రెస్ నేతలను పోలీసులు నియంత్రించారు. హైదరా బాద్ ధర్నా చౌక్ వద్ద తలపెట్టిన ఆందోళనలను భగ్నం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నేతలను ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. ఎవరూ ఇంటి నుంచి బయటకు రానీయకుండా ఆంక్షలు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సర్పంచుల నిధుల సమస్యలపై హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ చేపట్టే ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరిం చినప్పటికీ కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహిస్తామని చెప్పారు. దీంతో పోలీసులు నేతలను ఎక్కడికక్కడే అరెస్ట్ చేశారు. ముందుగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, కిసాన్ కాంగ్రెస్ జాతీయ నాయ కులు కోదండరెడ్డి, జీవన్‌రెడ్డి, మల్లు రవి, అద్దంకి దయాకర్ తదితరులను కూడా హౌస్ అరెస్ట్ చేశారు.

పోలీసుల వాహనాలు, వ్యాన్లను సిద్ధం చేసుకొని నేతల ఇంటి దగ్గర భారీ సిబ్బందితో పోలీసులు పహారా కాశారు. ధర్నాను అడ్డుకునేందుకు నేతలను గృహ నిర్బంధం చేస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని రాష్ట్రంలో ఇదో కొత్తరకం నిర్బంధం అని పిసిసి వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హౌస్ అరెస్టుల పేరిట నేతలను అడ్డుకుంటున్నారని ఇది చాలా దుర్మార్గం అని తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పోరాటాలు చేస్తుంటే సర్కారు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రభుత్వ పనితీరును క్షేత్రస్థాయిలో ప్రజా మద్దతుతో నిలదీస్తామని హెచ్చరించారు. సర్పంచుల నిధుల విడుదల, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై పిసిసి రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం ఇందిరా పార్కు వద్ద జరగాల్సిన ధర్నా కు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. మండల కేంద్రాలలో ధర్నాలు, రాస్తారోకోలు , ప్రభుత్వ దిష్టి బొమ్మల దగ్ధం తదితర నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి డిసిసి అధ్యక్షులకు పిలుపునిచ్చారు.

ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదని అధికారులు తేల్చి చెప్పారు. అనుమతి లేకపోయినా ధర్నాలు, రాస్తారోకోలు జరిపి తీరుతామని కాంగ్రెస్ నేతలు అన్నారు. దీంతో ఎవరూ బయటకు రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు పోలీసు ఆంక్షలపై ప్రగతి భవన్ వద్ద నిరసనకు తెలిపేందుకు వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలోనే తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు. గాంధీ భవన్ వద్ద సైతం నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News