హైదరాబాద్: ఎపి మంత్రి నారా లోకేష్ బనకచర్ల కోసం వరద నీరు తీసుకుపోతే ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారని అనడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ చురకలంటించారు. నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు గురించి ముందు లోకేష్ తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. బనకచర్లపై లోకేష్ వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి పొన్నం రీ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీటి లభ్యత దృశ్య 968 టిఎంసిలు తెలంగాణకు 531 టిఎంసిలు కేటాయించారని, నీటి వినియోగం పూర్తి అయిన తరువాత వరద జలాలు లెక్కలోకి వస్తాయని తెలియజేశారు.
ఆది తెలుసుకోకుండా ఎపి ప్రజలను మభ్యపెట్టి తెలంగాణ ప్రజలను మోసం చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కులు ఆనాడు ట్రిబ్యునల్ లు కేంద్ర ప్రభుత్వలు నిర్ణయించిన విధంగా మా నీటిని ఒక చుక్క కూడా వదులుకోమని హెచ్చరించారు. నీటికి సంబంధించిన అంశాలపై ఇరు రాష్ట్రాలు గడిచిన వాతావరణం తెచ్చుకునే పరిస్థితి మంచిది కాదని హితువు పలికారు. మా కోటా మా వాట మా నీటి వినియోగం పూర్తికాకముందే.. లోకేష్ వరద జలాల పేరు మీద ప్రాంతీయ అసమానతలు రెచ్చగొడుతున్నారని మాట మాట్లాడడం సరికాదని, మా రాష్ట్ర ప్రయోజనాలు మా రైతుల హక్కుల కోసం బాజప్త మాట్లాడతామని పొన్నం స్పష్టం చేశారు. మా రాష్ట్ర హక్కులను తాము కాపాడుకుంటామని, ఎపి రాష్ట్ర ప్రయోజనాలు మీరు కాపాడుకోవాలని, ప్రజలను మోసం చేసే విధంగా తప్పుడు సమాచారం ఇవ్వొద్దని ధ్వజమెత్తారు.
- Advertisement -