న్యూఢిల్లీ : నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడింది. రేపు (శనివారం) ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరితీయాల్సి ఉంది. ఐతే చివరి నిమిషంలో శిక్ష అమలుపై స్టే విధిస్తూ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు తీర్పునిచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఉరిశిక్ష అమలు చేయవద్దని అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రానా ఆదేశాలు జారీ చేశారు. నిర్భయ దోషుల ఉరిశిక్ష వాయిదా పడడం ఇది రెండోసారి. ఐతే ఎప్పుడు ఉరితీయాలన్న దానిపై నిర్ణయాన్ని ప్రకటించలేదు కోర్టు. త్వరలోనే కొత్త డెత్ వారెంట్ జారీ చేస్తామని చెప్పారు. మరోవైపు నేరం జరిగినప్పుడు తాను మైనర్ని అని పవన్ గుప్తా వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు ఈ రోజు(శుక్రవారం) కొట్టివేసింది.
ఈ క్రమంలో నలుగురు దోషులకు రేపు ఉరి కన్ఫామ్ అనుకున్నారు అందరూ. కానీ దోషులు నలుగరూ మళ్లీ ట్రయిల్ కోర్టును ఆశ్రయించారు. తమ నలుగురుకీ ఇంకా న్యాయపరమైన ప్రయత్నాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయని, అందుకే చిట్టచివరి అవకాశం ఇవ్వాలని వారు పిటిషన్లో పేర్కొన్నారు. నలుగురు దోషులలో ఇప్పటికి ముగ్గురే రాష్ట్రపతికి క్షమాబిక్ష పిటిషన్లను పెట్టుకున్నారని, అందులో ఇద్దరి పిటిషన్లను ప్రెసిడెంట్ రిజక్ట్ చెయ్యగా మరొకరిది పెండింగ్లో ఉందని వారు తెలిపారు. ఇంకొకరు ఇంతవరకు క్షమాబిక్ష పిటిషన్ దాఖలు చెయ్యలేదు. దీంతో కోర్టు శిక్ష పాటియాలా కోర్టు శిక్ష అమలుపై స్టే విధించింది. కాగా ఉరి శిక్ష అమలును జాప్యం చెయ్యాలనే దోషుల తరపు న్యాయవాదులు ఒకేసారి నలుగురి పిటిషన్లు దాఖలు చెయ్యకుండా, ఒక్కొక్కటిగా దాఖలు చేశారని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.