Friday, April 26, 2024

టర్కీ , సిరియాలో తీవ్ర భూకంపం…కనీసం 195 మంది మృతి!

- Advertisement -
- Advertisement -

అంకార(టర్కీ): టర్కీ, సిరియా ఆగ్నేయంలో సోమవారం తెల్లవారుజామున తీవ్రమైన భూకంపం సంభవించింది. అది రిక్టర్ స్కేలుపై 7.8 మాగ్నిట్యూడ్‌గా నమోదయింది. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. అనేక మంది తీవ్ర చలిలో, రాత్రిపూట బయటికి పరుగులు తీశారు. కనీసం 195 మంది చనిపోగా, వందలాది మందికి గాయాలయ్యాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. రెస్కూ సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు. ఓ అపార్ట్‌మెంట్ వాలుతున్నప్పుడు వీధిలోని జనం కేకలు వేశారు. సిరియా బార్డర్ నుంచి 90 కిమీ. మేరకు భూకంపం ప్రభావం కనపడింది. సిరియాలో అంతర్యుద్ధ కారణంగా ఇప్పటికే 40 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ చాలా మంది అత్యంత దుర్భరంగా బతుకుతున్నారు. ‘వందలాది మంది చనిపోయి ఉంటారు. శిథిలాల కింద మరణించిన వారి సంఖ్య ఇంకా తేలాల్సి ఉంది. మేము చాలా ఒత్తిడిలో ఉన్నాము’ అని ముహీబ్ ఖద్దూర్ అనే డాక్టర్ టెలిఫోన్ ద్వారా ‘అసోసియేటెడ్ ప్రెస్’ వార్తా సంస్థకు తెలిపారు.

టర్కీలో ‘సెర్చ్ అండ్ రెస్కూ టీమ్‌లను వెంటనే డిస్పాచ్ ’చేస్తూ టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఆదేశాలు జారీ చేశారు. టర్కీలో కనీసం 76 మంది చనిపోగా, 440 మందికి గాయాలయ్యాయని తొలుత విపత్తు, అత్యవసర నిర్వహణ సంస్థ పేర్కొంది. టర్కీ మలత్యా ప్రాంతంలో కనీసం 130 భవనాలు కూలాయి. కాగా టర్కీలోని దియర్‌బకీర్ నగరంలో 15 భవనాలు కూలాయి. ఇదిలావుండగా అమెరికా జియోలజికల్ సర్వే ప్రకారం, భూకంపం గాజియాన్‌టెప్‌కు 33 కిమీ.(20 మైళ్లు) వద్ద కేంద్రీకృతమైంది. ఇది 18 కిమీ. లోతుగా ఉండిది. 10 నిమిషాల తర్వాత ఆఫ్టర్ షాక్ ప్రకంపనలు వచ్చాయి. బీరూట్‌లో చాలా మంది ఇళ్లు వదిలి వీధుల్లోకి వచ్చారు. కొంత మందయితే తమ కార్లలో ఇంటికి దూరంగా వెళ్లారు. గురువారం వరకు మంచుతుఫాను ఎదుర్కొంటున్న మధ్యప్రాచ్యానికి ఇప్పుడు భూకంపం కూడా తోడవ్వడంతో ప్రజల బాధలు ఇబ్బడిముబ్బడి అయ్యాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News