బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఈ ఏడాది ఐపిఎల్ ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన విజయోత్సవ సభలో పెను విషాదం చోటు చేసుకుంది. తమ క్రికెటర్లను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది.
ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆర్సిబిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆర్సిబితో పాటు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డిఎన్ఎ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సహా ఈ ఘటనకు సంబంధించిన పలువురిపై సమాచార హక్కు కార్యకర్త స్నేహమయి కృష్ణ ఫిర్యాదు మేరకు కబ్బన్ పార్క్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
తాజాగా ఆర్సిబి యాజమాన్యం కర్ణాటక హైకోర్టును (High Court) ఆశ్రయించింది. తమపై నమోదైన కేసును ఎత్తివేయాలని పిటిషన్ దాఖలు చేసింది. తమను తప్పుడు కేసులో ఇరికించారని ఆర్సిబి, రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ లిమిటెడ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ కేసును రద్దు చేయాలని కోర్టును కోరారు. మరోవైపు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డిఎన్ఎ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా తమపై నమోదైన కేసుకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.