హైదరాబాద్ : జిహెచ్ఎంసిస్పెషల్ కమిషనర్ సుజాత గుప్తా గురువారం ఉద్యోగానికి రాజీనామా చేశారు. కొత్త సంవత్సరం వేళా జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో రాజీనామా అంశం ఒక్కసారిగా కలకలం సృష్టించింది. గతంలో కంటోన్మెంట్ సిఇఓగా విశిష్ట సేవలను అందించిన సుజాత గుప్తా ఆ తర్వాత తన (ఐడిఈఎస్) ఇండియన్ డిఫెన్స్ ఏస్టేట్స్ సర్వీసెస్ పదవికి స్వచ్చంద విరమణ చేశారు.
ఇదేక్రమంలో నగరాన్ని మరింత స్వచ్ఛత దిశగా తీర్చిదిద్దడమే లక్షంగా గత ఏడాది సెప్టెంబర్ 26న సుజాత గుప్తాను కాంట్రాక్ట్ ప్రతిపాదికన నెలకు రూ.2 లక్షల వేతనంతో జిహెచ్ఎంసి స్పెషల్ కమిషనర్గా నియమించిన ప్రభుత్వం ఆమెకు పారిశుద్దం (శానిటేషన్) పూర్తి బాధ్యతలతో ఇటీవలే ట్రాన్స్పోర్ట్ విభాగాన్ని సైతం అప్పగించారు. అయితే ఆమె ఉన్నపలంగా రాజీనామా చేయడం, తక్షణమే ఆమోదం పొందడం, ప్రసుత్తానికి శానిటేషన్ పూర్తి బాధ్యతలను అడిషనల్ కమిషనర్ సుదామ్ష్కు అప్పగించడం చకచక జరిగిపోయింది.
సుజాత గుప్తా రాజీనామాతో కలకలం
సుజాత గుప్తా రాజీనామాతో జిహెచ్ఎంసిలో కలకలం రేపింది. ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకువచ్చిన ఆమె అసలు రాజీనామా ఎందుకు చేసిందనే అంశం చర్చానీయంగా మారింది. స్వచ్చందగా పదవి విరమణ చేసిన ఆమెను స్పెషల్ కమిషనర్ హోదాలో నియమించడం, శానిటేషన్తో పాటు దానికి అనుబంధంగా ఉండే ముఖ్యమైన విభాగాలను ఒకోక్కటిగా ఆమె పరిధిలోకి తీసుకురావడం జరిగింది. దీంతో పలువురు అసంతృప్తిగా ఉన్న కొందరు చక్రం తిప్పడం వల్లే ఆమె రాజీనామా చేయాల్సి వచ్చిందటూ ప్రచారం జరుగుతోంది. అయితే సుజాత గుప్తా వ్యక్తిగత కారణాల వల్లే తన ఉద్యోగానికి రాజీనామా చేశారనేది మరో వినికిడి.