Monday, April 29, 2024

మళ్లీ సంఘటితం

- Advertisement -
- Advertisement -

ఉద్యోగ, కార్మిక సంఘాలు ఉండాల్సిందే

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచితంగా విద్యుత్ ఇచ్చే బాధ్యత మాపై ఉందని, దీనిపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామ ని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు.ఆదివారం ఎంసిహెచ్‌ఆర్‌డిలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెగ్యులర్ పోస్టుల్లో రిటైర్డ్ ఉద్యోగులను తొలగించి ప్రమోషన్లకు ఆటంకం లేకుండా చూస్తామని, రిటైర్డ్ ఉద్యోగుల సేవలు అవసరం అనుకుంటే ఒఎస్డీలుగా నియమించుకుంటామని ఆయన తెలిపారు. వివిధ శాఖల్లో ఉన్న 1100 మంది రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, గవర్నర్ తో మాట్లాడి కోదండరాంను శాసన మండలికి పంపుతామని, ఆయన ఎంఎల్‌సిగా ఉంటేనే శాసన మండలికి గౌరవమని సిఎం రేవంత్ తెలిపారు. ఉద్యోగుల డిఏ తో పాటు ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సిఎం రేవంత్ హామీనిచ్చారు. పాఠశాలల్లో సర్వీస్ పర్సన్‌లను నియమిస్తామని సిఎం చెప్పారు. కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన ఆర్టీసి కార్మిక గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహిస్తామని సిఎం తెలిపారు. పదేళ్లుగా మీ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం రాలేదని, ఆవేదన వినేవారు లేక ఇబ్బందులు పడ్డారని, మీ సమస్యలు విని పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు ఉండాల్సిందేనని అన్ని సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తుందని ఆయన తెలిపారు. అన్ని సమస్యలు పరిష్కరించుకుందామని ఈ సందర్భంగా సిఎం వారికి హామీ ఇచ్చారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం కృషి చేస్తుందన్నారు. జీఓ 317 సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని ఆయన గుర్తు చేశారు. 2008 డిఎస్‌సి బిఈడీ అభ్యర్థుల ఉద్యోగాలపై ఈ నెల 12వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామని సిఎం స్పష్టం చేశారు.
నిర్బంధనతో పాలన కొనసాగించలేం
మీ సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచామని సిఎం రేవంత్ వారితో పేర్కొన్నారు. వాటిని పరిష్కరించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఇన్నాళ్లు సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా ఉన్నది, అధికారంలో ఉన్నది కెసిఆర్ కుటుంబమేనని ఆయన ఆరోపించారు. నిర్భంధాలతో పాలన సాగిస్తామనుకోవడం వారి భ్రమ అని సిఎం రేవంత్ అన్నారు. సమస్యలకు పరిష్కారం నిర్బంధాలు కాదని, చర్చలతో వాటికి పరిష్కారం లభిస్తుందన్నారు. మీకు విశ్వాసం కల్పించడానికే ఈ చర్చలు జరిపామన్నారు. ఇప్పటికే మీ సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించామని సిఎం వారితో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో కిందిస్థాయి సిబ్బందిని నియమిస్తామని, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఉద్యోగుల తరపున ప్రాతినిథ్యం ఉండాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ ఒక్క రాజకీయ పార్టీ తామే సాధించామని చెప్పుకోవడం అబద్ధం అన్నారు. విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధ్దించిందన్నారు.
కెసిఆర్ కుటుంబంలో ఎవరూ రక్తం చిందించలేదు…
రక్తం చిందించకుండా తెలంగాణ సాధించామని కెసిఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. కెసిఆర్ కుటుంబంలో ఎవరూ రక్తం చిందించలేదు కానీ, తెలంగాణ కోసం కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వారు రక్తాన్ని చిందించారని రేవంత్ అన్నారు. శ్రీకాంతాచారి లాంటి వారు మాంసపు ముద్దలయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బాపు అని తనకు తానే కెసిఆర్ చెప్పుకుంటున్నారని, అలా చెప్పుకోవడానికి కనీస పోలిక ఉండాలని సిఎం రేవంత్ అన్నారు. తెలంగాణ బాపు సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ అని, తెలంగాణ ఆత్మను గౌరవించకపోతే సమాజం మనల్ని క్షమించదని సిఎం పేర్కొన్నారు. తెలంగాణలో ఆదాయం పడిపోయిందని, ఆదాయం కోసం కేవలం లిక్కర్ పైనే ఆధారపడేలా కెసిఆర్ పాలన సాగిందని సిఎం రేవంత్ ఆరోపించారు. మొదటి తారీఖు ఉద్యోగులకు జీతాలు వేసినా తాము ప్రచారం కల్పించుకోలేదని ఆయన తెలిపారు. మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, ఒక్కో చిక్కుముడిని విప్పుతూ ఉద్యోగాల భర్తీని ముందుకు తీసుకెళుతున్నామని ఆయన తెలిపారు.
మేం అల్లాటప్పాగా అధికారంలోకి రాలేదు
11వేల పైచిలుకు ఉద్యోగాలతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశామని, రోజుకు 18 గంటలు పని చేస్తూ పాలనను గాడిలో పెడుతున్నానని ఆయన తెలిపారు. మా ప్రభుత్వం మూడు నెలలు ఉంటది, ఆరు నెలలు ఉంటదని కొందరు మాట్లాడుతున్నారని, తమాషా అనుకుంటున్నారా?, మేం అల్లాటప్పాగా అధికారంలోకి రాలేదని సిఎం రేవంత్ అన్నారు. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వమని, పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండటం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడికి తాను విజ్ఞప్తి చేస్తున్నానని, ప్రజాస్వామ్యంపై గౌరవం, విశ్వాసం ఉండాలని ఆయన సూచించారు. 95శాతం మంది ఉద్యోగులు నిజాయితీగా పనిచేస్తున్నారని, సంఘాలపై కక్షగట్టి వాటిని రద్దు చేస్తే ప్రజలు కెసిఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేశారన్నారు. శాఖలవారీగా సంఘాలు ఉండాల్సిందేనని, మంత్రివర్గ ఉపసంఘం శాఖలవారీగా సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటుందని, సంఘాలతో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోమని సిఎం రేవంత్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News