Saturday, July 27, 2024

బిజెపికి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేసినట్టే: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రూ.400 ఉన్న సిలిండర్‌ను రూ.1200లకు పెంచారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రూ.60 ఉన్న పెట్రోల్ ఇప్పుడు రూ.110లకు పెరిగిందని, ఆ రోజు రూ.80 ఉన్న మంచినూనె ఈ రోజు రూ.180 అయిందని దుయ్యబట్టారు. సామాన్యులు కూడా బ్రతకలేని నిత్యవసర ధరలు పెరిగాయని, పదేళ్లలో మోడీ వైఫల్యంపై ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు.  పదేండ్ల మోసం, వందేళ్ల విధ్వంసం పేరుతో బిజెపి పాలనపై కాంగ్రెస్ ప్రజా ఛార్జీషీట్ విడుదల చేసింది ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 7 లక్షల ఉద్యోగాలే ఇచ్చారని, రైతుల ఆదాయం రెండింతలు చేస్తామని మోడీ మోసం చేశారని, రైతులను ఆదుకుంటామని మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.

నల్ల చట్టాలు రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దులో లక్షల మంది రైతులు 16 నెలలు ధర్నాలు చేశారన్నారు. స్విస్ బ్యాంకులో లక్షల కోట్ల నల్లదనం తెస్తానని మాట తప్పారని, రూ.15 లక్షలు ప్రతి పేదవాడి ఖాతాలో వేస్తానని దేశాన్ని మోసం చేశారన్నారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి రిజర్వేషన్లపై బిజెపి కుట్రలు చేస్తోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

రిజర్వేషన్ల రద్దుకే 400 సీట్లు కావాలని మోడీ అంటున్నారని ధ్వజమెత్తారు. బిజెపి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లు రద్దు చేసినట్టేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒబిసి రిజర్వేషన్లు 27 శాతం నుంచి 50 శాతం పెంచుతామని భయం మోడీకి పట్టుకుందన్నారు. జిఎస్‌టి పేరుతో కేంద్ర దోపిడికి పాల్పడిందని, భక్తులం అని చెప్పుకునే బిజెపి చివరికి అగర్బత్తిలను కూడా వదలడం లేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. అగ్గిపెట్టె, సబ్బు బిళ్ల, అగర్బత్తిలపై జిఎస్‌టి బాదడం మోడీకి న్యాయామా? అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News