హిందుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలపై బిజెపి ఆగ్రహం
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ లో కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటిని సోమవారం కొందరు ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. ఇంటి ప్రధాన ద్వారం కాలి పోయింది. అయోధ్య తీర్పుపై ఆయన రాసిన పుస్తకంలో హిందుత్వాన్ని ఇస్లాం ఉగ్రవాదంతో పోల్చడంపై వివాదం చెలరేగింది. ఇదే దుండగుల దాడికి కారణమైంది. సల్మాన్ ఖుర్షీద్ స్వయంగా ఈ విషయాన్ని ఫేస్బుక్ ద్వారా తెలియచేశారు. ఫేస్బుక్లో ఆయన ఇల్లు పెద్ద మంటల జ్వాలల్లో ఉండడం, తలుపులు మసిబారడం కనిపించాయి. ఇద్దరు మంటలను నీటితో ఆర్పడం కూడా కనిపించింది. సన్రైజ్ ఓవర్ అయోధ్య : నేషన్హుడ్ ఇన్ అవర్ టైమ్స్ అనే పుస్తకాన్ని ఆయన రచించారు. అందులో హిందుత్వంపై వ్యాఖ్యానించారు. ఇల్లు కాలిన దృశ్యాలను చూపిస్తూ ఇది హిందూత్వం కాదని తాను చెప్పడం తప్పా ? అని ఆయన ప్రశ్నించారు. ఖుర్షీద్ వ్యాఖ్యలను బిజెపి తీవ్రంగా పరిగణిస్తూ హిందువుల మనోభావాలను గాయపరుస్తాయని విమర్శించింది. ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ మత రాజకీయాలను ప్రేరేపిస్తోందని ధ్వజమెత్తింది.