Monday, April 29, 2024

మనుస్మృతి దివస్‌ను కూడా పాటించాలి

- Advertisement -
- Advertisement -

మనుస్మృతిని తగలబెట్టడానికి ముందు మహద్‌లోని ఒక ఊరి చెరువు నుండి దళితులను తాగు నీరు తీసుకోకుండా అగ్రవర్ణ హిందువులు అడ్డుకోవడంతో ఆ పట్టణంలో 1927 మార్చి 20వ తేదీన అంబేడ్కర్ నేతృత్వంలో ఒక గొప్ప సత్యాగ్రహం జరిగింది. అంతకు ముందు ఆ పట్టణంలో హిందువులు నడిచే వీధులపైన అంటరాని వారైన కారణంగా దళితులు నడిచేందుకు కూడా వీల్లేదని అగ్రవర్ణాల వారు నిషేధం విధించారు. ప్రభుత్వం నిర్మించి, నిర్వహించే అన్ని ప్రదేశాలకూ దళితులు నిరభ్యంతరంగా వెళ్లవొచ్చని, మునిసిపల్ రోడ్ల పై అందరూ నడవొచ్చని, చెరువులో నుండి నీరు తెచ్చుకోవచ్చని అప్పటి బొంబయి ప్రావిన్స్ శాసన మండలి 1923 లో తీర్మానం చేసిన తరువాత మహద్ మున్సిపల్ కౌన్సిల్ కూడా శాసన మండలి తరహాలో 1924లో మరో తీర్మానం చేసింది. 1927 డిసెంబర్ 25వ తేదీన అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ బాబాసాహెబ్ అంబేడ్కర్, అతడి అనుచరులు మహారాష్ర్ట, కొంకణ్ ప్రాంతం రాయగడ్ జిల్లాలోని మహద్ అనే చిన్న పట్టణంలో కొన్ని వేల మంది సమక్షం లో మనుస్మృతిని దహనం చేసి ‘చాతుర్వర్ణ వ్యవస్థను విశ్వసించం. కుల వ్యత్యాసాలను అంగీకరించం. హిందూ సమాజానికి శాపంగా ఉన్న అంటరానితనాన్ని అంతం చేసేందుకు కృషి చేస్తాం. హిందువుల్లో ఆహారం, పానీయం విషయాల్లో ఎలాంటి నిషేధాలను పాటించం.

ఆలయాలు, నీటివనరులు, పాఠశాలలు వగైరా సదుపాయాల విషయం లో అస్పృశ్యులు అనబడే వారితో సహా అందరికీ సమాన హక్కులు ఉంటాయని నమ్ముతున్నాం అని ప్రతిజ్ఞ చేశారు.అయితే అక్కడ అగ్రవర్ణాల నిరసన కారణంగా ఈ తీర్మానాలేవీ అమలుకు నోచుకోలేదు. దీంతో అంబేడ్కర్ బహిష్కృత హితకారిణి మహా సభను 1927 మార్చి 19, 20 తేదీలలో మహద్‌లోనే నిర్వహించారు. వెయ్యి మందికి పైగా ఈ సభకు హాజరయిన ప్రతినిధులు సభ తర్వాత ఊరేగింపుగా వెళ్లి అదే ఊర చెరువులో మంచి నీరు తాగారు. దళితులు ఆ చెరువు నుండి నీరు తీసుకుని తాగడంతో అది అపవిత్రమైపోయిందని భావించిన సవర్ణ హిందువులు చెరువు నీటిని శుభ్రపరిచి, ఆ చెరువుకు ప్రక్షాళన పూజలు నిర్వహించారు. అమానవీయమైన అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్న బ్రాహ్మణాధిక్య సమాజం పట్ల, బ్రాహ్మణీయ సంస్కృతికి మూలమైన మనువాదం పట్ల తనకు గల నిరసన భావాన్ని తెలిపేందుకు అంబేడ్కర్ ఈ మనుసృ్మతి దహన కార్యక్రమాన్ని కేవలం లాంఛనప్రాయంగానే చేపట్టిన తర్వాత అది సమాజంలో దీర్ఘకాలిక విభేదాలకు, అక్కడి అగ్రవర్ణాల ప్రజలు అంబేడ్కర్‌ను, దళితులను మరింత తీవ్రంగా ద్వేషించడానికీ దారి తీసింది.

అయితే అంబేడ్కర్ ఈ ఉద్యమం తాగునీటి కోసం, ఆలయ ప్రవేశం కోసం, ఇతర సదుపాయాల కోసమే కాదు, సమాజంలో అసమానతలకు హేతువైన వర్ణవ్యవస్థను రూపుమాపడం కోసమే చేస్తున్నామని వివరిస్తూ ఆ కాలంలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో సమాన హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమాల విశేషాలను సభికులకు విడమర్చి చెప్పారు. ఫ్రెంచి విప్లవంలో పెల్లుబికిన మానవ హక్కుల డిమాండ్లను పేర్కొన్నారు. రోవ్‌లో పార్టీసియన్స్‌కి వ్యతిరేకంగా ప్లెబియన్స్ చేసిన తిరుగుబాటులోని డొల్లతనాన్ని వివరించారు. సమాజంలోని విభజన వ్యవస్థను అంతమొందించకుండా తమ గోడును వెళ్లబోసుకునేందుకు ఒక ట్రిబ్యూన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ప్లెబియన్లు సాధించింది ఏమీలేదని చెప్పారు. మౌలిక సమస్యలపై కేంద్రీకరించకుండా స్వల్పకాలిక, తాత్కాలిక సమస్యలకే పరిమితం కావడం వలన విముక్తి లభించదని బోధించారు. కాబట్టి మా ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తున్నాం, ఈ సామాజిక విప్లవానికి సహకరించండని అగ్రవర్ణాలకు కూడా అంబేడ్కర్ విజ్ఞప్తి చేసి శాస్త్రాలను వదిలేయండి, న్యాయాన్ని చూడండి అని హితవు పలికారు. మనుసృ్మతి దహనం, మహద్ చెరువులోని నీరు తెచ్చుకోవడం సమస్య తీవ్రతను గుర్తింప చేసి, నిరసన వ్యక్తం చేసే సింబాలిక్ చర్యలు మాత్రమేనని, వాటి పరిష్కారానికి సుదీర్ఘ పోరాటం చేయాల్సి ఉంటుందని అంబేడ్కర్ దిశానిర్దేశం చేశారు.కాబట్టి మనుసృ్మతి దహనం అనేది కేవలం దళితులకు సంబంధించిన కర్తవ్యమే కాదు.

నేటి మహిళలు, మైనారిటీలు, బలహీనవర్గాల వారంతా ఈ మనుసృ్మతికి బలిపశువులే. కాబట్టి మనుసృ్మతి దహనం గురించి తెలుసుకొని ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం నేడు ఎంతైనా అవసరం. మనుసృ్మతి వలన దళితులు అనుభవించిన అమానుష బానిసత్వం, సామాజిక అన్యాయం అందరికీ తెలిసిందే.దళితుల నివాసాలు ఊరికి దూరంలో వెలివాడలుగా ఉండే విషయం ఇప్పటికీ షరా మామూలే. ఏదైనా పనిమీద ఊళ్లోకి వచ్చే దళితుడి అడుగు జాడలు బజారులోపడకూడదు. అందుకోసం నడుముకు వెనకపొడవుగా గుబురుగా ఆకులు ఉండే కొమ్మలను లేదా తాటిమట్టలను కట్టుకోవాలి.అవి వెనక నేలపై ఈడ్చుకొస్తూ పాదముద్రలను చెరిపేయాలి. అలాగే ఊరిలో ఎక్కడా ఉమ్మి కూడా వేయకూడదు. అందుకోసం మెడలో చిన్న ముంతకట్టుకొని ఉమ్మివచ్చినప్పుడు అందులోనే ఉమ్మాలి. అదే విధంగా దళితులు ఎలాంటి ఆయుధాలను వుంచుకోకూడదు, విద్య నేర్చుకోకూడదు, చదువుకోకూడదు. ఈ నియమాలను ఉల్లంఘిస్తే కఠినమైన శిక్షలకు, హత్యలకు గురి కావాల్సిందేనని స్వంతగా విలు విద్య నేర్చుకొన్న ఏకలవ్యుడి బొటన వేలును బలిగొన్న దుర్మార్గమే ఒక ఉదాహరణ’న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ అనేది మనుసృ్మతి ఆదేశం. బాలికగా తండ్రి రక్షణలో, మహిళగా భర్త రక్షణలో, విధవగా కొడుకు రక్షణలో మహిళ ఉండాలని మనుసృ్మతి కట్టడి చేస్తోంది. భర్తలు భార్యలను నిత్యం తమ అదుపులో వుంచుకోవాలని చెబుతోంది. మహిళలు అపవిత్రులు, అబద్ధాలాడతారు, తెలివిలేని వారు, బలహీనులు కాబట్టి వారు వేదాలు చదవలేరు.

కాబట్టి వారు నామకరణం చేయడం, జాతకాలు చెప్పడం, వేద మంత్రోచ్చారణలు చేయకూడదని మహిళలను బానిసలుగా చూసే ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇవి చాలవా మనుసృ్మతిని మంటగలపడానికి? ఏ సామాజిక సమస్యల పరిష్కారం కోసం 95 ఏండ్ల క్రితం అంబేడ్కర్ నాయకత్వంలో మనుసృ్మతి దహనం చేయబడిందో ఆ సమస్యలు ఇప్పటికీ సజీవంగానే వుంటూ తీవ్రమవుతున్నాయి. దళితులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయి. బిజెపి పాలిత రాష్ట్రాల్లో లవ్ జిహాద్ పేరుతో చట్టాలు కింది కులాల యువకులు పైకులాల యువతులను ప్రేమించి పెండ్లిళ్లు చేసుకోకుండా నిషేధించడం కోసమే. నేడు దేశంలో మహిళలపై మానభంగాలు, హత్యలు మరింత పెరిగాయి. పసిపాపలను కూడా బలాత్కరించి చంపేయడం నేడు మన కండ్ల ముందు కనబడుతున్న దౌర్భాగ్యం. ఇవన్నీ శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలే కాదు. దళితులు, మహిళలు, బలహీన వర్గాల వారిని అనుభవించి, అణచివేసి, హత్యలు చేయవచ్చని మనుసృ్మతిలోనే దాగివున్న కుట్ర నేటి భారతీయ సమాజపు అగ్రకులాల్లోని అధిక మందిలో ఆవహించి వుంది. కాబట్టి అలాంటి అహంభావాన్ని అంతం చేయడం కోసమే మనుసృ్మతి దహన కార్యక్రమాన్ని విస్తృతంగా పెద్ద ఎత్తున నిర్వహించాలి. నేడు కేంద్రంలో మనుసృ్మతి ఆరాధకుల అసాధారణ పరిపాలన సాగుతున్నందున ఈ కార్యక్రమాన్ని కులాలతో నిమిత్తం లేకుండా లౌకిక, ప్రజాస్వామికులందరి సామాజిక, రాజకీయ కర్తవ్యంగా భావించాలి. నవంబర్ 26ను భారత రాజ్యాంగ దినంగా జరుపుకునే మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా డిసెంబర్ 25ను ‘మనుసృ్మతి దహన్ దివస్’ గా పాటించి, దాని సందేశాన్ని అందరికీ వివరించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News