Sunday, April 28, 2024

ఐరోపాలో పెరుగుతున్న మతవాదం!

- Advertisement -
- Advertisement -

నెదర్లాండ్స్ ఎన్నికల్లో సంప్రదాయ- ఉదారవాద గీర్ట్ విల్డర్స్ విజయం ఐరోపా మత పార్టీల ఊపును నిర్ధారిస్తోందని గార్డియన్ పత్రిక ఐరోపా విలేకరి జోన్ హెన్లీ రాశారు. యూరోపియన్ యూనియన్ (ఇయు), ముస్లింల, వలసల వ్యతిరేకి విల్డర్స్ ‘పార్టీ ఆఫ్ ఫ్రీడం’ 22 నవంబర్ 23 ఎన్నికల్లో 37 సీట్లు గెలిచింది. ఇది 2021 స్థానాల కంటే రెట్టింపు. 150 సీట్ల పార్లమెంటులో 37 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పర్చలేరు. పలు పార్టీలతో రాజీపడి, రాయితీలిచ్చి ఆపని చేయచ్చు. కాని ఖురాన్ నిషేధం, ఇయు నుండి నిష్క్రమణ (నెక్సిట్) వగైరా తన ప్రణాళికలు ప్రభుత్వ విధానాలు కాలేవు. అయితే ‘డచ్ డొనాల్డ్ ట్రంప్’ విల్డర్స్ విజయం ఐరోపాలో మతవాదానికి స్థానం కల్పిస్తుంది. ప్రజాకర్షక భావాలను పెంచుతుంది. మతవాద రాజకీయుకులు బలపడతారు.హంగరి మతవాద ప్రధాని విక్టర్ ఓర్బన్ ఐరోపా మేల్కొంటోందని విల్డర్స్‌ను అభినందించాడు. ఓర్బన్ ఇయులో ఉక్రెయిన్ ప్రవేశాన్ని వ్యతిరేకించాడు. యూరోపియన్లు ఇతర జాతులతో కలవరాదన్నాడు. వలసవాదుల దాడి, లింగ సమానత, ఉక్రెయిన్ యుద్ధం, దాని ఇయు ప్రవేశం మొదలగు బెల్జియం అధికారుల వెర్రి ఆలోచనలను ప్రతిఘటిస్తామని తన పార్టీ సభ్యులకు ఉద్బోధించారు.

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారి నియో ఫాసిస్టు మూలాల బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ అధినేత్రి జార్జియా మెలోని ఇటలీలో 22 అక్టోబర్, 22న తీవ్ర మతవాద ప్రభుత్వ ప్రధాని అయ్యారు. వలసల పట్ల తన తీరును మార్చుకున్నారు. 10 లక్షల వలసదారుల దేశ ప్రవేశానికి చట్టం చేశారు. తన మధ్యలింగ వ్యతిరేక విధానాలను బలపర్చుకున్నారు. జన్మ ధ్రువీకరణ పత్రాల్లో జీవసంబంధ తల్లిదండ్రుల పేర్లను మాత్రమే నమోదు చేయమని అధికారులను ఆదేశించారు. స్వలింగ దంపతులను అయోమయంలో ముంచారు.గ్రీస్‌లో జూన్ 2023 ఎన్నికల్లో 3 మతవాద పార్టీలు 12% సీట్లు గెలిచాయి. ఈ పార్టీల్లో ఒకటయిన 2017లో స్థాపించబడ్డ మతవాద పార్టీ స్పార్టన్స్‌ను నియోనాజీ పార్ట్టీ గోల్డన్ డాన్ పూర్వ నాయకుడు, జైల్లో ఉన్న ఇలియాస్ కసిడియారిస్ సమర్థించాడు. గోల్డన్ డాన్ నేర సంస్థగా పరిగణించబడింది. ఏప్రిల్ 2022 ఫ్రాన్స్ ఎన్నికల్లో ఆధిక్యత రాని మధ్యేవాద ఉదార పార్టీ రెనైజాన్స్ నాయకుడు పూర్వ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్ అనుసరణ ఎన్నికల్లో మతవాద నేషన్ ర్యాలీ పార్టీ నాయకురాలు మారిన్ లే పెన్‌పై నెగ్గి తిరిగి అధ్యక్షుడయ్యారు.

రాబోయే ఎన్నికల్లో మతవాద పెన్ 55% ఓట్లు సాధిస్తారని అంచనా. 2027లో ఆమె నాలుగోసారి అధ్యక్షురాలు అయితే యూదుల రక్షణకు పని చేస్తానని ఆమె వలస వ్యతిరేక పార్టీ వాగ్దానం చేస్తోంది. ముస్లింలకు ఇది అపాయకరం కాగలదు. బ్రిటన్ ఇప్పుడు ప్రజాకర్షక మతవాద తీవ్ర ప్రభావానికి గురయింది.జాతీయవాద బ్రెగ్జిట్ (ఇయు నుండి నిష్క్రమణ), టోరీల బ్రెగ్జిట్ అనుకూల మేల్కొలుపు యుద్ధం నినాదాల జోరు ఊపందుకుంది. భారతీయున్నని చెప్పుకుంటున్న పాకిస్థాన్ మూలాల సంఘ్ స్వభావి బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ వలసదారులను ర్వాండా పంపడానికి చట్ట వ్యతిరేక ప్రణాళికలు రచిస్తున్నాడు. స్లొవేకియా సంకీర్ణ ప్రభుత్వంలోని మతవాద స్లొవాక్ నేషనల్ పార్టీ, ప్రజాకర్షక ప్రచారకర్త రాబర్ట్ ఫికొను సమర్థిస్తోంది. ఫికొ విప్లవ పార్టీ నుండి వచ్చిన వాడయినా వలసల, మధ్య లింగుల హక్కుల వ్యతిరేకి. అందువల్ల స్లొవేకియ లోనూ మతవాదం పెరుగుతోంది.
పోర్చుగల్‌లో మూడవ పెద్ద పార్టీ ‘చేగా’ మతవాదిని కాదని వాదిస్తుంది. కాని జాతివాద, వలస వ్యతిరేక భావాలతో ఊరేగుతోంది. ప్రజాకర్షక అంశాలకు ప్రాధాన్యతనిస్తోంది.

ఆస్ట్రియా లో మతవాద ఫ్రీడం పార్టీ ఆఫ్ ఆస్ట్రియా వచ్చే ఏటి ఎన్నికల్లో గెలుస్తుందని అనేక ఎన్నికల అంచనాలు తెలిపాయి. సెప్టెంబర్ లో 2 నిమిషాల ప్రచార వీడియో విషప్రచారం పొందింది. అందులో పారిస్‌లో నోట్రె డేంలోని మంటలను చూపిస్తూ తెల్లజాతి యూరోపియన్లను వలసదారులు అధిగమిస్తున్నారని, తెల్లజాతి ఉనికిని కోల్పోతోందని, ఇది తీవ్రవాదుల కుట్ర అని ఫ్రీడం పార్టీ యువ విభాగం ప్రచారం చేసింది. ఈ వీడియోలో పార్టీ యువ విభాగ సభ్యులు కాగడా ఊరేగింపుల్లో పాల్గొన్నట్లు, వియన్నా బాల్కని కింద నుంచున్నట్లు చిత్రీకరించారు. 1938లో ఆస్ట్రియాను జర్మనీలో కలుపుకున్న సందర్భంలో తన జన్మభూమి ఆస్ట్రియాకు తిరిగి వచ్చినప్పుడు అడాల్ఫ్ హిట్లర్ ఇక్కడ నుంచే అసాధారణ ఉపన్యాసం ఇచ్చాడు. జర్మనీలో మతవాద పార్టీ ఆల్టర్నేటివ్ ఫార్ డ్యూటస్చ్ లాండ్ (ఎ.ఎఫ్.డి.) ఎన్నికల దృక్కోణంలో దేశంలో రెండవ స్థానంలో ఉంది. సంకీర్ణ ప్రభుత్వంలోని 3 పార్టీల్లో ఈ పార్టీకే ఎక్కువ ఓటర్లు వున్నట్లు అంచనాలున్నాయి. పాలస్తీనాపై ఇజ్రాయెల్ ఇటీవలి దాడులను నిరసిస్తూ పాలస్తీనియన్లకు మద్దతుగా జర్మనీలో ప్రశాంత ఆందోళనలు జరిగాయి. వందలాది నిరసనకారులను అధికారులు అరెస్టు చేశారు. వారిపై హింసకు పాల్పడ్డారు.

బెల్జియంలో 2024 జూన్ ఎన్నికల్లో మతవాద ఫ్లెమిష్ జాతీయవాదులు అధికంగా లాభపడే అవకాశాలున్నాయి. వీరు నివసించే ఫ్లాండర్స్‌ను స్వతంత్ర దేశంగా విడగొట్టాలని ప్రయత్నిస్తున్న మరొక మతవాద వ్లామ్స్ బెలాంగ్ పార్టీ దేశంలో అతి పెద్ద రాజకీయ శక్తిగా ఎదిగింది. ఉత్తర ప్రాంతంలో డచ్ మాట్లాడే ఫ్లాండర్స్, దక్షిణ ప్రాంతంలో ఫ్రెంచ్ మాట్లాడే వలోనియల మధ్య గొడవలు ఇప్పుడు భయంకర సమస్య. బెల్జియం బలవంతపు పెళ్ళి, వారు విడాకులు కోరితే పెద్ద మనుషుల్లా మాట్లాడతాం. వారు చర్చలకు రాకపోతే ఏకపక్షంగా వ్యవహరిస్తాం అని వ్లామ్స్ బెలాంగ్ పార్టీ అధ్యక్షుడు టాం వాన్ గ్రీ కెన్ అన్నారు. ఐరోపా మతవాదం నార్డిక్ దేశాలకూ చేరింది. ఫిన్లాండ్, స్వీడన్‌లలో మతవాద పార్టీల సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అయితే పోలండ్, స్పెయిన్, ఐర్లాండ్ మొదలగు ఐరోపా దేశాల్లో మతవాదం రాజకీయంగా కొంత వెనుకంజ వేసింది. కాని ఆ దేశాల ప్రజల్లో మతవాదం పెరిగింది. స్పెయిన్ ప్రధానిగా సోషలిస్టు పెట్రో సాంచెజ్ తిరిగి ఎన్నికయ్యారు. మాడ్రిడ్ లో స్పెయిన్ సోషలిస్టు పార్టీ కేంద్ర కార్యాలయం బయట 4 వేల మంది సాంచెజ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ నిరసనకు మతవాద పార్టీ వోక్స్ మద్దతు ఇచ్చింది. చెత్త కుండీలను కాల్చారు. పోలీసులతో గొడవలు జరిగాయి.

7 మందిని అరెస్టుచేశారు. ఆందోళనకారుల్లో ఒకరు నాజీ జెండాను ఊపారు. నిరసనకారులు ‘కారా అల్ సోల్’ పాట పాడారు. ఇది స్పెయిన్ ఫాసిస్టు ఫలాంగిస్టు పార్టీ గీతం. ఫ్రాన్సిస్కొ ఫ్రాంకొ నియంతృత్వంలో ఇది స్పెయిన్ జాతీయ గీతం అయింది. ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో ముగ్గురు పిల్లలు కత్తిపోట్లకు గురయి ఆసుపత్రిలో చేరారు. ఒక చట్టవిరుద్ధ వలసదారుడు ఈ కత్తిపోట్లకు పాల్పడ్డాడని సామాజిక మాధ్యమాల్లో రుజువులు లేని నివేదికలతో విషప్రచారం జరిగింది. ఈ పుకార్ల ఆధారంగా డబ్లిన్ నగర కేంద్రం లో 500 మంది గుంపు విధ్వంసం సృష్టించింది.సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన ఈ తప్పుడు సమాచారం, వలసదారుల వ్యతిరేక భావజాలం మామూలయిందని సామాజిక కార్యకర్తలన్నారు. దీంతో గంటల కొద్దీ అల్లర్లు జరిగాయి. అల్లరి మూకలు వాహనాలను కాల్చారు. అంగళ్లను ధ్వంసం చేశారు. పోలీసులపై దాడి చేశారు. దశాబ్దాల నుండి లేని హింస డబ్లిన్‌లో జరిగింది. ఈ ఏడాది మే లో వలసదార్ల వ్యతిరేక ఆందోళనకారులు డబ్లిన్‌లో వలసదారుల శరణార్థి శిబిరాలను కాల్చారు. ఐర్లాండ్‌ను అల్లరి మూకలు అవమానించాయని ఐర్లాండ్ ప్రధాని లియో వారడ్కార్ వాపోయారు.

ఐర్లాండ్ మునుపెన్నడూ లేని శరణార్థుల సమస్యను ఎదుర్కొంటోందన్నారు. వలసదారులు, ప్రత్యేకించి ముస్లింల పట్ల తీవ్ర శత్రుత్వం, మునుపు ఆచరణయోగ్యం కానివి, సహించ రానివి, చట్ట వ్యతిరేకమైనవిగా భావించిన దుశ్చర్యలకు పాల్పడడం, యూరో సంశయవాదం ఐరోపా మతవాద ప్రభుత్వాల ఉమ్మడి లక్షణాలు. ఇయు బహిష్కరణ కంటే లోపల నుండే దాన్ని మార్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇయు మానవ హక్కుల చట్టాలను, ఐక్యరాజ్యసమితి శరణార్థుల రక్షణ సూత్రాలను వ్యతిరేకిస్తున్నాయి. ఈ మానవత్వ రహిత చర్యల్లో అవి విజయం సాధిస్తే రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఐరోపా ఒక విచిత్ర జంతువుగా మారుతుంది అని ఫైనాన్సియల్ టైమ్స్ విదేశీ వ్యవహారాల అధికారి గిడియన్ రాచ్మన్ రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News