అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ పట్నం జిల్లాలో సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. గాలి వానకు భారీ గోడ కూలిపోవడంతో 8 మంది భక్తులు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.శిథిలాల కింద చిక్కుకుని మృతదేహాలను బయటకు తీస్తున్నారు. రూ.300 టిక్కెట్ కౌంటర్ దగ్గర ఇటీవలే గోడ నిర్మాణం జరిగింది. ఈదురుగాలులకు భారీ టెంట్ ఎగిరి గోడమీద పడడంతో అది కుప్పకూలిపోయింది.
సింహాచలం ప్రమాదంపై సిఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత దిగ్ర్భాంతి వ్యక్తిం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని సిఎం ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ఈ ఘటనపై కలెక్టర్, ఎస్పిలతో మాట్లాడానని తెలిపారు.
ప్రమాద స్థలాన్ని హోమంత్రి అనిత పరిశీలించారు. గోడ ఎవరి హయాంలో కట్టారో.. కాంట్రాక్టర్ ఎవరో అన్ని విషయాలపై విచారణ జరుపుతామని తెలిపారు. కూలిన గోడ నాణ్యతపై విచారణ జరిపిస్తామన్నారు.
సింహాచలం ఘటన దురదృష్టకరమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.