Monday, May 6, 2024

బిసి గురుకుల డిగ్రీ కాలేజీల్లో స్పాట్ అడ్మీషన్లు

- Advertisement -
- Advertisement -

ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో సంప్రదించాలన్న అధికారులు

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా ప్రారంభించిన బిసి గురుకుల డిగ్రీ కళాశాలల్లో స్పాట్ అడ్మీషన్లు కొనసాగుతున్నాయి. ఆసక్తి గల విద్యార్థినీ విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ ను సంప్రదించాలని బిసి గురుకుల విద్యాలయాల సంస్థ అధికారులు సూచించారు. సాంప్రదాయ కోర్సులతో పాటు ఉపాధితో ముడిపడిన సరికొత్త కోర్సులతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం కొత్తగా 17 డిగ్రీ కళాశాలలను ప్రారంభించింది. విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత కొత్త కాలేజీలను ప్రారంభించడంతో ప్రవేశాల ప్రక్రియ ఆలస్యమయ్యింది. ఇప్పటికే తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే కొత్తగా ఏర్పాటు చేసిన ఈ కాలేజీల్లో సీట్లు పూర్తిగా భర్తీ కానందున అధికారులు స్పాట్ అడ్మీషన్లు కొనసాగిస్తున్నారు.

ఇంటర్ పూర్తి చేసిన బిసి విద్యార్థులు డిగ్రీలో చేరేందుకు తగిన ధృవీకరణ పత్రాలతో నేరుగా ఆయా కళాశాలలకు వెళ్ళి అడ్మీషన్లు పొందవచ్చు. పోటీ లేనందు వల్ల ప్రవేశాలు సులభంగా లభించనున్నాయి.మూడేళ్ళ పాటు ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులు పూర్తి ఉచితంగా చదువుకోవచ్చు. ఉచిత భోజన వసతితో పాటు నాణ్యమైన విద్యను గురుకులాల్లో అందిస్తున్న విషయం తెలిసిందే. కొత్త కాలేజీల్లో కొన్నింటిలో ప్రభుత్వం ఒకేషనల్ కోర్సులను ప్రవేశ పెట్టింది. డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశ పెట్టడం ద్వారా గురుకుల విద్య అనంతరం విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంది. వికారాబాద్ డిగ్రీ కాలేజీలో ఫైన్ ఆర్ట్స్ కోర్సు బిఏ(హనర్స్),  సంగారెడ్డిలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు, మిగతా కాలేజీల్లో బిఎస్‌సి(ఎంపిసిఎస్), బిఎస్‌సి(బిజెడ్‌సి), బికాం, బిఎ కోర్సులు- ప్రవేశ పెట్టారు. వికారాబాద్ లోనిఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఫిల్మ్ అండ్ మీడియా, యానిమేషన్ అండ్ విఎఫ్‌ఎక్స్, ఫోటోగ్రఫి అండ్ డిజిటల్ ఇమేజింగ్ కోర్సులతో బిఎ(హనర్స్) ,సంగారెడ్డి కాలేజీలో హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు నిర్వహిస్తున్నారు.

సంగారెడ్డి, వికారాబాద్ లోని డిగ్రీ కాలేజీలు కో- ఎడ్యుకేషన్ కాలేజీలు కాగా మహిళా డిగ్రీ కాలేజీలు గద్వాల్, బాన్స్ వాడా( కామారెడ్డి), ఆదిలాబాద్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, ములుగు, మహబూబాబాద్, సూర్యాపేట లో ఏర్పాటు చేశారు. , బాలుర డిగ్రీ కాలేజీలు నారాయణ పేట, నాగర్ కర్నూలు, మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, భువనగిరిలలో అందుబాటులో ఉన్నాయి. బిసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారిలోని సృజనాత్మకత ను వెలికితీసే కోర్సులను, ఉపాధి అవకాశాలు కల్పించే వృత్తి విద్యా కోర్సులను ఎంపిక చేసిన బిసి గురుకులాల్లో అందిస్తున్నారు. గతేడాది కొత్తగా 119 జూనియర్ కాలేజీలు రావడంతో బిసి గురుకుల జూనియర్ కాలేజీల సంఖ్య పెరగింది. విద్యార్థుల అభిరుచులకు, ఆసక్తికి అనుగుణంగా, ఉపాధి అవకాశాలు కల్పించేలా వివిధ కోర్సులను ప్రవేశపెట్టారు. ఇంటర్ లో రెగ్యులర్ కోర్సులతో పాటు ఓకేషనల్ కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. ఈ కోర్సులు పూర్తి చేసిన తర్వాత ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాలేజీ నుంచి సరాసరి కార్పోరేట్ సంస్థల్లో ఉద్యోగాల్లో చేరేలా ఈ కోర్సులను రూపొందించారు. ఇంటర్ విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు డిగ్రీ గురుకులాల్లో చేరేందుకు ప్రభుత్వం కొత్తగా 17 కాలేజీలను ప్రారంభించింది. దీంతో రాష్ట్రంలో బిగి గురుకుల డిగ్రీ కాలేజీల సంఖ్య 33కు చేరింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News