Wednesday, April 24, 2024

సిఎం పాల్గొననున్న బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మహబూబ్ నగర్ బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు డిసెంబర్ 4న మహబూబ్ నగర్ జిల్లాలో సమీకృత జిల్లా అదికారుల కార్యాలయ భవన సముదాయం ప్రారంభంతో పాటు, పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్న దృష్టా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఎంవిఎస్ కళాశాల మైదానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొననున్న బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బహిరంగ సభకు హాజరయ్యే ప్రజలు, సదుపాయాలు, ఎంవిఎస్ కళాశాలకు వచ్చే రహదారి, శానిటేషన్, బారికేడ్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తదితర అన్ని అంశాలపై జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు, ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు ఇతర అధికారులతో చర్చించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కానున్న బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించనున్న సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం, మినీ శిల్పారామం ఆర్చి, పాత కలెక్టరేట్ వద్ద సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన, కేసీఆర్ ఎకో పార్కులో బర్డ్ ఎన్ క్లోజర్ ప్రారంభం తదితర ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పారు.

ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు, జిల్లా ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, అడిషనల్ ఎస్పీ రాములు, మున్సిపల్ కమీషనర్ ప్రదీప్ కుమార్, ఇంజనీర్ సుబ్రహ్మణ్యం, వివిధ శాఖల జిల్లా అధికారులు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, రైతుబంధు జిల్లా కో ఆర్డినేటర్ గోపాల్ యాదవ్, డిసిసిబి అధ్యక్షులు నిజాం పాషా, తదితరులు మంత్రి వెంట ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News