Friday, May 16, 2025

కదిలాడు.. కదిలించాడు పెనునిద్దుర వదిలించాడు!

- Advertisement -
- Advertisement -

కష్టజీవికి రెండువైపులా అండదండగా నిలిచేవాడే నేటి కవి అని ఆధునిక కవికి అధునాతన నిర్వచనం ఇచ్చిన శ్రీ శ్రీ తెలుగ కవిత్యాన్ని మలుపు తిప్పిన శ్రీశ్రీగా ఎదిగి మహాకవిగా గుర్తింపు పొందిన శ్రీరంగ శ్రీని హసరావు ఏప్రిల్ 30/1910 విశాఖపట్నంలో జన్మించారు నేటికి 115 సంవత్సరాలు పూర్తయ్యాయి. కానీ శ్రీ శ్రీ రాసిన కవిత్వం మాత్రం నేటికీ బాధతప్త హృదయాలను కదిలిస్తూ ముందుకుసాగమంటుంది. తెలుగు కవిత్వాన్ని విప్లవకరించి విప్లవాన్ని కవిత్వీకరించి తెలుగు జనం పాడుకునే సంగీతంలా మార్చిన వాడు శ్రీశ్రీ. దోపిడి వ్యవస్థ శతాబ్దాల తరబడి భయానకంగా ప్రజలను వంచిస్తున్న పాలకవర్గాలకు సాహితీ వీరుడు మహాప్రస్థానం కావ్యం.ఈ కావ్యం ఈ నాటికి దివ్య ఔషధమే. అది కదిలేది, కదిలించేది పెను నిద్దర వదిలించేది. పదండి ముందుకు పదండి తోసుకు, నది నదాలు, అడవులు, కొండలు, ఎడారు లా..? మనకడ్డంకి అంటూ అన్ని తరాలతో పాటు వయోవృద్ధులలోనూ ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని రేకెత్తించింది శ్రీ శ్రీ కవిత్వం.

శ్రీశ్రీ ఎప్పుడూ.. తానున్న వర్తమాన ప్రపంచంలో జీవించడమే కాదు, ఆ సమాజాన్ని తన వెంట లాక్కొని తీసుకెళ్లాడు ప్రజల ఆరాటాల పోరాటాల్లో ఆచరణాత్మకంగా అం తర్భాగమయ్యాడు. శ్రీకాకుళ ఉద్యమాన్ని గొంతేతి గానం చేశాడు. ధర్మం కోసం, న్యాయం కోసం సాగుతున్న గిరిజన రైతాంగ పోరాటంపై పాలకులు ఉక్కు పాదం మోపారు రక్తపుటేరులు పారించారు. అప్పుడు శ్రీశ్రీ సత్యం చావదని ఎలుగెత్తి చాటాడు. ప్రజల హక్కులను రక్షించే బాధ్యతను నెత్తికెత్తుకున్నాడు. పౌర హక్కుల సంఘమయ్యాడు. ప్రజల పక్షాన మాట్లాడిన వారిని నక్సలైట్లుగా ముద్రలో అణచివేయ చూసినప్పుడు శ్రీశ్రీ నేను నక్సలైటని మెడలో ఓ బోర్డును వేలాడ తీ సుకొని రోడ్డెక్కి తిరుగుతూ పాలకులకు ప్రశ్న సంధించాడు.

వాస్తవ జీవితంలో ఆచరించగలిగిన లేకున్నా అందరికీ గౌరవనీయంగా కనబడే కొన్ని ఆదర్శాలు అన్ని కాలాల్లోనూ ఉంటాయి. సాహిత్యం, సాహిత్య కారులు ప్రజల ప్రయోజనాల పక్షాన నిలబడగలగాలి. పాలకవర్గాలకు ప్రతిపక్షంగా ఉండాలి అనే ఆదర్శాలు కూడా అలాంటివే అని గుర్తించాలి. ఇలాంటి వాటికి ప్రేరణ ఇచ్చిన అంశాలు వేరువేరుగా ఉన్నప్పటికీ, అన్ని సామాజిక దశల్లోనూ ఈ ఆదర్శాలను ప్రకటించుకున్న సాహిత్యకారులు కొందరు ఉంటూనే వచ్చారు.

స్థలానికి, కాలానికి విడదీసి వ్యక్తి చైతన్యాన్ని గూర్చి మాట్లాడడం అనేది తెలియని తనమైన కావాలి లేదా కుత్సితత్వమైన కావాలి.తెలియనితనం అనేది నేరంగా భావించవద్దు.కానీ కుత్సితత్వమే అసలు మోసానికి దారితీస్తుంది. స్థల, కాలాలకు సందర్భానికి విడదీసి సమకాలిన సామాజిక సందర్భానుసారంగా ఆలోచన చేసి లేని ఉద్దేశాలను శ్రీ శ్రీ కంట కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరైనా ఏ వ్యక్తి అయినా సమగ్ర సంపూర్ణ వ్యక్తిత్వం, జ్ఞానంతో ఉండాలని ఆశించాలి గాని నేడు పాలకవర్గాలకు అనుకూలంగా రచనలు చేయటం వారి కనుసన్నల్లో ఉంటూ అది అత్యాశకు దురాశగా మారుతున్నాయి అలాంటి వాటికి భిన్నమైన కవి శ్రీశ్రీ. దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం వచ్చిన కొత్తలో ఆ కవిత్వాలు పనికిరావని అన్న వాళ్ళు ఉన్నారు.కొన్ని ఏళ్ల తర్వాత ఈ కవిత్వాలలో ఉండే గొప్పదనాన్ని అందరు గుర్తిస్తారని బలంగా చెప్పిన వ్యక్తి శ్రీశ్రీ.ఆ నమ్మకంతోనే దిగంబర కవిత్వాన్ని ఆహ్వానించాడు. విప్లవ కవితోద్యమంలో నడిచాడు .విప్లవ రచయితల సంఘానికి అధ్యక్షుడు అయ్యాడు. విరసం ఏర్పడ్డ కొద్దిరోజుల్లోనే పెన్ను గన్ను పట్టిన వెంపటాపు సత్యం మాస్టారిని, ఆదిభట్ల కైలాసాలను రాజ్యం ఎన్కౌంటర్ పేరుతో హత్య చేశారు. ప్రభుత్వం ఎందరు నక్సలైట్లను చంపిన నక్సలైట్ అనే పదాన్ని మాత్రం తొలగించలేరని విరసం అధ్యక్షుడిగా ఆనాడే శ్రీ శ్రీ ప్రకటించగలిగాడు. దోపిడి చేసే, దోపిడీకి గురయ్యే పరస్పర విరుద్ధ వర్గాల వారి అవకాశాలు ఆలోచనలు, స్వభావాలు ఆచరణలు వాటి ఫలితాలను యదార్ధాన్ని శ్రీ శ్రీ కవితలు నేటికీ ప్రతిఫలింప చేస్తున్నాయి.

ధనిక- పేద వర్గాల వ్యత్యాసాపు లక్షణాలను చేసి అభివృద్ధి నిరోధకవర్గాలు వెలిసిపోవటం, ప్రగతిశీల శక్తులు వెలుగులోకి వస్తాయని నమ్మిన కవి కూడా శ్రీశ్రీ. వర్గాధిపత్యాన్ని కాపాడటానికే దోపిడి వర్గాలు నెలకొల్పిన న్యాయస్థానాలు, రక్షక బటవర్గాలు, చెరసాలలో, ఉరికొయ్యలు నెలకొల్పడ్డాయని చెప్పిన కవి.వర్గ దోపిడీని దాని తీరును నాటకీయ దృశ్యంలా కళ్ళ ముందు కదలాడే కవిత్వం రాశాడు. దోపిడీ దౌర్జన్యాల దుర్మా ర్గ వ్యవస్థను అంతంగావిస్తేనే నర జాతికి పరివర్తన నవజీవన శుభ సమయం వస్తుందన్నాడు. ప్రపంచవ్యాప్తంగా వర్గ పోరా టం చేస్తూ బలిపీఠంపై నిలబడ్డప్పుడే సమ సమాజం సాధ్యమన్నాడు. మనమంతా బానిసలం, గానుగులం, పినుగులం అని గుర్తు చేస్తూ మనది ఒక బ్రతుకేనా సందులలో పందుల వలె అని శ్రీ శ్రీ కవిత్వం నిరంతరం ప్రశ్నిస్తూ ఉంటుంది.కానీ కొందరు కవులు ప్రశ్నలు మరిచారు. శ్రీ శ్రీ కవిత్వం అభ్యుదయం విప్లవాత్మకమైనది. ఆయన ప్రయోగించిన ప్రతీకలేన్నో దానికి తిరుగులేని సాక్ష్యాలుగా ఉన్నాయి. శ్రీ శ్రీ విప్లవ లక్ష్యం పీడిత ప్రజల్ని బానిసలుగా సందులలో పందులుగా మార్చిన నేటి కుళ్ళు వ్యవస్థ స్థానంలో అభ్యుదయకరమైన శ్రమ జీవనపు సౌందర్యాపు సాంస్కృతిక పునాదులపై సమ సమాజం నెలకొల్పాలని ఆశించిన కవిగా మనం గమనించాలి.

ఎవరేమిటో దిక్కుతోచని సందిగ్దానికి కొందరు కవులు రచయితలు లొంగిపోయారు. మరికొందరు ఒకవైపు ప్రజల హక్కుల కోసం మాట్లాడుతునే ప్రభుత్వం చేత శాలువాలు కప్పించుకుంటున్నారు, అవార్డులు ఇప్పించుకుంటున్నారు. ఇంకొంద రు ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక రాజకీయ దోపిడి విధానాలను వ్యతిరేకించడం తమ పని కాదని వాళ్లు అనుకుంటున్నారు. ఇదంతా గమనించినప్పుడు.. రచయితల్లారా ఎటువైపు..? అన్న విశాఖ విద్యార్థుల ప్రశ్నకు కాలం చెల్లిపోయింది అని అనుకుందామా..? ఇది ఎంత మాత్రం కాకూడదు. కానీ అలాంటి అవకాశం సన్నగిల్లుతుందని గుర్తించక తప్పదు. డ్బ్బై నాటి వలె ఖచ్చితమైన ధ్రువీకరణకు ఈనాటి సాహిత్యకారులు సిద్ధంగా లేరని అర్థం చేసుకోవచ్చు.అయినా సరే సాహిత్య చరిత్రలోనే ప్ర తి మలుపులోనూ ఈనాటి కవుల కూర చేతలకు ఆ ప్రశ్న నిరంతరం గుర్తుకు రావాలి.

‘రెండు రెళ్లు నాలుగు అన్నందుకు గుం డాలు గుండ్రాళ్లు విసిరే ఈ నేలలో ‘అన్న శ్రీశ్రీ కాలం నుంచి, ఎక్కడో నట్టడవిలో జరిగే ఎన్కౌంటర్ కథనాల్లోంచి సమాజం చాలా దూరం వచ్చింది.ఇప్పుడు గుండ్రాళ్ళు కాదు మానవ రహిత విమానాలతో బాంబుల వర్షం కురిపించాలని ప్రయత్నిస్తున్నారు. మనుషులను గ్రీన్ హంట్లా పేరా వేటాడుతూ ఎన్కౌంటర్లను నడినగరంలోకి తీసుకొచ్చారు. ఈ తెలుగు నెలలో కవులు ,రచయితలు నిర్బంధించపడుతున్నారు. ఇనుప పడగ నీడలో ప్రపంచమే ఆర్తనాదాలు చేస్తుంది. ఎందరో శ్రీశ్రీలు వచ్చి తమ తో గొంతు కలుపుతారని ఈ తెలుగు ఎదురుచూస్తుంది. శ్రీశ్రీలా కష్టజీవికి ఇరువైపులా ముందు వెనుక అన్ని తానే శ్రీశ్రీ లాంటి వారసుల కోసం నేటి సమాజం ఎదురుచూస్తోంది.

శోభరమేష్, 89786 56327
(నేడు మహాకవి శ్రీశ్రీ 115వ జయంతి)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News