రోదసీ రంగంలో సంస్కరణలతో
పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలు: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పుడు స్టార్టప్ సంస్కృతి నెలకొన్నదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. చిన్న పట్టణాల్లోని యువకులు కూడా స్టార్టప్లో భాగస్వాములవుతున్నారని ఆయన అన్నారు. రోదసీ రంగంలో చేపట్టిన సంస్కరణల వల్ల పలువురు ఆ రంగం పట్ల ఆసక్తి చూపుతున్నారని, రానున్న రోజుల్లో యూనివర్సిటీల్లోని యువకుల ద్వారా పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలు తయారు కానున్నాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం మన్కీబాత్ పేరుతో నిర్వహించిన రేడియో కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడారు.
హాకీ లెజెండ్ ధ్యాన్చంద్ పుట్టినరోజైన ఆగస్టు 29న ప్రతిఏటా జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నామని ప్రధాని గుర్తు చేశారు. ఇటీవలి ఒలింపిక్స్లో పురుషుల హాకీలో దేశానికి పతకం రావడాన్ని ప్రధాని ప్రస్తావించారు. నాలుగు దశాబ్దాల తర్వాత హాకీలో మరోసారి పతకం సాధించామని ప్రధాని అన్నారు. ధ్యాన్చంద్కు అదే మనమిచ్చే గొప్ప నివాళి అని ప్రధాని అన్నారు. ప్రపంచమంతా ఇప్పుడు భారత ఆధ్యాత్మిక సంప్రదాయాల పట్ల ఆసక్తి చూపుతోందని ప్రధాని అన్నారు. ఆ గొప్ప సంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని ప్రధాని అన్నారు. మన పండుగలకున్న శాస్త్రీయతను అర్థం చేసుకోవాలని ప్రధాని సూచించారు. ప్రతి పండుగలోనూ ఏదోఒక సందేశమున్నదని ప్రధాని అన్నారు.