స్టూడెంట్స్ను తీసుకెళుతున్న ఆటోను ఢీకొట్టడంతో మూడు సార్లు పల్టీ
లారీ టైరు కింద తల నుజ్జయి అక్కడికక్కడే మరణించిన అవంత్కుమార్
ఆటోను లారీ ఢీకొని విద్యార్థి మృతి
ఆరుగురు విద్యార్థులకు గాయాలు
బోడుప్పల్ : రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా మద్దురు మండలం మర్మముల గ్రామానికి చెందిన సుందరగిరి సంతోష్కుమార్ టిఎస్ఆర్టిసిలో కండక్టర్గా పని చేస్తున్నాడు. ఆయన తన కుటుంబంతో కలిసి ఉప్పల్ భరత్నగర్లో నివాసం ఉంటున్నాడు. సంతోష్కుమార్కు ఇద్దరు కొడుకులు వేదాంత్కుమార్(15), అవంత్కుమార్లు ఉన్నారు. హబ్సిగూడలోని భాష్యం పాఠశాలలో వీరు చదువుతున్నారు. ప్రతి రోజు మాదిరిగానే మంగళవారం వారు ఆటోలో పాఠశాలకు బయల్దేరారు.
విద్యార్థులతో వస్తున్న ఈ ఆటోను ఉప్పల్ రింగ్ రోడ్డు సమీపంలో ఇసుక లారీ వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో ఆటో మూడు పల్టీలు కొట్టింది. ఆటోలో వెళుతున్న అవాంత్కుమార్ లారీ టైర్ల కింద పడిపోయాడు. ఈ ఘటనలో అవంత్ కుమార్ తల నుజ్జునుజ్జై అక్కడికక్కడే చనిపోయాడు. అవంత్కుమార్ అన్న వేదాంత్కుమార్తో పాటు వర్షిత్కుమార్, నందిని, కీర్తి, వైష్ణవి, రితులకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. లారీ డ్రైవర్ నిర్లక్షం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం అవాంత్కుమార్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.