Tuesday, April 23, 2024

ఎపి మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం

- Advertisement -
- Advertisement -

Sudden death of AP Minister Gautam Reddy

గుండెపోటుతో సోమవారం ఉదయం హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో కన్నుమూత

జూబ్లీహిల్స్‌లోని మంత్రి స్వగృహంలో
భౌతికకాయానికి నివాళులర్పించిన తెలంగాణ
ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్
గౌతమ్‌రెడ్డి మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని
ప్రకటన కుటుంబసభ్యులను పరామర్శించిన
ఎపి సిఎం జగన్ దంపతులు ఉప రాష్ట్రపతి
వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ తమిళి
సై, మంత్రులు హరీశ్‌రావు, తలసాని, శ్రీనివాస్
గౌడ్ తదితరుల సంతాపం

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమ, ఐటి శాఖ ల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(50)కి గుండెపోటుతో నగరంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స సోమవారం నాడు కన్నుమూ శారు. మంత్రి గౌతమ్‌రెడ్డికి సోమవారం ఉదయం గుండెపోటు రావ డంతో కుటుంబ సభ్యులు నగరంలోని అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఉదయం 9.16 గంటలకు కన్నుమూశారు. కాగా ఉదయం 7.45 నిమిషాలకు అపోలో అసుపత్రికి చేరుకోగా దాదాపు 90 నిమిషాల పాటు గౌతమ్‌రెడ్డికి ఐసియూలో వైద్యులు అత్యవసర సేవలు అందించినా ఫలితం లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వారం రోజులపాటు దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గొన్న గౌత మ్‌రెడ్డి ఎపికి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో సంప్ర దింపులు జరిపి కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గొని ఆదివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుని రాత్రి జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరైన గౌతమ్‌రెడ్డి రాత్రి 9.45కి ఇంటికి చేరుకున్నారని కుటుంబ సభ్యులు వివరించారు.

అయితే సోమవారం ఉదయం 6.00 గంటలకి రోజూలాగే ఉదయాన్నే మేల్కొని 6:30 గం.ల వరకూ మంత్రి ఫోన్‌లో మాట్లాడి అనంతరం 7.00 గం.లకు నివాసంలోని రెండో అంతస్తు సోఫాలో కూర్చున్నారు. 7:12కి అత్యంత సన్నిహితంగా ఉండే డ్రైవర్ నాగేశ్వరరావును పిలవమని వంట మనిషికి మంత్రి చెప్పారు. 7:15గం.లకు హఠాత్తుగా గుండెపోటుతో సోఫా నుంచి మెల్లిగా కిందకి ఒరిగారు. 7:16 గం.లకు కంగారు పడి మంత్రి మేకపాటి సతీమణి శ్రీకీర్తి గట్టిగా అరిచారు. ఈక్రమంలో మంత్రి డైవర్‌గా పనిచేస్తున్న డ్రైవర్ నాగేశ్వరరావు 07:18 పరుగుపరుగున వచ్చి గుండె నొప్పితో ఇబ్బందిపడుతున్న గౌతమ్‌రెడ్డి ఛాతి మీద చేయితో నొక్కి స్వల్ప ఉపశమనం కలిగించారు. 07:20 గం.లకు మంత్రి మేకపాటి పక్కనే ఉన్న భార్య శ్రీకీర్తి అప్రమత్తమయ్యారు. 07:20 మంచినీరు కావాలని అడిగిన మంత్రి నీరు తెచ్చినా తాగలేని పరిస్థితుల్లో ఉండటంతో వ్యక్తిగత సిబ్బందిని భార్య శ్రీకీర్తి పిలిచారు. 07:22లకు గుండె నొప్పి పెడుతుంది కీర్తి‘ అంటూనే వెంటనే ఆస్పత్రికి వెళదామని సిబ్బందితో కలిసి మంత్రి బయలుదేరారు.

07:27కు ఇంటి నుంచి ఆస్పత్రికి గల 3 కి.మీ దూరాన్ని, అత్యంత వేగంగా కేవలం 5 నిమిషాల్లో అత్యవసర చికిత్స విభాగానికి మంత్రి మేకపాటిని డ్రైవర్, సిబ్బంది చేర్చారు. 08:15 గంటలకు పల్స్ బాగానే ఉంది, ప్రయత్నిస్తున్నామని వైద్యులు తెలిపారు. 09:13 గం.లకు మంత్రి మేకపాటి ఇక లేరని వైద్యులు నిర్ధారించారు. 09:15 గం.లకు మంత్రి మేకపాటి చనిపోయినట్లు అధికారికంగా ఆస్పత్రి వైద్యులు ప్రకటించారని మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే స్పందించని స్థితిలో మంత్రి ఆస్పత్రికి వచ్చారని, కార్డియాల్జిస్టులు, క్రిటిక్ల్ కేర్ వైద్యులు కలిసి తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయిందని అపో ఆసుపత్రి ప్రతినిధులు మీడియాకు వివరించారు.కాగా పారిశ్రామికవేత్త, మాజీ ఎంపి రాజమోహన్‌రెడ్డి కుమారుడు గౌతమ్‌రెడ్డి 1971 నవంబర్2న జన్మించారు. గౌతమ్‌రెడ్డి ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్‌సి పూర్తి చేసి 2014 అసెంబ్లీ ఎన్నికలతో రాజకీయ అరంగేట్రం చేశారు. నెల్లూరు జిల్లా అత్మకూరు నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంఎల్‌ఎగా గెలిచారు. ఈక్రమంలో 2019 జూన్ 8న ఎపి మంత్రిగా గౌతమ్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

ఎపి సిఎం దిగ్భ్రాంతి

ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం అత్యంత బాధాకరమని ఎపి ముఖ్యమంత్రి జగన్ అన్నారు. స్నేహితుడు, సహచర మంత్రిని కోల్పోవడం తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. జూబ్లీహిల్స్‌లోని గౌతమ్‌రెడ్డి స్వగృహంలో ఆయన భౌతికకాయానికి అంజలి ఘటించిన అనంతరం సిఎం ఆయన తండ్రి రాజమోహన్‌రెడ్డితోపాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. తీవ్ర ఆవేదనతో ఉన్న కుటుంబసభ్యులను ఓదార్చారు. కుమారుడి మృతితో కుంగిపోయిన గౌతమ్‌రెడ్డి తల్లి జగన్‌ను చూడగానే ఆయన చేతులు పట్టుకుని తీవ్రంగా రోదించారు. ఓదార్పుగా గౌతమ్‌రెడ్డి తండ్రి రాజమోహన్‌రెడ్డిని జగన్ కౌగిలించుకున్నారు. ఆ తర్వాత ఆయన పక్కనే కూర్చున్న ముఖ్యమంత్రి ఘటన వివరాలు తెలుసుకున్నారు. జగన్ సతీమణి భారతి గౌతమ్‌రెడ్డి భార్యను, తల్లిని ఓదార్చారు.

గౌతమ్‌రెడ్డి మృతి బాధాకరం : కెటిఆర్

ఆంధ్రప్రదేశ్ మంత్రి గౌతమ్ రెడ్డి మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో గౌతమ్‌రెడ్డి స్వగృహంలో భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. గౌతమ్ రెడ్డి అకాల మరణం తీరని లోటని, ఉజ్వల భవిష్యత్తున్న నాయకుడు మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. గౌతమ్‌తో తనకు 12 ఏళ్లుగా ఉన్న పరిచయాన్ని కెటిఆర్ గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి కెటిఆర్ గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిం చారు. గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని వారి కుటుంబసభ్యు లకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కెటిఆర్ అన్నారు.గత 12 ఏళ్లుగా గౌతమ్‌రెడ్డితో తనకు పరిచయం ఉందని, రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎన్నోసార్లు కలుసుకున్నామని చెప్పారు. ఇటీవలే 50వ పుట్టినరోజును జరుపుకున్న గౌతమ్ అకాల మరణం బాధాకరమన్నారు.మంచి మిత్రుడి మరణంతో షాక్‌కు గురయ్యానని కెటిఆర్ అన్నారు.

ప్రముఖుల సంతాపం

ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. గౌతమ్‌రెడ్డి పరమపదించడం అత్యంత విచారకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గౌతమ్‌రెడ్డి సౌమ్యులు, సంస్కారవంతులని, ప్రజా సమస్యల పట్ల అవగాహన, పని పట్ల నిబద్ధత కలిగిన నాయకుడన్నారు. గౌతమ్‌రెడ్డి తాత సమయం నుంచి ఆ కుటుంబంతో తనకు సాన్నిహిత్యం ఉందని వెంకయ్యనాయుడు వివరించారు. గౌతమ్ రెడ్డి మృతిపట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంతాపం ప్రకటించారు. అలాగే తనకు సన్నిహితుడైన మేకపాటి మరణం తీవ్రంగా కలిచివేసిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎంతో నిబద్ధతతో పనిచేసేవారని ఆయన గుర్తు చేసుకున్నారు.

పిన్నవయసులోనే ఆయన చనిపోవడం బాధాకరమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గౌతమ్ రెడ్డి మృతిపట్ల సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఉపసభాపతి పద్మారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజకీయ భవిష్యత్తు ఉన్న నేత మరణం కలచివేసిందని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. అపోలో ఆస్పత్రిలో గౌతమ్ మృతదేహానికి పువ్వాడ అజయ్ నివాళులర్పించారు. ఎపి మంత్రి గౌతమ్ రెడ్డి మృతిపట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపట్ల సిపిఐ నారాయణ సంతాపం తెలిపారు.అలాగే ఎపి మాజీ సిఎం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నిర్మాత సురేష్‌బాబు, సీనియర్ నేతలు కెవిపి రామచంద్రరావు, మైసూరారెడ్డి తదితరులు గౌతమ్‌రెడ్డికి నివాళులు అర్పించారు.

రెండు రోజులు సంతాప దినాలు

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మికంగా మృతి చెందడంతో సంతాప సూచకంగా ఎపిలో రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించారు. ప్రభుత్వ పూర్తి అధికార లాంఛనాలతో ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా స్థానిక అధికారులకు ఆదేశాలిచ్చారు. కాగా బుధవారం గౌతంరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

రేపు అంత్యక్రియలు

గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలను నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ సమీపంలో నిర్వహించనున్నారు. బుధవారం ఆయన సొంత గ్రామమైన బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో మంగళవారం ఉదయం నెల్లూరుకి ఎయిర్ అంబులెన్స్‌లో గౌతమ్‌రెడ్డి భౌతికకాయం తీసుకెళ్లి అక్కడ ప్రజల సందర్శనార్థం నెల్లూరులోని మేకపాటి గెస్ట్ హౌస్‌లో గౌతంరెడ్డి పార్థివ దేహాన్ని ఉంచునున్నారు. అంత్యక్రియల్లో ఎపి సిఎం జగన్, మంత్రులు, వైసిపి నేతలు పాల్గొననున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News