‘నిర్బయ’ తల్లి ఆశాదేవి ఆరాటం
న్యూఢిల్లీ : నా కుమార్తె నిర్భయ పై అత్యాచారానికి, హింసకు పాల్పడిన దోషులకు ఉరిశిక్ష పడినా, తన న్యాయపోరాటం అంతటితో ఆగిపోదని, అలాంటి బాధితులకు న్యాయం జరగడానికి నిరంతరం పోరాటం సాగిస్తానని ‘నిర్భయ’ తల్లి ఆశాదేవి స్పష్టం చేశారు. 2012 డిసెంబర్ 1617 తేదీల్లో 23 ఏళ్ల ఫిజియోథెరపీ విద్యార్థిని ఢిల్లీలో నడుస్తున్న బస్సులో దారుణంగా అత్యాచారానికి గురవడమే కాకుండా తరువాత క్రూరంగా హింసకు గురైంది. తరువాత సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ సంఘటన నిర్భయ కేసుగా సంచలనం కలిగించింది. ఇది జరిగి ఎనిమిదేళ్లు అయిన సందర్భంగా నిర్భయ తల్లి ఆశాదేవి ఆనాటి సంఘటనను గుర్తు చేసుకుని ఆందోళన వెలిబుచ్చారు. ఇలాంటి కేసుల్లో బాధితులకు సత్వరం న్యాయం జరిగేలా పోరాటం సాగించ వలసి ఉందన్నారు. తన కుమార్తె విషయంలో న్యాయం పొందడానికి ఎనిమిదేళ్లు పట్టిందని పేర్కొన్నారు.