Saturday, April 27, 2024

ప్రజా సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శం: పువ్వాడ

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేసే దిశగా సిఎం కెసిఆర్ సర్కారు దసరా కనుకగా నేటి నుండి మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టిందని, ప్రజా సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలువనుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం జిల్లా కేంద్రం రోటరీ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లాంఛనంగా “ముఖ్యమంత్రి అల్పాహారం” పథకాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి లతో కలిసి ఈ పథకాన్ని ప్రారంభించి చిన్నారులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడారు.

ప్రభుత్వం ఇప్పటికే ఉదయం వేళల్లో రాగిజావను అందిస్తుండగా మధ్యాహ్న భోజనాన్ని గుడ్డుతో పాటు అందిస్తున్నామన్నారు. ఈ రెండింటికి మధ్యలో ఇకపై అల్పాహారంగా కిచిడీ, పొంగల్‌, ఉప్మా వంటి వాటిని విద్యార్థులకు అందించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించడం మంచి విషయమని పువ్వాడ ప్రశంసించారు. అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని అన్ని స్థాయిల విద్యార్థులకు ఈ అల్పాహారాన్ని ఇక నుండి ప్రతి రోజూ ఇవ్వనున్నామని తెలియజేశారు.

ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలకు తల్లిదండ్రులు చదివించడానికి వెనుకాడే పరిస్థితుల నుంచి నేడు ఎమ్మేల్యే, స్థానిక సర్పంచ్, ఎంపిటిసి లు ఇతర ప్రజాప్రతినిధుల దగ్గరికి సిఫారసు కోసం వెళ్తున్నారంటే ప్రభుత్వ విద్య ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని అందుకు గాను బడ్జెట్ లో అధిక నిధులు విడుదల చేస్తూ విద్యా ప్రమాణాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిందని పువ్వాడ చెప్పారు.

ఒకప్పుడు పాఠశాలలో రేకుల షెడ్ల కింద వంట, దొడ్డు బియ్యంతో భోజనం, సరైన వ్యవస్థ లేక, అరకొర నిధులు, నిర్వహణ లోపం ఇలా అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడిన ఘటనలు చూశామన్నారు. కానీ నేడు ఆ పరిస్థితులను అధిగమించి ప్రతి పాఠశాలలో ప్రత్యేక కిచెన్ గదులు, నిధులు, బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయని పువ్వాడ పేర్కొన్నారు.

అందుకే సిఎం కెసిఆర్ ఉన్నతంగా ఆలోచించి విద్య అవశ్యకతను ప్రథమ కర్తవ్యంగా తీసుకుని మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి పథకాన్ని రూపొందించి దశల వారీగా అన్ని ప్రభుత్వం పాఠశాలలో కార్పొరేట్ కు ధీటుగా అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించడం జరిగిందని వివరించారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ విజయ్ కుమార్, డిఇఒ సోమ శేఖర్ శర్మ, ఎంఇఒ శ్రీనివాస్, కార్పొరేటర్ జాన్ భీ, ఉపాధ్యాయులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News