Thursday, April 18, 2024

రాష్ట్రంలో సస్యవిప్లవం

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ విధానాలతో పండుగలా మారిన వ్యవసాయం రైతు దినోత్సవ
సంబురాల్లో మంత్రులు రైతులకు గౌరవం తెచ్చింది కెసిఆరే : కవిత

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం నాడు రాష్ట్రంలో రైతు వేడుకలు నిర్వహించారు. వివిధ శాఖలకు చెందిన మంత్రలు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని రైతు మరింత ఊపునిచ్చారు. వేదికలమీద ప్రసంగాలకే పరిమితం కాకుండా చెర్నాకోల చేతపట్టి వివిధ జిల్లాల్లో మంత్రులు, ఎంఎల్‌ఎలు ఎడ్లబండ్లు తోలారు. తలకు పాగాచుట్టి రైతుల్లో మమేకమయ్యారు. గ్రామాల్లో పండగ వాతావరణం నింపారు. రైతులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఆరమరికలు లేకుండా కలిసిపోయారు. పంటల సాగు మొదలకు కుని రైతుల కుటుంబ యోగక్షేమాలు విచారించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతు దినోత్సవ కార్యక్రమాకి కొత్త వన్నెలద్దారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు పాల్గొని విత్తనాలు మొదలుకుని సస్యరక్షణ చర్యల దాకా పంటల సాగులో రైతులో రైతులకు దిశా నిర్దేశం చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలతో రాష్ట్రంలో వ్యవసాయ మరో విప్లవం ఆవిష్కృతమైందని ఈ ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రులు స్పష్టం చేశారు.

లాభదాయక సాగుపై దృష్టి పెట్టాలి
రాష్ట్రంలో రైతులకు మర్యాద తెచ్చింది కెసిఆర్ ప్ర భుత్వమే అని ఎంఎల్‌సి కల్వకుంట కవిత స్పష్టం చేశారు.కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం పద్మాజీవాడలో నిర్వహించిన రైతు దినోత్సవంలో కవిత పాల్గొని రైతుల నుద్దేశించి ప్రసంగించారు. రైతులు లాభదాయకమైన పంటల సాగువైపు దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రైతాంగం వి ధానాలతో సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని వి ద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా ఎండపల్లి గ్రామంలో జరిగిన రైతు దినోత్సవంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రం లో ధాన్యం దిగుబడి మూడింతలు పెరిగిందని తెలిపారు. గ్రామంలో రైతులు ఎండ్లబండ్లు ట్రాక్టర్ల ప్రదర్శనలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి ఎడ్లబండి తోలి రైతులను ఉత్సాహపరిచారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో జరిగిన రైతుదినోత్సవంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు , రైతుబీమా తదితర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గుత్తా పేర్కొన్నారు.

వ్యవసాయకుంటుంబాల్లో పండగ:పల్లా
ముఖ్యమంత్రి సారద్యంలో వ్యవసాయరంగం విప్లవాత్మక విజయాలను సాధిస్తోందని రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజశ్వర్‌రెడ్డి అన్నారు. ఉమ్మడివరంగల్ జిల్లాలో జరిగిన రైతుదినోత్సవ కార్యక్రమాల్లో పల్లా పాల్గాన్నారు. రైతుబంధు సమితి లక్ష్యాలను వివరించారు. ఎండ్లబండి తోలి హుషారెత్తించారు. ములుగు జిల్లా చల్వాయి గ్రామంలో జరిగిన రైతుదినోత్సవంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్షం అని మంత్రి వెల్లడించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం నర్సయ్యపల్లెలో నిర్వహించిన రైతుదినోత్సవంలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎండ్లబండిని తోలి రైతులను ఉత్సాహపరిచారు. తెలంగాణ వ్యవసాయ పథకాలు దేశానికే అదర్శంగా నిలిచాయని వెల్లడించారు.కరీంనగర్ జిల్లా దుర్షేడు గ్రామంలో జరిగిన రైతుదినోత్సవంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలతో వ్యవసాయం పట్ల రైతులకు ధీమా పెరిగిందని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన రైతుదినోత్సవ వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ రైతు సంక్షేమ పథకాల అమలు ద్వారావ్యవసాయం దండగకాదు పండుగ అని నిరూపించారని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో దేశాయిపేట రైతుదినోత్సవంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రైతులు తలెత్తుకుని బతకాలన్నారు. వివిధ జిల్లాల్లో జరిగిన రైతు దినోత్సవ కార్యక్యమాల్లో ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు , అధికారులు పాల్గొని రైతులకు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News