Wednesday, May 1, 2024

బయటకు రావొద్దు

- Advertisement -
- Advertisement -

Temperatures over 40 degrees in Telangana

మధ్యాహ్నం 12నుంచి 4గం.వరకు ఇళ్లల్లోనే ఉండండి

బండలను బద్ధలుచేసే ఎండలతో ఆరు
జిల్లాల్లో ఆరెంజ్ హెచ్చరికలు తప్పని
పరిస్థితుల్లో బయటకు వస్తే రక్షణ
చర్యలు తీసుకోవాలి తగిలిన
వారిని వెంటనే నీడలోకి తీసుకువెళ్లి
గాలి అడేలా చూడాలి అరగంటలోపు
లక్షణాలు తగ్గకపోతే వెంటనే ఆస్పత్రికి
తీసుకెళ్లాలి బయట
విధుల్లోని వారు నీరు,
పానీయాలు తాగాలి ప్రజారోగ్య శాఖ
సంచాలకులు డా. శ్రీనివాసరావు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు(డీహెచ్) డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఎండల తీవ్రత పెరిగిపోవడంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని తెలిపారు. ఎండల తీవ్రత దృష్టా ప్రజలు అవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. తప్పని పరిస్థితుల్లో బయటకు వస్తే రక్షణ చర్యలు తీసుకోవాలి తెలిపారు. కోఠిలోని ప్రజారోగ్యశాఖ కార్యాలయంలో గురువారం డీహెచ్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు.

వడదెబ్బ తగిలిన వారిని వెంటనే నీడలోకి తీసుకువెళ్లి గాలి అడేలా చూడాలని, అరగంటలోపు లక్షణాలు తగ్గకపోతే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని వెల్లడించారు. నిరంతరం బయట ఉంటూ విధులు నిర్వహించే వాళ్లు ఎక్కువగా నీరు, పానీయాలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు , ఐవీ ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు వీలైనంత వరకు బయటకు రావొద్దని చెప్పారు. కలుషిత నీరు, నిల్వ చేసిన ఆహారం తీసుకోవద్దని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారని అన్నారు. వడగాల్పుల తీవ్రత అధికంగా ఉందని చెప్పారు. 2015లో వడదెబ్బ, సన్ స్ట్రోక్ ఎక్కువగా మరణాలు సంభవించాయని, ఈసారి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఎండలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు తమ టైమ్ మ్ సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ మధ్య ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని, వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.వీలైనంతవరకు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలని సూచించారు.

వడదెబ్బ లక్షణాలివే..

చెమట రాకపోవడం, నాలుక ఎండిపోవడం, పెదాలు పగిలిపోవడం, నీరసంగా ఉండటం, తలనొప్పి, వికారంగా ఉండటం, గుండెదడ, మూత్రం రాకపోవడం లాంటి లక్షణాలు వడదెబ్బ లక్షణాలు అని డీహెచ్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఇలాంటి లక్షణాలు ఉన్న వారిని వెంటనే సమీపంలోని చల్లని ప్రాంతానికి తీసుకెళ్లి, పానీయాలు అందించాలని సూచించారు. గాలి బాగా తగిలేటట్లు చూడాలని, కుదుట పడకపోతే తక్షణమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వైద్యం అందించాలని, అప్పుడు వడదెబ్బ నుంచి బయటపడే అవకాశం ఉందని ప్రజారోగ్య సంచాలకులు పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు, జర్నలిస్టులు, వైద్యులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఆహారం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి

కలుషితం లేని నీటిని మాత్రమే తీసుకోవాలని శ్రీనివాస్ రావు చెప్పారు. కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటి పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, మసాలాలు తీసుకోవద్దని సూచించారు.

అందుబాటులో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు

అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ సెంటర్లలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచామని డీహెచ్ అన్నారు. వృద్ధులు, పిల్లలతో పాటు గర్భిణి స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. గర్భిణి స్త్రీలు ఆస్పత్రులకు వెళ్లాలనుకుంటే ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో మాత్రమే వెళ్లాలని డీహెచ్ శ్రీనివాస్ రావు సూచించారు.

ఏ వైరస్ వచ్చినా తగ్గేదేలే

కరోనా పూర్తిగా అదుపులో ఉందని డీహెచ్ శ్రీనివాసరావు అన్నారు. ఎన్ని వేరియంట్లు వచ్చినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎలాంటి వైరస్‌లు వచ్చినా తగ్గేదేలే అంటూ సినిమా డైలాగ్ చెబుతూ డీహెచ్ ఉత్సాహంగా సినిమా డైలాగులు చెప్పారు. రాష్ట్రంలో కరోనా నిబంధనలేవీ లేనప్పటికీ.. వ్యక్తిగత బాధ్యతగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని సూచించారు. కేంద్రం కొవిడ్ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసిందని చెప్పారు. కరోనా పూర్తిగా తొలగిపోలేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో కరోనా పూర్తిగా అదుపులో ఉందని.. కేవలం 30 నుంచి 40 కేసులు మాత్రమే నమోదవుతున్నాయన్నారు. సుమారు 20 జిల్లాల్లో అసలు కేసులే నమోదుకావట్లేదని పేర్కొన్నారు. భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో జీరో కేసులు నమోదవుతావుతాయని ఆకాంక్షించారు. ఇకపై ఎలాంటి వేరియంట్లు వచ్చినా ఎదుర్కొనేందుకు ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇకపై వేరియంట్లన్నీ గుంపులుగా వచ్చినా.. ఒక్కొక్కటిగా వచ్చినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎలాంటి వైరస్ వచ్చినా వైద్య సేవలు అందించటంలో తగ్గేదేలే అని డైలాగ్ చెబుతూ ఉత్సాహపరిచారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News