Friday, March 29, 2024

నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న పదిమంది అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న పదిమంది నిందితులను సైబరాబాద్ ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. పట్టుకున్న వారి వద్ద నుంచి 3.35 టన్నుల పత్తి విత్తనాలు, 10 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పత్తి విత్తనాల విలువ రూ.90లక్షలు ఉంటుంది. రెండు ముఠాల నుంచి నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిర్మల్ జిల్లాకు చెందిన అబ్దుల్ రజాక్, మంచిర్యాల జిల్లాకు చెందిన ముండ్రు మల్లికార్జున్, మైదం శ్రీనివాస్, పొట్లపల్లి హరీష్, అబ్దుల్ రఫీ, ఐలయ్య,జానీ, కమలేష్ కలిసి నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారు. వీరు ప్రణతీ కాటన్ సీడ్స్ పేరుతో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారు. వీరి వద నుంచి 2,530 కిలోల పత్తివిత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. భైంసాకు చెందిన అబ్దుల్ రజాక్ పత్తి విత్తనాల వ్యాపారం చేస్తున్నాడు. తన వ్యాపార భాగస్వామి జానీ, హరీష్, శ్రీనివాస్, ఐలయ్య, మల్లిఖార్జున్ ఉన్నారు.

రజాక్ బిజి3 కాటన్ విత్తనాలు గుజరాత్‌కు చెందిన కమలేస్ వద్ద కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకుని వచ్చాడు. వాటిని మేడ్చెల్ సమీపంలోని రైల్వే స్టేషన్ వద్ద ఉన్నరూమ్‌లో నిల్వ చేశారు. వాటిని ప్యాకెట్లలో నింపి రైతులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉంచారు. ఈ విషయం తెలియడంతో మేడ్చెల్ ఎస్‌ఓటి పోలీసులు దాడి చేసిపట్టుకున్నారు. కాగా, నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఐదుగురిని రాజేంద్రనగర్ ఎస్‌ఓటి పోలీసులు పట్టుకోగా, ఇద్దరు పరారీలో ఉన్నారు.ఎపిలోని నంద్యాల జిల్లా చెందిన కొత్త తుర్క అలీషా అలియాస్ భాషా, చెర్లపల్లికి చెందిన ఉబ్బాని రాజు, తిప్పరబోయిన వెంకటేష్, సోమగాని వేణు కుమార్, కావాలి మల్లయ్య, బాబురావు, రోశయ్య కలిసి నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారు.

తుర్క అలీషా అలియాస్ భాష కర్నూలులోని గౌతమీ సీడ్స్‌లో పనిచేస్తున్నాడు. పలు కంపెనీల వద్ద ఫౌండేషన్ సీడ్స్‌నుసేకరిస్తున్నాడు. ఈ ఏడాది సేకరించిన గారిమినేటెడ్ టెస్ట్ ఫేయిల్ అయిన సీడ్స్‌ను సేకరించి ఓ రూములో నిల్వ చేశాడు. బిటి విత్తనాలకు మార్కెట్‌లో డిమాండ్ ఉండడంతో వాటిని రైతులకు విక్రయించాలని ప్లాన్ వేశాడు. వాటిని కర్నూలు నుంచి చేవెళ్ల శివారులోకి తీసుకుని రావాలని ప్లాన్ వేశాడు. పౌచ్‌లను తయారు చేసేందుకు రాజు అనే వ్యక్తిని సంప్రదించాడు. రాజు శ్రీనిత్య ప్యాకర్‌సలో పనిచేస్తున్నాడు. రాజు వీరికి నూజివీడు, విన్ననర్ తదితర సీడ్స్‌కు సంబంధించిన ప్యాకెట్లను ముద్రించి అందజేశాడు. ఈ విషయం తెలియడంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వికారాబాద్‌కు చెందిన మల్లయ్య బిజి 3 విత్తనాలను పల్లవి సీడ్స్ పేరుతో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నాడు. నిందితులను ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News