Friday, May 3, 2024

ఆర్టీసి బస్సుల్లో రద్దీ పెరిగింది

- Advertisement -
- Advertisement -

రద్దీకి అనుగుణంగా బస్సులను నడుపుతాం
రద్దీ సమయాల్లో ప్రయాణికులు కొంత సంయమనం పాటించి సిబ్బందికి సహకరించాలి
జూబ్లీ బస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎండి సజ్జనార్

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రవేశపెట్టగానే రద్దీ పెరిగిందని, అందుకు అనుగుణంగా బస్సులను నడిపేందుకు ప్లాన్ చేస్తున్నామని ఆర్టీసి ఎండి సజ్జనార్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్ (జేబిఎస్)ను సోమవారం ఎండి విసి సజ్జనార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమలు తీరుపై ఆయన క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. అనంతరం జేబిఎస్- వెంకట్ రెడ్డి నగర్ (రూట్ నెంబర్ 18 వి/జే) సిటీ ఆర్డినరీ బస్సులో మెట్టుగూడ వరకు ఎండి ప్రయాణించారు.

అందులో మహిళా ప్రయాణికులకు జీరో టికెట్‌ను ఎండి సజ్జనార్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి మంచి స్పందన వస్తోందన్నారు. రద్దీ సమయాల్లో ప్రయాణికులు కొంత సమయనం పాటించి సిబ్బందికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా చిన్నపాటి పొరపాట్లు జరిగితే ఆర్టీసి అధికారుల దృష్టికి తీసుకురావాలని, 24 గంటలు అందుబాటులో ఉండే సంస్థ కాల్ సెంటర్ నెంబర్‌కైనా 040-69440000, 040-23450033 ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టిఎస్ ఆర్టీసి అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసి వాటిపై 40 వేల మంది సిబ్బందికి అవగాహన కల్పించామని ఆయన గుర్తు చేశారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ స్థానికతను నిర్థారించుకునేందుకు తమ ఆధార్ కార్డులను సిబ్బందికి చూపించి సంస్థకు సహకరించాలని ఎండి కోరారు. త్వరలోనే మహిళలకు స్మార్ట్ కార్డ్ జారీ చేస్తామని సజ్జనార్ ప్రకటించారు.

Sajjanar 2

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News